ఈ ఏడాది ఏప్రిల్ వరకు తటస్థ పరిస్థితులు ఉండగా తాజాగా తూర్పు, మధ్య పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల నేపథ్యంలో ఎల్‌నినో ప్రారంభమైందని ఇన్‌కాయిస్ ప్రకటించింది. ప్రస్తుత మే నుంచి 2027 జనవరి వరకు ఈ పరిస్థితులు కొనసాగుతాయని ఇన్‌కాయిస్ మంగళవారం ఓ బులెటిన్‌లో స్పష్టం చేసింది. ఇన్‌కాయిస్ ప్రత్యేకంగా రూపొందించిన బేయేసియన్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్ (బీసీఎనఎన్) అనే డీప్ లెర్నింగ్ మోడల్ ద్వారా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను విశ్లేషించి అంచనాలను రూపొందించినట్లు పేర్కొంది. దీనిద్వారా భవిష్యత్తులో వచ్చే ఎల్‌నినో లేదా లానినా పరిస్థితులను 24 నెలల ముందస్తుగా అంచనా వేసే అవకాశం ఉందని తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు నెలకొనడం వల్ల భారత వేసవి రుతుపవన వర్షపాతంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్‌నినో వల్ల ఉత్తర హిందూ మహాసముద్రంలో బలమైన, సుదీర్ఘ సముద్రపు వేడిగాలులు ఏర్పడుతున్నాయని, ఇవి పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాయని వెల్లడించింది.