వాతావరణ సమాచారాన్ని మరింత పక్కాగా అందించాలనే లక్ష్యంతో 2,600 కోట్ల రూపాయలతో రూపొందించిన ‘మిషన్‌ మౌసం’ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మృత్యుంజయ మహాపాత్ర తెలియచేశారు. వాతావరణ, సముద్ర అధ్యయన విభాగం 75వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న మహాపాత్ర విలేకరులతో అన్నారు. దేశంలో ఏ ప్రాంతంలో ప్రకృతి విపత్తు సంభవించినా వెంటనే తెలుసుకునేందుకు ఉపయోగపడే ప్రస్తుతం పనిచేస్తున్న 39 రాడార్లకు తోడు మరో 50 డాప్లర్‌ వెదర్‌ రాడార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, మచిలీపట్నంలలో కూడా కొత్త రాడార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.