ధాన్యం ఎప్పుడు అమ్మాలో రైతులే నిర్ణయించుకునే వెసులుబాటు
రైతులు ధాన్యాన్ని ఎప్పుడు, ఎక్కడ అమ్ముకోవాలో రైతులే నిర్ణయించుకొనేలా మొబైల్ ద్వారా కూపన్ సృష్టించుకునే ఏర్పాటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ధాన్యం అమ్మకంలో రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. గోతాల సరఫరా నుంచి రవాణా వరకు అన్ని విధానాలనూ సులభతరం చేస్తున్నామని పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మింగ్ విధానంలో భాగంగా ఏఐ ద్వారా ప్రత్యేక వాయిస్ సేవల పైనా మార్గదర్శనం చేస్తున్నామని పేర్కొన్నారు.
వాట్సప్లోనే కూపన్
మొబైల్ ద్వారా కూపన్ తయారు చేసేందుకు పౌరసరఫరాలశాఖ 7337359375 అనే వాట్సప్ నంబరును కేటాయించింది.
- ఈ నంబరుకు హాయ్ అని సందేశం పంపిస్తే.. ‘పౌరసరఫరాల సంస్థకు సుస్వాగతం.. ధాన్యం అమ్మడానికి షెడ్యూల్ బుక్ చేసుకోండి’ అని వస్తుంది. షెడ్యూల్ ఎంపిక చేసుకున్నాక… ఆధార్ నంబరును నమోదు చేయాలి.
- రైతు పేరును ధృవీకరించాక.. కొనుగోలు కేంద్రాన్ని ఎంచుకోవాలి. అమ్మాల్సిన తేదీకి మూడు ఆప్షన్లు ఇస్తారు. అందులో ఒక తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకోవాలి. ధాన్యం రకం, ఎన్ని బస్తాలో తెలియజేయాలి. తర్వాత ధాన్యం అమ్మకానికి స్లాట్ బుక్ అయినట్లు మొబైల్ ఫోన్కు సందేశం వస్తుంది.

