దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కల్తీ పాల సంఘటనలు చోటు చేసుకోవడంతో రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఫుడ్ కమిషనర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచనలు జారీ చేసింది. పాల సహకార సంఘాల సభ్యులు మినహా పాల ఉత్పత్తిదార్లు, విక్రయదార్లందరూ తప్పకుండా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సూచించింది. అంటే ఇకపై ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ లేకుంటే వీళ్లు పాల వ్యాపారాలను నిర్వహించొద్దు. ‘ఇటీవల కొన్ని చోట్ల పాలల్లో కల్తీ జరిగి నట్లు వార్తలు వచ్ౘ్ిన దృష్ట్యా… రిజిస్ట్రేషన్/ లైసెన్సింగ్ నిబంధనలు పాటింపులో కఠినంగా వ్యవహరించాల’ని వారికి ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ఆహార ఉత్పత్తుల వ్యాపారాల కోసం రిజిస్ట్రేషన్ లేదా లైసెన్సు తీసుకోకుండానే కొందరు పాల విక్రయదార్లు, ఉత్పత్తిదార్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పేర్కొంది. అందువల్ల పాల ఉత్పత్తిదార్లు, విక్రయదార్ల దగ్గర నిర్దిష్ట రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్/లైసెన్సు ఉందా? అని పరిశీలించాల్సిందిగా కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన అధికారులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. నిల్వ ఉష్ణోగ్రతల నిర్వహణలో నిబంధనలను సరిగ్గా పాటిస్తున్నారా? లేదా అని మిల్క్ చిల్లర్స్‌ను కూడా పరిశీలించాల్సిందిగా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.