తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్య రంగాల్లో సహకార వ్యవస్థ విస్తరణకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, సహకార రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆదాయ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర సహకార అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించగా.. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆశిష్‌కుమార్, అదనపు కార్యదర్శి సిద్ధార్థ్ జైన్, సంచాలకుడు సత్య, రాష్ట్ర సహకార, పశుసంవర్ధక శాఖ కార్యదర్శులు సురేంద్ర మోహన్, ఇలంబర్తి, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. సీఎస్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో సహకార ఉద్యమం బలంగా ఉంది. సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడంలో, గ్రామీణ స్థాయిలో ఆర్థిక సాధికారత కీలక పాత్ర పోషిస్తోంది. మెరుగైన పాలన, డిజిటల్ సమీకరణ, ఆర్థిక నిర్వహణ, సామర్థ్య వృద్ధి ద్వారా సహకార సంఘాలను పటిష్ఠం చేస్తున్నాం” అని తెలిపారు. ఆశిష్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ మౌలిక వసతుల నిధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.