ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో (డీసీసీబీ) యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా ఉమ్మడి పశ్చిమగోదావరిలోని సహకార బ్యాంకుల్లో సోమవారం ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి దాకా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేసే విధానం, ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలు సహకార బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన రైతులకు లేకపోయేసరికి ప్రధానంగా పొగాకు, ఆయిల్ పామ్, కోకో రైతులు వాణిజ్య బ్యాంకుల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ రైతుల సరకు విక్రయ లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే ముడిపడి ఉంటున్నాయి. దీంతో ఈ రకమైన యూపీఐ సేవలు సహకార బ్యాంకుల్లో ప్రారంభించే విషయంపై ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఉన్నతాధికారులతో మాట్లాడి తొలుత తన సొంత జిల్లా ఉమ్మడి పశ్చిమ నుంచే దీనికి శ్రీకారం చుట్టారు. ఇకపై ఖాతాదారులు మొబైల్ ఫోన్లను వినియోగించి తక్షణమే ఇతరులకు డబ్బులు పంపొచ్చు. స్వీకరించొచ్చు. నగదు రహిత సేవలను ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా బ్రాంచిని సందర్శించకుండా వినియోగించుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సహకార బ్యాంకుల్లో త్వరలోనే యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.