హైడ్రోపోనిక్ విధానంలో క్యాప్సికం సాగు
రాజస్థాన్లోని అల్వర్ నగరానికి చెందిన యువ ఐఏఎస్ అధికారి ప్రేమ్ ప్రకాశ్ మీనా పాలీహౌస్లో మట్టి లేని సాగు (హైడ్రోపోనిక్) విధానంలో చేపట్టిన క్యాప్సికం సాగు, సాధించిన విజయం ఆ చుట్టుపక్కల రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. మూడేళ్ల కిందట సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ వీడియో చూసి ప్రేమ్ ప్రకాశ్ ఈ హైటెక్ సాగుకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు దిల్లీ, గురుగ్రామ్ వంటి మెట్రోపాలిటన్ నగరాల మార్కెట్లకు దిగుబడులను సరఫరా చేస్తున్నారు. అల్వర్ నగర సమీపంలో ప్రేమ్ ప్రకాశ్ కుటుంబానికి అయిదెకరాల పొలం ఉంది. ప్రస్తుతం సాగు బాధ్యతలను ఆయన తండ్రి కదురాం మీనా పర్యవేక్షిస్తున్నారు. ఒక పాలీహౌస్తో ప్రారంభించిన ఈ సాగు డిమాండు పెరడగంతో మూడు పాలీహౌస్లకు చేరింది. పాలీహౌస్ల మీద ఉద్యాన శాఖ ఇస్తున్న 70 శాతం రాయితీ పెట్టుబడి భారాన్ని తగ్గించింది. జైపుర్ నుంచి నాణ్యమైన ఎరుపు, పసుపు క్యాప్సికం విత్తనాలు తెప్పించారు. మొత్తం 18,000 మొక్కలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. గతేడాది 32 టన్నుల దిగుబడి రాగా, ఈ ఏడాది 40 టన్నులు అంచనా వేస్తున్నారు.


