ఈ ఏడాది సాధారణానికి మించి
తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వర్షాలకు అవకాశం
భారత వాతావరణ విభాగం వెల్లడి

వ్యవసాయ రంగానికి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలం (జూన్‌-సెప్టెంబరు)లో దేశ వ్యాప్తంగా సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో భూవిజ్ఞాన శాస్త్ర శాఖ కార్యదర్శి ఎం. రవిచంద్రన్‌, ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 1971 నుంచి 2020 వరకు ఉన్న గణాంకాల ఆధారంగా చూస్తే.. దేశవ్యాప్తంగా దీర్ఘకాలంలో సగటున 87 సెంటీమీటర్ల వర్షం కురుస్తూ వస్తోందని, ఇప్పుడు అందులో 105% దాకా వర్షాలు పడొచ్చని వారు పేర్కొన్నారు. అలాగే సాధారణానికి మించి, అధిక వర్షపాత అంచనాలు కలిపి చూస్తే మంచి వర్షాలకు 56% అవకాశం ఉందని వివరించారు. ఈ ఏడాది ఎల్‌నినో ఏర్పడే పరిస్థితులు లేవని చెప్పారు. డిసెంబరు-మార్చి మధ్య హిమాలయాలు, యూరో ఏసియా ప్రాంతంలో మంచు తక్కువగా ఉందని తెలిపారు. ఇవన్నీ మంచి వర్షాలు కురవడానికి శుభపరిణామాలని పేర్కొన్నారు. అలాగే జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌, ఈశాన్య రాష్ట్రాలు, తమిళనాడు, బిహార్‌లలో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని, మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువ వానలు కురిసే వీలుందని వివరించారు. జూన్‌-సెప్టెంబరు మధ్య ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో సాధారణానికి మించి వర్షాలు ఉండొచ్చని చెప్పారు. ప్రత్యేకించి ఏపీలోని ఉత్తర కోస్తాలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ వర్షాలు ఉండొచ్చని అంచనా వేశారు.