సింగి (మార్పు) చేపల పెంపకంలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు

ఎటిరోనుస్టిస్ ఫాజిల్స్ (Heteropneustes fossilis) ను సాధారణంగా “స్టింగింగ్ క్యాట్‌ఫిష్” లేదా “సింగి” చేపగా తెలుగులో సింగి చేపను ‘మార్పు’ అని పిలుస్తారు. ఇది కాకుండా, సాధారణంగా ఈ జాతికి చెందిన క్యాట్‌ఫిష్ రకాలను తెలుగులో ‘జల్లెలు’ లేదా ‘నల్ల జల్లెలు’ అని కూడా అంటారు. ఈ చేపలు ముళ్లు తక్కువగా ఉండి, రుచికి చాలా బాగుంటాయి.

అధిక పోషక విలువలు మరియు ఔషధ గుణాల కారణంగా ఈ చేపలకు వినియోగదారులలో మంచి ఆదరణతో పాటు మార్కెట్లో అధిక డిమాండ్ కూడా ఉంది. అందువల్ల దీనిని అధిక విలువ కలిగిన ఆహార చేపలుగా పరిగణిస్తారు. మార్కెట్లో ఈ చేప ధర కిలోకు రూ.500-800 వరకు ఉండే అవకాశం ఉంది.

ప్రత్యేకంగా RAS మరియు బయోఫ్లాక్ సాగు విధానాల్లో ఆక్వాకల్చర్ విభిన్నీకరణకు ఈ చేప ఒక మంచి అవకాశవంతమైన జాతిగా గుర్తింపు పొందుతోంది. అయితే, సింగి చేపల పెంపకంలో ప్రధాన సమస్య నాణ్యమైన పిల్లల (సీడ్) లభ్యత తగినంత లేకపోవడమే.

జాతీయ మంచినీటి చేపల పెంపక సంస్థ, భువనేశ్వర్ వారు సింగి క్యాట్‌ఫిష్ హ్యాచరీ, చేప పిల్లల ఉత్పత్తి మరియు గ్రో-అవుట్ కల్చర్ సాంకేతికతను అభివృద్ధి చేసింది. అంతేకాకుండా, ఈ సంస్థ దేశవ్యాప్తంగా రైతులు మరియు ఇతర భాగస్వాములకు సింగి చేపల కృత్రిమ ప్రజననం, చేప పిల్లల ఉత్పత్తి మరియు పెంపక సాంకేతికతలను ప్రదర్శించడం, విస్తరించడం వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది.

తల్లి చేపల పెంపకo నిర్వహణ:
బ్రూడర్ చేపలను చిన్న చెరువులు (100–200 చదరపు మీటర్లు) లేదా సిమెంట్ ట్యాంకులు (50–100 చదరపు మీటర్లు)లో ప్రతి చదరపు మీటరుకు 3–4 చేపల సాంద్రతతో పెంచుతారు. బంధీ పరిస్థితుల్లో (captivity) పరిపక్వత సాధించేందుకు బ్రూడర్లకు అత్యుత్తమ నీటి నాణ్యత మరియు సరైన పోషకాహారం అవసరం.

ట్యాంక్ విధానంలో తల్లి చేపల పెంపకానికి 4–6 సెం.మీ మట్టిపొర ఉన్న సిమెంట్ ట్యాంకులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. బ్రూడర్లకు రోజుకు రెండు సార్లు 30–35% ప్రోటీన్ కలిగిన ఫిష్‌మీల్ ఆధారిత ఆహారాన్ని శరీర బరువులో 3-4% మోతాదులో అందిస్తారు.

తల్లి చేపల పెంపక చెరువులు లేదా ట్యాంకుల్లో నీటి నాణ్యతను సరైన స్థాయిలో ఉంచాలి. ఇందుకు నీటి ఉదజని 7.8–8.5, నీటిలో కరిగిన ఆక్సిజన్ 4–6 పి పి యం, మొత్తం కాఠిన్యం 80–180 పి పి యం, మొత్తం ఆల్కలినిటీ 80–180 పి పి యం స్థాయిలో ఉండేలా ప్రతి రెండు వారాలకు 20–30% నీటిని మార్చాలి. సహజ ఆహారం ఉత్పత్తి కావడం మరియు నీటి నాణ్యత మెరుగుపడేందుకు బ్రూడర్ చెరువులకు కాలానుగుణంగా ఎరువులు వేయాలి.

తల్లి చేపల ఎంపిక:
ఎటిరోనుస్టిస్ ఫాజిల్స్ లేదా సింగి చేప ఒక సంవత్సరం వయస్సులో లైంగిక పరిపక్వతను పొందుతుంది. సాధారణంగా వర్షాకాలం (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు)లో ప్రజననం చేస్తుంది.

60–200 గ్రాముల బరువు కలిగిన బ్రూడ్ చేపలు కృత్రిమ ప్రజనానికి అనుకూల పరిమాణంగా పరిగణిస్తారు. ద్వితీయ లైంగిక లక్షణాల ఆధారంగా మగ మరియు ఆడ చేపలను గుర్తించవచ్చు.

ప్రజనన కాలంలో మగ చేపలో పొడవుగా ఉన్న జనన పాపిల్లా కనిపిస్తుంది. ఆడ చేపలో పొట్ట ఉబ్బినట్లుగా ఉంటుంది. ఎంపిక చేసిన బ్రూడర్లను ముందుగానే సేకరించి, ప్రజనన కార్యక్రమం కోసం వేర్వేరుగా ట్యాంకుల్లో ఉంచుతారు.

ప్రేరేపిత ప్రజననం:
సింగి చేపల ప్రజననానికి సాధారణంగా ఓవప్రీమ్ / ఓవా టైడ్, / ఓవా -ఎఫ్ హెచ్, గోనోప్రో, స్పాన్ ప్రో వంటి సింథటిక్ హార్మోన్లు ఉపయోగిస్తారు. బ్రూడర్ల శరీర బరువుకు కిలోకు 1.0–1.5 మి.లీ హార్మోన్ మోతాదును ఇస్తారు.
మగ : ఆడ నిష్పత్తిని 2 : 1 గా నిర్వహిస్తారు. సింగి చేపల్లో సహజ స్పానింగ్ కనిపిస్తుంది. హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చిన 10–14 గంటల తరువాత, బ్రూడర్ పరిస్థితి మరియు హార్మోన్ ప్రతిస్పందన ఆధారంగా స్పానింగ్ జరుగుతుంది.
కొంతమంది రైతులు గుడ్ల సేకరణ కోసం “డ్రై స్ట్రిప్పింగ్” పద్ధతిని అనుసరిస్తారు. అయితే ఈ విధానంలో మగ చేపలను త్యాగం చేసి వీర్య ద్రావణం తయారు చేయాల్సి ఉంటుంది. ఇది మగూర్ చేపల పద్ధతికి సమానంగా ఉంటుంది.

60–200 గ్రాముల బరువు ఉన్న ఆడ చేపలో సాధారణంగా 5,000–18,000 గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ఫలదీకరణ పొందిన గుడ్లు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి అడుగుభాగంలో స్థిరపడతాయి. ఫలదీకరణం కాని గుడ్లు తెల్లటి రంగులో ఉండి నీటి పైభాగంలో తేలుతాయి. హ్యాచరీ పరిస్థితుల్లో సాధారణంగా 70–90% ఫర్టిలైజేషన్ రేటు కనిపిస్తుంది.

గుడ్ల ఇంక్యూబేషన్ మరియు హ్యాచింగ్:
ఫలదీకరణ పొందిన గుడ్లను ప్రవహించే నీటి వ్యవస్థ కలిగిన టబ్బులు లేదా ట్యాంకుల్లో ఇంక్యూబేట్ చేస్తారు. మెరుగైన హ్యాచింగ్ కోసం నీటి ప్రవాహం మరియు స్వల్ప గాలివేత కొనసాగిస్తారు.

నీటి ఉష్ణోగ్రత ఆధారంగా 16–20 గంటల్లో హ్యాచింగ్ జరుగుతుంది. సాధారణ ఉష్ణోగ్రత వద్ద flow-through వ్యవస్థలో 60–80% వరకు హ్యాచింగ్ శాతం కనిపిస్తుంది.

ఫలదీకరణం కాని గుడ్లు మరియు చనిపోయిన గుడ్ల పొరలను వెంటనే తొలగించాలి. కొత్తగా పుట్టిన లార్వాలో పెద్ద యోక్ సాక్ ఉంటుంది. ఇది 2–3 రోజులలో పూర్తిగా శోషించబడుతుంది.

లార్వా పెంపకం:

నీటి నాణ్యత నిర్వహణ:
కొత్తగా బయటకు వచ్చిన హ్యాచ్‌లింగ్స్ పొడవు సుమారు 2–3 మి.మీ. ఉండి, పెద్ద యోక్ సాక్‌ను కలిగి ఉంటాయి. రెండు రోజుల తరువాత ఆరోగ్యకరమైన లార్వాలు ట్యాంక్ మూలల వైపు ఈదుతూ గుంపులుగా ఉండటం ప్రారంభిస్తాయి.
8–12 రోజుల వయస్సు తరువాత గాలి ద్వారా శ్వాస ప్రారంభమవుతుంది. అందువల్ల లార్వా పెంపక ట్యాంకుల్లో నీటిలో కరిగిన ఆక్సిజన్ సరైన స్థాయిని నిలుపుకునేందుకు నిరంతర స్వల్ప గాలివేత అవసరం.
లార్వా ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచాలి. రోజుకు రెండు సార్లు 30–50% నీటిని మార్చడం మంచిది. నీటి లోతును 30–50 సెం.మీ. వరకు ఉంచాలి.
లార్వాలను ఇండోర్ ట్యాంకుల్లో 15–20 రోజుల పాటు ప్రతి చదరపు మీటరుకు 1000–2000 లార్వాల సాంద్రతతో పెంచాలి.

లార్వా ఆహార నిర్వహణ:
జూప్లాంక్టన్‌లు (ట్యూబిఫెక్స్, కోపీపాడ్), మోయినా, ఆర్టీమియా ప్రధాన లార్వా ఆహారంగా ఉపయోగిస్తారు. ప్రారంభ దశలో మిశ్రమ జంతు ప్లవకాలు చాలా మంచి ఆహారంగా పనిచేస్తాయి.
15వ రోజు నుండి క్రమంగా ప్రత్యక్ష ఆహారాన్ని తగ్గిస్తూ, 35% క్రూడ్ ప్రోటీన్ మరియు 8% క్రూడ్ లిపిడ్ కలిగిన తయారుచేసిన ఆహారాన్ని ఇవ్వడం వల్ల లార్వా వృద్ధి మరియు జీవన శాతం మెరుగుపడుతుంది.
లార్వాలకు రోజుకు 2–3 సార్లు అవసరానికి అనుగుణంగా ఆహారం ఇవ్వాలి. కనీసం 15 రోజుల పెంపకం తరువాత వీటిని ఫింగర్లింగ్ ఉత్పత్తి కోసం మట్టి చెరువులు లేదా సిమెంట్ ట్యాంకులకు మార్చవచ్చు. ఇండోర్ ట్యాంక్ పెంపకంలో సాధారణంగా 60–80% జీవన శాతం కనిపిస్తుంది.

ఫింగర్లింగ్ ఉత్పత్తి
ఫింగర్లింగ్ ఉత్పత్తి కోసం ఉపయోగించే సిమెంట్ ట్యాంకుల్లో 2–3 సెం.మీ మందంతో మట్టిపొర ఉండాలి. నీటి లోతు 30–50 సెం.మీ.గా నిర్వహించాలి.
సింగి ఫ్రైలను ప్రతి చదరపు మీటరుకు 100–200 సాంద్రతతో ట్యాంకులు లేదా చెరువుల్లో నిల్వ చేస్తారు. వీటికి 30% క్రూడ్ ప్రోటీన్ మరియు 6% క్రూడ్ లిపిడ్ కలిగిన తయారుచేసిన ఆహారాన్ని రోజుకు 2–3 సార్లు, శరీర బరువులో 4–6% లేదా తృప్తి స్థాయిలో అందిస్తారు.
2–3 నెలల పెంపకంలో ఇవి 2–3 గ్రాముల బరువుకు చేరుకుంటాయి. ఈ పరిమాణం వచ్చిన తరువాత వీటిని నేరుగా గ్రో-అవుట్ చెరువుల్లో నిల్వ చేయవచ్చు.

గ్రో-అవుట్ కల్చర్ దశ:
చిన్న పరిమాణం (200–1000 చదరపు మీటర్లు) మరియు తక్కువ లోతు (0.75–1.0 మీటర్ నీటి లోతు) కలిగిన మట్టి లేదా లైనింగ్ చెరువులు గ్రో-అవుట్ కల్చర్‌కు అనుకూలంగా ఉంటాయి.
ప్రతి హెక్టారుకు 20,000–40,000 చేపల సాంద్రతతో నిల్వ చేస్తారు. మెరుగైన జీవన శాతం (60–80%) మరియు గరిష్ట ఉత్పత్తి (2.0–3.0 టన్నులు/హెక్టారు) కోసం 2–3 నెలల వయస్సు గల ఫింగర్లింగ్‌లను నిల్వ చేయడం ఉత్తమం.

ప్రీ-స్టాకింగ్ నిర్వహణ

స్థల ఎంపిక, చెరువు నిర్మాణం మరియు సిద్ధం
చెరువు స్థల ఎంపిక ఇతర కార్ప్ మరియు క్యాట్‌ఫిష్ జాతుల మాదిరిగానే ఉంటుంది. పంట కాలమంతా నీటిని నిల్వ ఉంచగల సామర్థ్యం ఉన్న నేలను ఎంపిక చేయాలి.
సాధారణంగా మట్టి నేలలు చెరువు నిర్మాణానికి అత్యంత అనుకూలం. ఇసుక నేలలను నివారించాలి. ఒకవేళ చెరువు నేల ఇసుకగా ఉంటే, నీటి చొరబాటును నివారించేందుకు HDPE లైనింగ్ షీట్లను ఉపయోగించవచ్చు.
సులభమైన నిర్వహణ మరియు సులభమైన చేపల సేకరణ కోసం చెరువులు చిన్న పరిమాణంలో, సాధారణంగా అర ఎకరానికి తక్కువగా ఉండటం మంచిది. చెరువు గట్లు 1:2 నుంచి 1:3 వంపుతో ఉండాలి.
వర్షాకాలంలో చేపలు బయటకు వెళ్లకుండా చెరువు ప్రక్కలను రాళ్లతో బలపరచాలి. నీటి లోతు సుమారు 1 మీటర్ వరకు ఉంచాలి.
నేల మరియు నీటి విశ్లేషణ ఫలితాల ఆధారంగా లైమింగ్ మరియు ఎరువుల వినియోగం చేయాలి.

పోస్ట్-స్టాకింగ్ నిర్వహణ:

నీటి నాణ్యత నిర్వహణ:
సాగు వాతావరణాన్ని మంచి స్థితిలో ఉంచేందుకు నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరిశీలించడం, అవసరమైనప్పుడు నీటిని మార్పిడి చేయడం మరియు వాటర్ ప్రోబయోటిక్స్ ఉపయోగించడం అత్యంత అవసరం.
నీటి నాణ్యత ప్రమాణాలను సరైన స్థాయిలో నిలుపుకోవడానికి అవసరమైనప్పుడు 20–30% నీటిని కొత్త నీటితో భర్తీ చేయాలని సూచిస్తారు.

ఆహారం మరియు ఆహార నిర్వహణ
సింగి ఒక సర్వభక్షక క్యాట్‌ఫిష్. అయినప్పటికీ, ఫిష్‌మీల్ ఆధారిత ఆహారం (30% క్రూడ్ ప్రోటీన్ మరియు 8% క్రూడ్ లిపిడ్) ఉపయోగించడం ఉత్తమం.
సింగి ఫింగర్లింగ్‌లకు రోజుకు రెండు సార్లు, శరీర బరువులో 3–4% మోతాదులో ఆహారం అందిస్తారు. సాధారణంగా ఫ్లోటింగ్ ఫీడ్స్ ఉపయోగించడం వల్ల ఆహార వినియోగ సామర్థ్యం మెరుగుపడటంతో పాటు ఆహార వృథా తగ్గుతుంది.

ఆరోగ్య నిర్వహణ:
నాణ్యతలేని సీడ్ మరియు నాణ్యత లేని నీరు చేపల పెంపకంలో వ్యాధులకు ప్రధాన కారణాలు. సింగి చేపల్లో సాధారణంగా కనిపించే వ్యాధులు:
• ఎర్రమచ్చల వ్యాధి
• వాజాల కుళ్ళు
• కురుపుల వ్యాధి
ఈ వ్యాధులు చేపల వృద్ధి మరియు జీవన శాతాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
బాక్టీరియా సంబంధిత వ్యాధుల నివారణకు ఆక్సి టెట్రాసైక్లిన్ ను ఆహారంలో శరీర బరువుకు కిలోకు 50–80 మి.గ్రా మోతాదులో 5 రోజుల పాటు ఇవ్వాలని సూచిస్తారు.
• కురుపుల వ్యాధి నియంత్రణ కోసం సిఫాక్స్ హెక్టారు-మీటరుకు 1000 మి.లీ మోతాదులో 3–5 రోజుల పాటు ఉపయోగించడం సిఫారసు చేయబడింది.

చేపల ఉత్పత్తి మరియు పట్టుబడి:
సింగి చేపలు సుమారు 10 నెలల పెంపక కాలంలో 80–100 గ్రాముల మార్కెట్ పరిమాణానికి చేరుకుంటాయి. చేపల సేకరణ కోసం చెరువులోని నీటిని పూర్తిగా తొలగించి, చేపలను చేతితో సేకరిస్తారు. 10 నెలల పెంపక కాలంలో హెక్టారుకు 2.0–3.0 టన్నుల వరకు ఉత్పత్తి సాధించవచ్చ.

ముగింపు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఆక్వా రైతులు అనుభవిస్తున్న చేపల ఉత్పత్తి సరిగా లేకపోవడం, రొయ్యల పెంపకంలో నాణ్యత లేని రొయ్య పిల్లలు, అధిక మేత రేట్లు మరియు ఆశించిన రీతిలో రొయ్యల ఉత్పత్తి లేకపోవడం వలన ఆక్వా రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. కావున మార్కెట్లో అధిక ధరలు పలికే చేప రకమైన మార్పు చేపల పెంపకం చేపట్టి ఆక్వా రైతులు ఆర్థికంగా లబ్ధి పొందగలరు.

  1. జె. భాను సందీప్, పి.హెచ్. డి. స్కాలర్, డిపార్టుమెంటు ఆఫ్ ఫిషరీస్ ఎక్స్టెన్షన్, ఫిషరీస్ కాలేజ్, కలకత్తా.
    1. కే. వీరాంజనేయులు, శాస్త్రవేత్త (మత్స్య విభాగం), కృషి విజ్ఞాన కేంద్రం, పందిరిమామిడి.
    2. జె. గిరి కిషోర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆక్వాటిక్ అనిమల్ హెల్త్ మేనేజ్ మెంట్, ఫిషరీస్ కాలేజ్, కలకత్తా. Phone: 9553364265
Read More

చేపల చెరువులలో ప్లవకాల ఉత్పత్తి – ప్రాముఖ్యత

చేపల పెంపకంలో అధిక ఉత్పత్తి సాధించడానికి నాణ్యమైన చేప పిల్లలు, సమతుల్య ఆహారం, సరైన నీటి నాణ్యత మరియు వ్యాధి నియంత్రణతో పాటు చెరువులో సహజ ఆహార వనరుల లభ్యత కూడా ఎంతో ముఖ్యమైనది. ఈ సహజ ఆహార వనరులలో అత్యంత ప్రాధాన్యత కలిగినవి ప్లవకాలు. చేపల చెరువులో ప్లవకాల ఉత్పత్తి సమృద్ధిగా ఉన్నప్పుడు చేపల పెరుగుదల మెరుగుపడటంతో పాటు అనుబంధ ఆహార వ్యయం కూడా తగ్గుతుంది. అందువల్ల ప్లవకాల ఉత్పత్తి చేపల సాగులో కీలకమైన అంశంగా పరిగణించబడుతుంది.

ప్లవకాలు అంటే ఏమిటి?
నీటిలో స్వేచ్ఛగా తేలియాడే సూక్ష్మ జీవులను ప్లవకాలు అంటారు. ఇవి కంటికి కనిపించని స్థాయిలో చిన్నవిగా ఉండి చెరువు జీవావరణ వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. చేప పిల్లల నుంచి పెద్ద చేపల వరకు వివిధ దశల్లో ఇవి సహజ ఆహారంగా ఉపయోగపడతాయి.

ప్లవకాల రకాలు
చెరువులలో ప్రధానంగా రెండు రకాల ప్లవకాలు కనిపిస్తాయి

వృక్ష ప్లవకాలు (ఫైటోప్లాంక్టాన్)
సూర్యరశ్మి సహాయంతో కిరణజన్య సంయోగక్రియ జరిపి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే సూక్ష్మ మొక్కల సమూహాన్ని వృక్ష ప్లవకాలు అంటారు.

జంతు ప్లవకాలు (జూప్లాంక్టాన్)
వృక్ష ప్లవకాలపై ఆధారపడి జీవించే సూక్ష్మ జీవులను జంతు ప్లవకాలు అంటారు. ఇవి చేప పిల్లలకు అత్యంత పోషకమైన సహజ ఆహారం.

చేపల చెరువులలో ప్లవకాల ప్రాముఖ్యత
ప్లవకాలు చేపల చెరువులలో ఆహార గొలుసుకు పునాది వంటివి. చేపల పెరుగుదల, జీవన శాతం, ఆరోగ్యం మరియు ఉత్పత్తి స్థాయిని ప్రభావితం చేసే ముఖ్యమైన జీవ వనరులు. చెరువులో తగిన స్థాయిలో ప్లవకాలు ఉంటే చేపల పెరుగుదల వేగవంతమవుతుంది. అదనంగా రైతులు అనుబంధ ఆహారంపై చేసే ఖర్చు కూడా తగ్గుతుంది.

ప్లవకాల ఉత్పత్తికి అవసరమైన పరిస్థితులు
ప్లవకాల ఉత్పత్తి చెరువు నేల సారం, నీటి నాణ్యత, సూర్యరశ్మి లభ్యత మరియు ఎరువుల వినియోగంపై ఆధారపడి ఉంటుంది. చెరువు తయారీ సమయంలో భూసార పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు పోషకాలను అందించడం ద్వారా ప్లవకాల పెరుగుదలను ప్రోత్సహించవచ్చు.

ప్లవకాల ఉత్పత్తిలో ఎరువుల పాత్ర
చేపల చెరువులలో సహజ ఆహారమైన వృక్ష ప్లవకాలు మరియు జంతు ప్లవకాలు ఉత్పత్తిని పెంచడంలో ఎరువులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వృక్ష ప్లవకాల పెరుగుదలకు అవసరమైన నత్రజని, భాస్వరం మరియు పొటాషియం వంటి పోషకాలను అందించడం వల్ల ప్లవకాల ఉత్పత్తి వేగంగా ప్రారంభమవుతుంది.
జంతు ప్లవకాల ఉత్పత్తి కోసం పశువుల పేడ, కోళ్ల పెంట వంటి సేంద్రీయ ఎరువులను వినియోగిస్తారు. చెరువు తయారు చేసుకునే సమయంలో హెక్టారుకు 5-10 టన్నుల పశువుల పేడ లేదా 2-3 టన్నుల కోళ్ల పెంట వేయడం ద్వారా సూక్ష్మజీవుల పెరుగుదల ప్రోత్సహించబడి జంతు ప్లవకాల ఉత్పత్తి పెరుగుతుంది. అదనంగా జింక్, మాంగనీస్, కోబాల్ట్, ఇనుము వంటి సూక్ష్మ పోషకాలు ప్లవకాల వృద్ధిని మెరుగుపరుస్తాయి.
ఎరువులను శాస్త్రీయ మోతాదులో సమతుల్యంగా వినియోగించడం ద్వారా చెరువులో సహజ ఆహార లభ్యత పెరిగి చేపల పెరుగుదల, ఆరోగ్యం మరియు ఉత్పాదకత మెరుగుపడతాయి. అయితే అధిక మోతాదులో ఎరువులు ఉపయోగించడం వల్ల నీటి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉన్నందున అవసరానికి అనుగుణంగా మాత్రమే వినియోగించాలి

వృక్ష ప్లవకాల వల్ల కలిగే ప్రయోజనాలు
వృక్ష ప్లవకాలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా నీటిలో ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తాయి. చేపలకు సహజ ఆహారాన్ని అందించడంతో పాటు నీటి నాణ్యతను మెరుగుపరుస్తాయి. నీటిలోని కార్బన్ డైఆక్సైడ్‌ను గ్రహించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయి. హానికరమైన కొన్ని సూక్ష్మజీవుల పెరుగుదలను కూడా నియంత్రించడంలో సహాయపడతాయి.

జంతు ప్లవకాల వల్ల కలిగే ప్రయోజనాలు
జంతు ప్లవకాలలో ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి. చేప పిల్లల ప్రారంభ దశ పెరుగుదలలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చెరువులో సమృద్ధిగా జంతు ప్లవకాలు ఉండటం వల్ల చేపల ఆరోగ్యం మెరుగుపడి మరణాల శాతం తగ్గుతుంది.

నీటి నాణ్యత పై ప్లవకాల ప్రభావం
పగటి సమయంలో ప్లవకాలు కిరణజన్య సంయోగక్రియ జరిపి నీటిలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి. దీని వలన చేపలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. పి.హెచ్. విలువలను సమతుల్యంగా ఉంచడంలో కూడా ప్లవకాల పాత్ర ఎంతో ముఖ్యమైనది. తగిన స్థాయిలో ప్లవకాలు ఉన్నప్పుడు నీటి నాణ్యత మెరుగ్గా ఉంటుంది.

ప్లవకాల బ్లూమ్స్ – కారణాలు మరియు ప్రభావాలు
అధిక మోతాదులో ఎరువులు వాడటం, నీటిలో పోషకాలు ఎక్కువగా చేరడం వంటి కారణాల వల్ల ప్లవకాల బ్లూమ్స్ ఏర్పడతాయి. ఈ సమయంలో నీరు ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. బ్లూమ్స్ కారణంగా రాత్రి సమయంలో ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరంగా తగ్గిపోవచ్చు. ఇది చేపల ఆరోగ్యానికి హానికరం.

ప్లవకాల క్రాష్ – కారణాలు మరియు నివారణ చర్యలు
వాతావరణ మార్పులు, అధిక ప్లవకాల సాంద్రత లేదా నీటి నాణ్యతలో ఆకస్మిక మార్పుల వల్ల ప్లవకాల క్రాష్ సంభవిస్తుంది. ఈ పరిస్థితిలో నీరు తేటగా మారి ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. చేపలు ఒత్తిడికి గురై వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. అందువల్ల చెరువులో నీటి నాణ్యతను నిరంతరం పరిశీలిస్తూ సమతుల్య ఎరువుల నిర్వహణ చేపట్టాలి.

ప్లవకాల సాంద్రతను అంచనా వేసే పద్ధతులు
సెచి డిస్క్ మరియు ప్లాంక్టాన్ నెట్ ద్వారా ప్లవకాల సాంద్రతను అంచనా వేయవచ్చు. సాధారణంగా సెచి డిస్క్ దృశ్య లోతు 20-30 సెం.మీ. మధ్య ఉన్నప్పుడు చెరువులో ప్లవకాల స్థాయి అనుకూలంగా ఉందని భావిస్తారు.

ప్లవకాల నిర్వహణ లో చేపల రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
-చెరువు నేల భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి.

  • ఎరువులను విడతల వారీగా వేయాలి.
  • నీటి రంగు మరియు పారదర్శకతను క్రమం తప్పకుండా పరిశీలించాలి.
  • ప్లవకాల బ్లూమ్స్ ఏర్పడినప్పుడు నీటి మార్పిడి చేపట్టాలి.
  • ఆక్సిజన్ కొరత లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి.

ముగింపు
చేపల చెరువులలో ప్లవకాల ఉత్పత్తి విజయవంతమైన చేపల పెంపకానికి మూలాధారం. ప్లవకాలు చేపలకు సహజ ఆహారాన్ని అందించడమే కాకుండా నీటి నాణ్యతను మెరుగుపరచడం, ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం మరియు చెరువు జీవావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి చేపల రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరించి ప్లవకాల ఉత్పత్తి మరియు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లయితే అధిక దిగుబడులు, తక్కువ ఉత్పత్తి వ్యయం మరియు మెరుగైన లాభాలను పొందగలరు.

డాక్టర్. జి. గణేష్, మత్స్య శాస్త్రవేత్త
కృషి విజ్ఞాన కేంద్రం, పి. వి. నరసింహ రావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం, మామునూర్, వరంగల్ జిల్లా-506 166. ph; 6281836891

Read More

తెలంగాణాలో ఉచిత చేపపిల్లల పంపిణీ

రూ. 125 కోట్లతో తెలంగాణలో 2026-27 సంవత్సరానికిగాను 95 కోట్ల చేప, రొయ్య పిల్లల ఉచిత పంపిణీ పథకం అమలుకు రాష్ట్ర మత్స్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి జులై ఆరంభంలో పంపిణీ చేపట్టేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా ఈ పథకం సాగుతోంది. మొదట్లో మే నెలలో టెండర్లు పిలిచి జూన్‌లో చేపపిల్లలను పంపిణీ చేసేవారు. పెండింగ్ బిల్లులు, పథకం కొనసాగింపుపై సందిగ్ధత ఇతర కారణాల వల్ల కొన్నేళ్లుగా టెండర్ల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. గతానుభవాల దృష్ట్యా ఈ ఏడాది పథకం అమలులో లోటుపాట్లు లేకుండా అమలు చేసేందుకు మత్స్యశాఖ సన్నద్ధమవుతోంది.

Read More

ఏటా మూడు పంటలు పండాలి

వరి రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళిక, ఎరువుల వినియోగం తగ్గేలా కసరత్తు.
ప్రయోగాత్మకంగా అంతర పంటలు
వ్యవసాయ శాఖపై సమీక్షలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు

ఏటా మూడు పంటలు పండేలా... 365 రోజులూ సాగు భూములు పచ్చగా ఉండేలా రాష్ట్రంలో మూడు పంటల విధానం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వరి రైతులకు ఆదాయం మరింత పెరిగే మార్గాలు అన్వేషించాలన్నారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం కీలక సూచనలు చేశారు. 'వరిలో అంతర పంటలుగా గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలన్నారు. పొలం మధ్యలో వెడల్పుగా అదనపు గట్లు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలి. అవసరమైతే ఉపాధి హామీ నిధులతో వాటిని ఏర్పాటుచేయాలి. వరి పంట మధ్యలో లేదా, పంట చుట్టూ ఆక్వా, ఉద్యాన సాగు దిశగానూ ప్రయత్నించాలి' అని సూచించారు.

వేసవిలోనూ సాగుకు సన్నద్ధం..
వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టాల్లోని 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేయాలి. అనంతపురం లాంటి జిల్లాల్లో 365 రోజుల్లో కేవలం నాలుగు నెలలే పంటలు సాగుచేసి మిగిలిన 8 నెలలు భూములను ఖాళీగా వదిలేస్తున్నారు.. దీనివల్ల భూసారం దెబ్బతింటోంది. అందుకే ఆ కాలంలోనూ ఏదో ఒక పంట సాగుచేసే పరిస్థితులు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ‘వచ్చే వేసవిలో జల వనరుల లభ్యత ఉన్న 141 మండలాల్లో సాగు చేసేలా రైతుల్ని సన్నద్ధం చేయాలి. 19 మండలాలు జలాశయాలపై, 57 మండలాలు చెరువులపై, 65 మండలాలు భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్నందున వాటిని సద్వినియోగం చేసుకుని దిగుబడులు సాధించాలి’ అని అన్నారు.

ఎరువుల వినియోగం తగ్గాలి..
ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి భూసారం కాపాడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాల సాగు పెరగాలన్నారు. ఈ సీజన్‌లో రైతులు కోరిన 24 గంటల్లో బ్యాంకులు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. వాట్సప్‌ గవర్నెన్స్‌- మన మిత్ర ద్వారా కొత్తగా వ్యవసాయ శాఖలో మూడు సేవలు అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. రైతులకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో కూడా వ్యవసాయ విజ్ఞానంపై అవగాహన పెంచాలని చంద్రబాబు సూచించారు.

పంట కాలం ముందుకు జరిపేలా కార్యాచరణ
గత 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌ 14 తుపాన్లను ఎదుర్కొందని, అక్టోబరులో ఐదు, నవంబరులో ఆరు, డిసెంబరులో మూడు తుపాన్లు ప్రభావం చూపాయని వ్యవసాయ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అక్టోబరులో వచ్చే తుపాన్లు ఎక్కువగా ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాలకు నష్టం కలిగించాయని వివరించారు. విపత్తుల ముప్పు తప్పేలా ముందస్తు ప్రణాళిక అమలు చేస్తున్నట్లు చెప్పారు. తుపాన్ల నుంచి ఖరీఫ్‌ పంటలను రక్షించుకునేలా పంట కాలాన్ని ముందుకు తీసుకొచ్చేలా కార్యాచరణ మొదలు పెట్టినట్లు వివరించారు. గోదావరి, కృష్ణా డెల్టాలకు ఈ ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేశామన్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో భూములకు కాలువల ద్వారా సాగునీరు విడుదల చేశామని తెలి పారు. జులై మొదటి వారంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు నీరు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్లో ప్రధానంగా వరి, కందులు, వేరుశనగ, పత్తి సాగు చేస్తుండగా.. వేరుశనగ, ప్రత్తి సాగు తగ్గుతోందని.. కందులు సాగు పెరిగిందని, వరి సాగు స్థిరంగా కొనసాగుతోందని వివరించారు. పర్చూరు ఏఎంసీలో హెడ్డీ బర్లీ పొగాకు కొనుగోలు ప్రారంభించడంతో రైతుల్లో సంతృప్తి వ్యక్తమైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. హెడ్డీ బర్లీ స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. కోకో, మామిడి కొనుగోళ్ల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

Read More