డిజిటల్‌ అగ్రికల్చర్‌తో తెలంగాణ వ్యవసాయరంగంలో నూతన ఒరవడి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పురుగుల మందుల, ఎరువుల వాడకాన్ని తగ్గే విధంగా 'ఏఐ' సాంకేతికతను వినియోగించాలి
  • తెలంగాణ రాష్ట్రం మరో పంజాబ్‌ లా కాకూడదు
  • నాణ్యమైన ఉత్పత్తులు తీసే విధంగా తెలంగాణ వ్యవసాయ విధానములో సమూలంగా మార్పులు తెచ్చే దిశలో యోచిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  • శాటిలైట్‌ డేటాతో నేలలో పోషకాల లభ్యతను పరీక్షించే సాంకేతికతను వివరించిన జర్మనీ ప్రతినిధులు
  • నేడు సెక్రటేరియట్‌లో ACRAT ప్రతినిధులతో సమావేశమై చర్చించిన మంత్రి తుమ్మల డిజిటల్‌ అగ్రికల్చర్‌తో తెలంగాణ వ్యవసాయరంగంలో నూతన ఒరవడి తేవాలని, పర్యావరణానికి మేలు చేసే స్మార్ట్‌ వ్యవసాయాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు సచివాలయంలో జర్మనీకి చెందిన ACRAT ప్రతినిధులతో జరిగిన సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు ”డిజిటల్‌ అగ్రికల్చర్‌ తెలంగాణ రోడ్‌మ్యాప్‌” పత్రాన్ని మంత్రివర్యులకు అందజేశారు.
    మంత్రి తుమ్మల గారు మాట్లాడుతూ.. AI, IoT ఆధారిత డిజిటల్‌ వ్యవసాయ సేవలతో ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలి. పంజాబ్‌లా మరో క్యాన్సర్‌ బెల్ట్‌గా తెలంగాణ మారకూడదు. నేల ఆరోగ్యాన్ని కాపాడే, రైతు ఆదాయాన్ని పెంచే, పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయం మన లక్ష్యం కావాలి” అన్నారు. జర్మనీ – భారత్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ప్రపంచంలోని తొలి ITU ప్రమాణిత డిజిటల్‌ వ్యవసాయ యూజ్‌కేస్‌ను వేములవాడలో విజయవంతంగా అమలు చేసినట్లు ప్రతినిధులు వివరించారు. ఉపగ్రహ, డ్రోన్‌, మరియు సెన్సర్‌ ఆధారిత ఈ మోడల్‌ ద్వారా నేలలోని N,P,K మరియు సూక్ష్మ పోషకాల లభ్యత విశ్లేషణ చేసి, అవసరమైన ఎరువుల పరిమాణాన్ని మాత్రమే సిఫారసు చేస్తున్నామని, AI ఆధారిత పంట గుర్తింపు మోడల్‌, ఉపగ్రహ డేటాతో సబ్సిడీలు, బీమా, రుణాల పారదర్శక పంపిణీ వంటి అంశాలను కూడా మంత్రికి వివరించారు. సమగ్ర డిజిటల్‌ వ్యవసాయ ప్లాట్‌ఫార్మ్‌ను రూపొందించి, రైతులు, పరిశోధకులు మరియు విద్యార్థులు, అందరూ ఉపయోగించుకోగల వేదికగా అభివృద్ధి చేయాలని మంత్రి గారు సూచించారు. ”ఈ సాంకేతికత రైతుల వ్యయాన్ని తగ్గించేలా, నేల ఆరోగ్యాన్ని కాపాడేలా మరియు పంట నాణ్యతను పెంచేలా ఉండాలన్నారు. ”రైతు ఆలోచన దిశగా వ్యవసాయ విధానాలు రూపకల్పన చేస్తేనే స్థిరమైన, సురక్షితమైన భవిష్యత్తు సాధ్యమవుతుంది” అని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో డా. గోపి డైరెక్టర్‌, వ్యవసాయ శాఖ, డా రఘు చాలిగంటి (ITU-T SG20), డా. సెబాస్టియన్‌ బోసె (ఫ్రాన్హోఫర్‌ హెచెచ్‌ఐ), శ్రీ యాన్‌-క్రిస్టియన్‌ రెడ్‌లిచ్‌ (బాండ్‌ కన్సల్టింగ్‌ GmbH), ప్రొఫెసర్‌ జానయ్య గారు (వైస్‌ ఛాన్సలర్‌, పీజేటీఎస్‌ఏయూ), మరియు రమేశ్‌ రెడ్డి (చైర్మన్‌, పర్యాటక శాఖ) పాల్గొన్నారు.
Read More

రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి అనూహ్య స్పందన – PJTAU ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య

600 గ్రామాల్లో 37,000 రైతులతో అవగాహన కార్యక్రమం

  • రైతుల్లో అసంతృప్తి లేదు.. కానీ చేయాల్సింది చాలా ఉంది

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ సహకారంతో నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ రాష్ట్రవ్యాప్తంగా నిరాటంకంగా, విజయవంతంగా సాగుతోంది. మే 5వ తేదీన వికారాబాద్ జిల్లా ధరూర్ లో ఈ కార్యక్రమాన్ని శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ శ్రీ M. కోదండ రెడ్డి, PJTAU ఉపకులపతి డాక్టర్ అల్దాస్ జానయ్య లాంచనంగా ప్రారంభించారు. ఆరోజు నుండి ఈ కార్యక్రమం నేటి వరకు 600 గ్రామాల్లో నిర్వహించగా సుమారు 31,000 మంది పురుషులు, 6,000 మంది మహిళలు పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 37,000 మంది రైతులతో శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ విద్యార్థులు ముఖాముఖిగా మాట్లాడారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ MP డాక్టర్ మల్లురవి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ G. చిన్నారెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, ఎమ్మెల్సీలు, సుమారు 25 మంది శాసనసభ్యులు, వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ విద్యార్థులతో పాటు వారంలో ఒకరోజు ఉపకులపతి, ఇతర విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. PJTAU శాస్త్రవేత్తలు, విద్యార్థులు, వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు, అభ్యుదయ రైతులు, రైతు గ్రూపులు, సంఘాల ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఆరు అంశాలైన తక్కువ యూరియా వాడి సాగు ఖర్చును తగ్గించడం, అవసరం మేరకే రసాయనాలను వాడి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడడం, వివిధ ఇన్ పుట్స్ కొనుగోలుకు సంబంధించిన రశీదులని భద్రపరచుకోవడం, సాగునీటిని ఆదా చేయడం, పంట మార్పిడులను పాటించి సుస్థిరాదాయాన్ని పొందడం, చెట్లను నాటి పర్యావరణాన్ని రక్షించడం వంటి వాటిపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్ధులు రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే రైతులు అడుగుతున్న అనేక సందేహాలను శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో నివృత్తి చేస్తున్నారు.

ఉపకులపతి సమీక్ష :-

   మూడు వారాలుగా సాగుతున్న 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం పై ఉపకులపతి అల్దాస్ జానయ్య ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ కార్యక్రమానికి రైతాంగం నుంచి మంచి స్పందన వస్తుందని వివరించారు. ప్రభుత్వం రైతాంగానికి అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రస్తుత వ్యవసాయ పరిస్థితుల పై రైతాంగంలో ఎటువంటి అసంతృప్తి లేదని జానయ్య స్పష్టం చేశారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాల కారణంగా రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుందని తెలిపారు. అలాగే ఇంకా కొన్ని వ్యవసాయ అంశాలకి ప్రభుత్వపరంగా ప్రోత్సాహం ఇవ్వవలసిందిగా రైతులు కోరుతున్నారని జానయ్య అన్నారు.  ముఖ్యంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురయ్యే నష్టాల్ని అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం పంటల బీమా సదుపాయం ప్రవేశపెట్టాలని రైతులు కోరుకుంటున్నారని, అలాగే చిన్న, సన్నకారు రైతులకి ఆధునిక వ్యవసాయ పనిముట్లని మరియు పచ్చి రొట్ట విత్తనాలను రాయితీపై  అందించాలని, విస్తృతంగా భూసార పరీక్షలు నిర్వహించాలని రైతాంగం కోరుకుంటున్నారని అల్దాస్ జానయ్య వివరించారు. ఇదే స్ఫూర్తితో రైతు సోదరులు, మహిళలు, అభ్యుదయ రైతులు, రైతు గ్రూపులు, సంఘాల ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని  దీన్ని ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఉపకులపతి కోరారు.
Read More