ప్రకృతి వ్యవసాయ రైతులకు గుర్తింపు కార్డులు

జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు గుర్తింపు కార్డులు, ఇతర వస్తువులతో ఉన్న కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 489 ప్రకృతి వ్యవసాయ సమూహాల్లో ప్రతి క్లస్టర్‌కు 125 మంది చొప్పున, మొత్తం 61,125 మంది రైతులకు ఈ కిట్లను అందజేస్తారు. ఇందులో గుర్తింపు కార్డు, క్లాత్ బ్యాగ్, క్షేత్రదర్శిని డైరీ, చిన్న ప్యాకెట్ డైరీ, ప్రత్యేక క్యాలెండర్, టోపీ, పెన్ను ఉంటాయి. జిల్లాల్లోని రైతు వేదికలలో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రైతులకు కిట్లను పంపిణీ చేస్తారు. తర్వాత జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రతీ క్టసర్‌కు ఇద్దరు చొప్పున కృషి సఖిలను ఇందుకోసం ఎంపిక చేశారు. వీరి ద్వారా సేంద్రియ సాగు పద్ధతుల పై అవగాహన కల్పిస్తారు.

Read More

జై జవాన్‌ – జై కిసాన్‌

వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదిగే అవకాశం సైన్యం, నౌకా, వైమానిక దళాల్లో పనిచేస్తూ త్వరలో పదవీ విరమణ పొందనున్న అధికారులకు కల్పించాలని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఏటా సైన్యంలో పదవీ విరమణ పొందే అధికారులు వివిధ వృత్తుల్లో స్థిరపడుతున్నారు. వ్యవసాయ రంగంలో అవకాశాలు మెండుగా ఉండటంతో దానిపై అవగాహన కల్పించి పరిశ్రమల స్థాపన దిశగా వారిని ప్రోత్సహించాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ‘జైజవాన్‌ – జైకిసాన్‌’ పేరిట ఎంపిక చేసినవారికి నాలుగు నెలల పాటు శిక్షణ ఇవ్వనుంది. 43 మందితో కూడిన తొలి బృందానికి శిక్షణను బుధవారం హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ (మెనేజ్‌)లో సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ హనుమాన్‌ సింగ్‌, హైదరాబాద్‌ ఆర్టిలరీ సెంటర్‌ లెఫ్టినెంట్‌ కర్నల్‌ ఆకాశ్‌ గెరా ప్రారంభించారు. పంటల సాగు, ఉత్పత్తి, ఆహార శుద్ధి, మార్కెటింగ్‌లతో పాటు పరిశ్రమలు, వ్యాపార నిర్వహణ, వ్యవస్థాపకతపై వచ్చే డిసెంబరు 26 వరకు నిపుణులతో శిక్షణ ఇస్తామని హనుమాన్‌ సింగ్‌ తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలున్న సైనికాధికారులు శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా, నాయకులుగా ఎదగాలని కర్నల్‌ ఆకాశ్‌ గెరా ఆకాంక్షించారు.

Read More

వికసిత్ భారత్ సాధనలో వ్యవసాయానిది కీలకపాత్ర

PJTAU పరిధిలోని అగ్రి హబ్ ఇన్నోవేషన్ సెంటర్లో ఈరోజు 15 వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలకు గుర్తింపు పత్రాలని ఉపకులపతి ప్రొఫెసర్ అల్థాస్ జానయ్య అందజేశారు. ఈ సంస్థలు PJTAU అగ్రి హబ్ ఇన్నోవేషన్ సెంటర్ లో విజయవంతంగా సాంకేతిక శిక్షణ పూర్తి చేసుకున్నాయి. అగ్రి హబ్ తరఫున ఇప్పటికి సుమారు 150 అంకుర సంస్థలకు నాబార్డ్ సహాయంతో తోడ్పాటు నందించామని జానయ్య వివరించారు. ఇందులో భాగంగా కూరగాయల సాగులో మానవ ప్రమేయం తగ్గించి రైతులకు తోడ్పాటు అందించేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆవిష్కరించిన రోబో ని అల్దాస్ జానయ్య ఈ కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారు. అలాగే గ్రామీణ యువత, అభ్యుదయ రైతులకు చేయూతనందించే కార్యక్రమంలో భాగంగా నాబార్డ్ ఆర్థిక సహకారాన్ని ఆరుగురికి అందజేశారు. అంతేకాకుండా మరో రెండు అంకుర సంస్థలకు ఒక్కొక్క దానికి 40 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం PJTAU అగ్రి హబ్ ద్వారా అందజేశారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత భారత్ గా రూపొందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాయని అల్థాస్ జానయ్య అన్నారు. ఆ వికసిత్ భారత్ సాధనలో వ్యవసాయానిది కీలకపాత్ర అని ఆయన స్పష్టం చేశారు. దేశ సంపద మూలాలు ఈనాటికీ గ్రామీణ భారతంలో, వ్యవసాయ రంగంలోనే కేంద్రీకృతమై ఉన్నందున ఈ రంగాలకి పెద్దపీట వేసి వ్యవసాయంతో పాటు వ్యవసాయ పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని జానయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా నాబార్డ్ DGM దీప్తి, WE HUB ప్రతినిధి సీత, PJTAU రిజిస్ట్రార్ డాక్టర్ G.E.CH విద్యాసాగర్, AG HUB MD G. వెంకటేశ్వర్లు, వివిధ అంకుర సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Read More