ఎన్. గోపాల్క్రిష్ణన్ అనే అభ్యుదయ రైతు గుడ్లు, నిమ్మకాయలతో మొక్కల పెరుగుదలకు హార్మోన్ తయారు చేశారు. తమిళనాడులో అనేక మంది దీనిని ఉపయోగించి లాభాలు పొందుతున్నారు. ఆయన దీని తయారీ విధానం గురించి రైతులకు శిక్షణ ఇస్తున్నారు.
కావల్సిన వస్తువులు – తయారీ విధానం
20-25 నిమ్మకాయలు
250 గ్రాముల బెల్లం
10-15 కోడి లేక బాతు గుడ్లు ఒక బకెట్లో నిమ్మకాయల రసాన్ని తీయాలి. దీనిలో బెల్లాన్ని కరగబెట్టాలి. ఈ రసంలో గుడ్లు మునిగేటట్లు ఉంచి గాలి చొరబడకుండా బకెట్కు మూత పెట్టి నీడలో పది రోజుల పాటు ఉంచాలి. గుడ్లు పెంకుతో సహా రసంలో కరిగి రబ్బరు బంతుల్లా తయారవుతాయి. పది రోజుల తరువాత రబ్బరు బంతుల్లా మారిన గుడ్లను చేతులతో నలిపి దాన్ని బాగా కలియబెట్టాలి. తరువాత దీనికి అంతే మొత్తంలో మరోసారి బెల్లం రసాన్ని కలపాలి. ఉదాహరణకు బకెట్లో రెండు లీటర్ల రసం ఉందంటే దానికి మరో రెండు లీటర్ల బెల్లం రసాన్ని కలపాలి. తిరిగి బకెట్కు గట్టిగా మూత పెట్టి మరో పది రోజులు ఉంచాలి. పది రోజుల తరువాత దీన్ని పంటల మీద ఉపయోగించవచ్చు. 10Ð15 మి.లీ. రసాన్ని ఒక లీటర్ నీటిలో కలిపి పంటల మీద స్ప్రే చేయాలి.
ఏ పంటలకు ఉపయోగపడుతుంది? ఈ సేంద్రియ హార్మోన్ను వరి, గోధుమ, అరటి, కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు అన్నింటి మీద స్ప్రే చేయవచ్చు. పిచికారి వేళలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఉదయం, సాయంత్రం పొద్దు మునిగే ముందు పిచికారి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దీనికి పంచగవ్య, వర్మివాష్లను కూడా కలిపి వాడవవచ్చు. ద్రావణం తయారు చేసేటప్పుడు మూతకు చిన్న చిన్న రంధ్రాలు పెడితే మంచిది. దీనిని ఆరు మాసాల వరకు నిలువ చేసుకోవచ్చు.
మురిపిండ / కుప్పింట / హరిత మంజరిగా పిలువబడే హరిత మంజరి ఏకవార్షిక హెర్బల్ మొక్క. ఇది ఒక కలుపు మొక్కగా అన్ని చోట్లా కన్పిస్తుంది. దీని పూలగుత్తులు కప్పులాంటి ఆకారంలో కప్పబడి ఉంటాయి. పూలు అతి చిన్నవిగా ఉంటాయి. ఈ మొక్క నిటారుగా 1.2 మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు వెడల్పుగా అండాకారంలో ఉంటాయి. ఈ మొక్క 1.2-6.55þ14 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకు మొదలు గుండ్రంగా ఉంటుంది. ఆకుకాడ 1.5 నుండి 5.5 సెం.మీ. పొడవుంటుంది. పూలకాడలు 2.5 నుండి 6 సెం.మీ. పొడవుంటాయి. పూలకాడ క్రింది భాగంలో ఆకుపచ్చ రంగులో ఆడపూలు ఉంటాయి. కాండం పొడవునా దళసరి ఈనెలలో నూగు కలిగి ఉంటుంది. కాయ 1.5þ2 మి.మీ. పరిమాణంలో 3 చీలినట్లున్నభాగాలతో నూగు కలిగి ఉంటుంది. మురిపిండ ఒక మీటరు ఎత్తు పెరిగే ఏకవార్షిక మొక్క. ఆకులు దాదాపు వృత్తాకారంలో ఉండి, కణుపుకు ఒకటి చొప్పున ఏర్పడతాయి. ఆకు అంచులకు దంతాల వంటి నొక్కులుంటాయి. ఆడ, మగ పుష్పాలు వేర్వేరుగా ఒకే మొక్కపై ఏర్పడతాయి. ఫలాలు గుండ్రంగా ఉండి ఒకే విత్తనం కలిగి ఉంటాయి. పుష్పాలు, ఫలాలు సంవత్సరం పొడవునా మొక్కపై ఏర్పడతాయి. మురిపిండ మొక్కలు తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిపై మొలకెత్తి వర్షాకాలంలో ఏపుగా పెరుగుతాయి. ఇవి పంటపొలాలలోను, బీడు భూములలోను, కంచెల వెంబడి కలుపు మొక్కలుగా పెరుగుతాయి. మురిపిండ మొక్కలో అకాలైఫిన్, అరంటియమైడ్, కాన్నాబినాల్, ఫ్లేవకెంఫెరాల్, సక్సినిమైడ్ వంటి అనేక రసాయనాలుంటాయి.
సాధారణ నామం : ఇండియన్ అకలైఫా / ఇండియన్ నెటిల్ / ఇండియన్ కాపర్ లీఫ్ శాస్త్రీయ నామం : అకలైఫా ఇండికా కుటుంబం: యూఫర్బియేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
కుప్పింట అనేక సంప్రదాయ ఔషధ ప్రయోజనాలు కలిగి, వాంతిమందుగా, విరేచనకారిగా, నులిపురుగుల నివారిణిగా, గజ్జి నివారిణిగా ఉపయోగపడుతుంది.
నూరిన ఆకుల రసానికి ఉప్పు కలిపి లేదా కషాయంగా తీసుకుని గజ్జి చర్మవ్యాధులను నివారించుకోవచ్చు. దీని కషాయం ఆస్త్మా చికిత్సకి, కాలేయం, మూత్రపిండాలను శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది.
వేరు కషాయం విరేచనకారిగా పని చేస్తుంది.
ఆకులను కంటి జబ్బుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఆకుపొడిని గాయాల చికిత్సకు ఉపయోగిస్తారు.
భారతదేశంలో కుప్పింటని ఉబ్బసం, న్యుమోనియా చికిత్సకుపయోగిస్తారు. ఆఫ్రికా, ఇండియాలలో దీని ఆకులను కూరవండుకుని తింటారు.
వ్యవసాయరంగంలో …
కుప్పింట యాంటిఆక్సిడెంట్, యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, యాంటిఇన్ఫ్లమేటరి, యాంటిఅల్సర్, యాంటిహెల్మింటిక్, యాంటిక్యాన్సర్, యాంటివీనోమ్ చర్యలు కలిగి ఉంది (సుధాకర్, అతని అనుచరులు, 2016).
కుప్పింట మిథనాల్ ద్రావణాలు పంటలలో తెగుళ్ళు కలిగించే గ్జాంతోమోనాస్ కాంపెస్ట్రిస్ బాక్టీరియా పెరుగుదలను గణనీయంగా అరికట్టింది (జాన్ డిబ్రిట్టె, అతని అనుచరులు, 2011).
కుప్పింట కాండం, బెరడు ద్రావణాలు మిడత, ఎపాక్రోమియా స్పీ. పై విషచర్యను ప్రదర్శించింది. (పుట్టరుద్రయ్య అండ్ భాటియా, 1955).
కుప్పింట బెరడు, ఆకుపొడులు, వాటి ఇథనాల్ ద్రావణాలు గొంగళిపురుగు, యూప్రోక్టిస్ ఫ్రెటిర్నా మరియు డైమండ్ బ్యాక్మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాలపై కీటక నాశక చర్యను ప్రదర్శించాయి (మెకిండూ, 1983).
కుప్పింట మొక్కలు పంటలలో శత్రు పురుగుల సహజ జీవనియంత్రణ కారకాలైన మిత్ర పురుగులకు ఆశ్రయమిస్తాయి (టిఎనఎయు అగ్రిటెక్పోర్టల్) కుప్పింట మొక్క భూమిలోని విషపూరిత లోహాలైన సీసం (లెడ్), నికిల్, క్రోమియం, కాడ్మియంలను గ్రహించి నిల్వ చేసుకుంటుంది. అందువలన ఈ లోహాలతో కలుషితమైన భూముల నుండి వీటిని తొలగించడానికి ఈ మొక్కను సిఫారసు చేయవచ్చు. (సుభాషిణి అండ్ స్వామి, 2015)
ఈ మొక్కలో ఉన్న “కన్నాబినాల” అనే రసాయనం కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా, క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. వీటి ఆకులను ‘పంచపత్ర కషాయం’ తయారీలో ఉపయోగించవచ్చు.
ఈ కషాయాన్ని రైతులు స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఇది స్పర్శ చర్య, ఉదర చర్య కలిగి ఉంటుంది. అందువలన ఈ కషాయం ఒక శక్తివంతమైన కీటకనాశనిగా పనిచేసి పురుగులను అదుపులో ఉంచుతుంది.
వీటి ఆకుల ద్రావణానికి అపరాల నిల్వలో ఆశించే పుచ్చు పురుగును నివారించే శక్తి ఉన్నట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. దీనికి శిలీంద్ర నాశని లక్షణాలు కూడా ఉన్నాయి (జయకుమార్ సోలమన్, తమిళనాడు).
దోమల లార్వాలను నిర్మూలించే గుణం ఈ కషాయానికుందని కెల్మ్ (1997) పరిశోధనలు తెలియజేశాయి. పత్తి పంటలో ఆకులను తినే పురుగులు, ఎర్రనల్లి నివారణకు ఈ కషాయాన్ని ఉపయోగించవచ్చు.
మురిపిండ ఆకులు చాలా ఘాటైన వాసన కల్గి ఉంటాయి కనుక ఈ కషాయాన్ని పంటలపై పిచికారి చేస్తే, దీనిలోని రసాయనాలు కీటకాలకు ఆహార భక్షక నిరోధకాలుగా పనిచేస్తాయి (రఘునాథ్).
శ్రీగోమాత గాయత్రి ఆర్గానిక్స్ కుప్పింట మొక్కనుపయోగించి బహుళ పంటలలో విస్తృతంగా ఉపయోగించే వ్యవసాయ పురుగుమందుని తయారు చేశారు. దీని తయారీకి కావలసిన మొక్కల పదార్థాలు : పసుపు, వేప, మిరప, అల్లం, ఉల్లి, జిల్లేడు (కలోట్రాపిస్ జైగాంటియా, కలోట్రాపిస్ ప్రోసెరా), బొప్పాయి, కానుగ, తులసి, పొగాకు, లాంటానా, ఉమ్మెత్త, కుప్పింట, ఆముదం, సింబోపోగాన్ సిట్రేటస్, ఆముదం మొక్క, సదాపుష్ప (కాథరాంతస్ రోసియస్), గన్నేరు. వావిలి, ఉల్లి, మిరియాలు, సీతాఫలం, టేకు, వస, నీలగిరి చెట్టు, జట్రోఫా, పుదీన, గరిక, గోమూత్రం, గోమయం.
ఈ పురుగుమందు అనేక పంటలలో పురుగులను సంహరిస్తుంది. మొక్కలలో పురుగులు, తెగుళ్ళు, వైరస్ల నిరోధకశక్తిని పెంచుతుంది. తెగులుకారక సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. అనేక పురుగులను వికర్షిస్తుంది. శిలీంద్రాలు, లార్వాలు, క్రిములు, బాక్టీరియా, నులిపురుగులు, గుల్లలు, నత్తలను చంపుతుంది. దీనినుపయోగిస్తే ఇంకే పురుగుమందును వాడవలసిన అవసరం లేదు. మోతాదు : 3% (30 మి.లీ./లీ.) పురుగుమందు పిచికారి చేయాలి., ఎకరానికి 35 లీ. ఒకసారి పిచికారి చేయడానికి ఉపయోగించాలి. నిల్వ కాలం : 3 సంవత్సరాలు
కుప్పింట ఆకుల పొడి నీటి ద్రావణం (0.05 గ్రా./లీ.) టమాట కాయనాశించే బాక్టీరియం, క్ౙాంతోమోనాస్ వెసికటోరియాపై బాక్టీరియానాశక చర్యను ప్రదర్శించింది (అడెడైర్, అతని అనుచరులు, 2017).
వ్యవసాయ రంగంలో బయోచార్ (Biochar) అనేది ఇప్పుడు ఒక కొత్త సంచలన పదం. ఒకే రకమైన పంటలు సాగు, వ్యర్థాలను పొలాల్లోనే కాల్చడం మరియు పరిమితికి మించి రసాయన ఎరువుల వాడకంతో భూముల్లో సేంద్రియ కర్బనం అడుగంటుతోంది. ఇదే కొనసాగితే భూములు సాగుకు పనికిరావు. దీనికి పరిష్కారంగా పంట వ్యర్థాలతో తయారుచేసే బయోచార్ (జీవ బొగ్గు) నేలలో సేంద్రియ కార్బన్ ను పెంచుతుంది.
సాధారణంగా పంట కోతలు పూర్తయ్యాక రైతులు పంట వ్యర్ధాలను పొలాల్లోనే తగలబెడుతుంటారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరగడమే కాకుండా, నేలలో ఉండే మిత్రపురుగులు, మేలుచేసే సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. ఫలితంగా భూసారం క్షీణించి, సేంద్రియ కార్బన్ (Organic Carbon) శాతం పడిపోతోంది. అయితే, ఈ సమస్యకు పంట వ్యర్థాలతోనే అద్భుతమైన పరిష్కారం కనుగొనవచ్చు. పత్తి, కంది, మిరప, ఆముదం మరియు మొక్కజొన్న వంటి పంటల సేంద్రియ వ్యర్థాలను తగలబెట్టకుండా, ఒక ప్రత్యేక పద్ధతిలో ‘బయోచార్’ (జీవ బొగ్గు) గా మార్చవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో కూడిన ఈ పద్ధతి ద్వారా నేలకు అధిక మొత్తంలో సేంద్రియ కార్బన్ను అందించి, భూసారాన్ని మళ్లీ పెంపొందించుకోవచ్చు. ప్రస్తుతం సాగుచేసే పంటలలో ఎక్కువగా రసాయన ఎరువుల వాడకం వల్ల నేల ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటోంది. ఈ సమస్యను తగ్గించడానికి మరియు నేల సారాన్ని పెంచడానికి బయోచార్ ఉపయోగకరంగా ఉంటుంది.
బయోచార్: బయోచార్ అనేది ప్రాథమికంగా ‘కాల్చిన’ వ్యవసాయ వ్యర్థం. బయోమాస్ అనే సేంద్రియ పదార్థాలను తక్కువ ఆక్సిజన్ పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రత వద్ద నిదానంగా మండించడం (పైరోలైసిస్) ద్వారా తయారయ్యే నల్లటి కార్బన్ పదార్థాన్ని బయోచార్ అంటారు. ఇది రంధ్రాలు (సచ్చిద్రత) కలిగి ఉన్న, అత్యధిక కార్బన్ గల ఒక స్థిరమైన పదార్థాన్ని సృష్టిస్తుంది, దీనిని నేల లక్షణాలను మెరుగుపరచడానికి మట్టిలో కలపవచ్చు.
నేలలో బయోచార్ (ప్రత్యేక పద్ధతిలో తయారుచేసిన బొగ్గు) ఉపయోగించడం వల్ల భూసారం అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇది నేలలో మేలు చేసే సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడటమే కాకుండా, నీటిని మరియు పోషకాలను పట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఇసుక నేలలు, ఎర్ర నేలలు, మరియు సేంద్రియ కార్బన్ లోపించిన భూముల్లో బయోచార్ వాడకం వల్ల ఆశించిన దానికంటే మంచి ఫలితాలు వస్తాయి.
అంతేకాదు, ఇది నేలలో గాలి ప్రసరణను మెరుగుపరిచి, పంటల వేర్లు లోతుగా, బలంగా పెరగడానికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. రసాయన లేదా సేంద్రియ ఎరువుల ద్వారా అందించే పోషకాలు త్వరగా కరిగి వృథా కాకుండా, మొక్కకు అవసరమైనప్పుడు అందేలా ఎక్కువ కాలం నిల్వ ఉంచడంలో బయోచార్ కీలక పాత్ర పోషిస్తుంది.
బయోచార్ వల్ల కలిగే ప్రయోజనాలు
నేల ఉదజని సూచిక (pH) సర్దుబాటు : బయోచార్ క్షార గుణాన్ని (alkaline) కలిగి ఉంటుంది మరియు ఆమ్ల నేలల్లో నేల ఉదజని సూచిక స్థాయిని పెంచుతుంది. ఇది పోషకాలు మరియు ఖనిజ లవణాలల లభ్యతను, వాటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుతుంది.
నేల కాటయాన్ ఎక్స్ఛేంజ్ యజ్ కెపాసిటీ (CEC) పెరుగుదల : బయోచార్ తక్కువ పరిమాణంలో ఎక్కువ ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది మరియు ఇది అత్యధిక నెగటివ్ ఛార్జ్ (negatively charged) కలిగి ఉంటుంది. ఇది నేలలోని పాజిటివ్ ఛార్జ్ కలిగిన కాటయాన్లను (positively charged cations) పట్టి ఉంచుతుంది, తద్వారా కాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ (CEC) ని మరియు నేల సారాన్ని పెంచుతుంది.
బయోచార్ నేలకు పోషకాలను జోడిస్తుంది ఇది బయోచార్ తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాల లోని పోషకాల పరిమాణం మరియు దానిని తయారు చేయడానికి ఉపయోగించిన సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. పశువుల ఎరువు మరియు కంపోస్ట్ లాగే, బయోచార్ను నేలలో వేయడానికి ముందు దానిలోని పోషకాల పరిమాణాన్ని పరీక్షించాలి, ఎందుకంటే పోషకాల పరిమాణం చాలా భిన్నంగా ఉంటుంది మరియు బయోచార్ అప్లికేషన్లు పెద్ద మొత్తంలో (bulky) ఉంటాయి. బయోచార్లో ఏవైనా విషపూరిత అయాన్లు (toxic ions) ఉన్నాయా అనేదానిని కూడా పరీక్షించాలి.
నేలలో కార్బన్ పరిమాణం పెరుగుదల : బయోచార్లో 80% వరకు కార్బన్ బ్లాక్ (carbon black) ఉంటుంది. దీనిని మట్టిలో కలపడం వల్ల కార్బన్ పరిమాణం మరియు C:N నిష్పత్తి (కార్బన్-నైట్రోజన్ నిష్పత్తి) పెరుగుతాయి. బయోచార్లోని కార్బన్ శాతం అనేది ప్రధానంగా పైరోలైసిస్ ప్రక్రియ మరియు ఉపయోగించిన ముడి పదార్థాల కార్బన్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.
బయోచార్ నేలలో సూక్ష్మజీవుల క్రియాశీలతను మరియు వైవిధ్యాన్ని పెంచుతుంది : బయోచార్లో ఉండే అధిక రంధ్రాల గుణం, దాని నీటి మరియు పోషకాలను నిల్వ ఉంచుకునే సామర్థ్యంతో కలిసి నేలలోని సూక్ష్మజీవులకు సురక్షితమైన ఆవాసాన్ని కల్పిస్తుంది. ఇది పొలాన్ని ఖాళీగా విడిచిపెట్టినప్పుడు (fallow) మరియు కరవు కాలంలో కూడా సూక్ష్మజీవులు మనుగడ సాగించేలా చేస్తుంది. బయోచార్ కొన్ని సూక్ష్మజీవులకు తగిన శక్తి వనరును కూడా అందిస్తుంది. సూక్ష్మజీవుల క్రియాశీలత పెరగడం వల్ల మొక్కలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాల పునరుత్పత్తి (nutrient re-cycling) పెరగడం, పోషకాలు కొట్టుకుపోవడం తగ్గడం, మొక్కలకు పోషకాలు మరింత సులభంగా లభించేలా చేయడం, గాలి నుండి నైట్రోజన్ ను గ్రహించడం, నేలలో కార్బన్ను నిలిపి ఉంచడం మరియు జోడించడం, తెగుళ్లు మరియు వ్యాధులను తగ్గించడం. ఇది కృత్రిమ ఎరువులు మరియు పురుగుమందుల అవసరాన్ని సాధారణంగా తగ్గిస్తుంది, తద్వారా వాణిజ్యపరమైన మరియు పర్యావరణపరమైన అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి.
నేలలోని విషపూరిత పదార్థాలను తగ్గించడం ద్వారా బయోరెమిడియేషన్ (Bioremediation) పెరిగిన సూక్ష్మజీవుల క్రియాశీలత నేలలోని విషపూరిత పదార్థాలను మరియు పురుగుమందుల అవశేషాలను విచ్చిన్నం చేస్తుంది. బయోచార్ కొన్ని పురుగుమందులను ‘చీలేట్స్’ (chelates) చేయడం ద్వారా వాటి ప్రభావాన్ని నిష్క్రియం చేస్తుంది, తద్వారా సూక్ష్మజీవులు వాటిని జీర్ణం చేసుకోగలుగుతాయి.
నేల ఆకృతి మెరుగుపడటం (Improvement of soil structure) బయోచార్ చేర్చిన నేలలో పెరిగే CEC (కాటయాన్ ఎక్స్ఛేంజ్ కెపాసిటీ), సూక్ష్మజీవుల మరియు వేర్ల క్రియాశీలత.. నేల కణాలు ఒకదానితో ఒకటి అతుక్కుని (soil aggregates) మరింత స్థిరమైన, నీరు చొరబడగలిగే భౌతిక ఆకృతిని ఏర్పరచడంలో సహాయపడతాయి. ఇది నేలలోకి నీరు ఇంకడాన్ని మరియు నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. రంధ్రాలు (porous) కలిగిన నేల మెరుగైన వాయు మార్పిడికి తోడ్పడుతుంది; దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్లడం, ఆక్సిజన్ లోపలికి రావడం మరియు మెరుగైన నైట్రోజన్ మార్పిడి జరిగి వేర్ల ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.
వ్యవసాయ కాలుష్యం తగ్గింపు (Agricultural pollution reduction) నేలలో పోషకాలను నిలిపి ఉంచే సామర్ధ్యం పెరగడం వల్ల, కరిగిపోయే ఎరువులు మరియు రసాయనాలు భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోవడం (leaching) తగ్గుతుంది. పెరిగిన సూక్ష్మ జీవుల క్రియాశీలత మరియు చెలేషన్ ప్రక్రియ పురుగుమందులను నిష్క్రియం చేస్తాయి. భౌతిక ఆకృతి మెరుగుపడటం వల్ల నీటి ప్రవాహం
(runoff) మరియు నేలకోత (erosion) తగ్గుతాయి. సాధారణంగా ఎరువులు మరియు రసాయనాల వాడకం తగ్గడం వల్ల వ్యవసాయ కాలుష్య ముప్పు చాలా వరకు తగ్గుతుంది.
కార్బన్ నిక్షిప్తం (Carbon Sequestration) బయోమాస్ కార్బన్ ను బయోచార్గా మార్చడం ద్వారా అసలు కార్బన్లో 50% వరకు కుళ్ళిపోవడానికి నిరోధకత కలిగిన ఒక స్థిరమైన రూపంలో నిక్షిప్తం చేయవచ్చు. ఇది శతాబ్దాల పాటు నేలలోనే ఉండిపోతుంది, మిగిలిన 50% ఆహారం మరియు శక్తి కోసం ఉపయోగించవచ్చు. దీనికి భిన్నంగా, వ్యర్థాలను కాల్చడం ద్వారా కేవలం 3% కార్బన్ మాత్రమే, మరియు జీవసంబంధమైన కుళ్ళిపోవడం (biological decomposition) ద్వారా 20% కంటే తక్కువ కార్బన్ మాత్రమే నిక్షిప్తమవుతుంది. కాబట్టి వ్యవసాయ నేలల్లో కార్బన్ ను నిక్షిప్తం చేయడానికి మరియు నేలలపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి భారీ అవకాశం ఉంది. గమనిక: పునరుత్పాదక కార్బన్ పదార్థం నుండి బయోచార్ను తెలివిగా మరియు స్థిరమైన పద్ధతిలో ఉపయోగించాలి. బయోదార్ను నేల సవరణగా చేర్చేటప్పుడు రైతు బయోదార్ యొక్క లక్షణాలను మరియు నేల యొక్క స్వభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. బయోచార్ స్వయంగా ఒక కాలుష్య కారకంగా మారకుండా ఉండటానికి దానిని మట్టిలో బాగా కలపాలి.
జాగ్రత్తలు
నేరుగా ఎక్కువ మోతాదులో వేయకూడదు
కంపోస్ట్ లేదా పశువుల ఎరువుతో కలిపి వేయడం మంచిది
పొడి రూపంలో వాడేటప్పుడు గాలి ద్వారా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
నేల పరీక్ష ఆధారంగా మోతాదు నిర్ణయించాలి
సిఫార్సు మోతాదు
ఎకరానికి 4 నుండి 6 క్వింటాళ్లు వరకు వేసుకోవచ్చు
సేంద్రియ ఎరువులతో కలిపి వేయాలి బయోచారును సేంద్రియ ఎరువులు, జీవామృతం, ఘన జీవామృతం, వర్మీకంపోస్ట్ వంటి వాటితో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రస్తుతం సహజ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయంలో బయోచారుకు మంచి ప్రాధాన్యత లభిస్తోంది. బయోచార్ వినియోగం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడి, స్థిరమైన వ్యవసాయం సాధ్యమవుతుంది.
డా. బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం (SKLTGHU), M. No. 8374278258
పంట వ్యర్థాలను సద్వినియోగం చేసుకునేందుకు బయోచార్ (జీవబొగ్గు) విధానాన్ని అమలు చేయాలని కొండాలక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఇటీవల నివేదిక సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలు దహనం జరుగుతున్న నేపథ్యంలో.. వ్యవసాయానుబంధ శాఖలు, వర్సిటీలతో అధ్యయనం చేయించి, నివేదిక సమర్పించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. దీనికి అనుగుణంగా ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి తమ శాస్త్రవేత్తలు, అధికారులతో సమావేశమయ్యారు. పంట వ్యర్థాలతో రూపొందించే బయోచార్ విధానం దీనికి సరైన పరిష్కారమని చర్చించారు. పొలంలో గొయ్యి తీసి దానిలో పంట వ్యర్థాలను వేసి దహనం చేసి బొగ్గుగా మార్చి ఎరువుగా ఉపయోగిస్తున్నారు. దీనిపై హైదరాబాద్లోని ఉద్యాన కళాశాలలో బయోచార్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించగా.. అది విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా నివేదిక సమర్పించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారంగా భావించే ప్రతిష్ఠాత్మక ‘ఫుడ్ప్లానెట్ ప్రైజ్ 2026 ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎనఎఫ్కు దక్కింది. ఈ అవార్డును స్వీడన్కు చెందిన కర్ట్ బెర్గ్ఫోర్స్ ఫౌండేషన్ అందిస్తోంది. జూన్ 2న స్వీడన్లోని బస్టాడ్లో జరిగిన కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక వైస్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు టి. విజయ్ కుమార్, వ్యవసాయశాఖ ఎక్సఅఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఈ అవార్డు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,000 నామినేషన్లు రాగా.. అందులో ఏపీసీఎనఎఫ్ ఎంపికైంది. అవార్డు కింద ఏపీసీఎనఎఫ్కు 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.14కోట్లు) అందజేశారు. ఫైనల్కు చేరిన కాన్షియస్ కిచెన్ (అమెరికా), నోపామ్ ఇంగ్రేడియంట్స్ (నెదర్లాండ్స్), సవన్నా ఇన్స్టిట్యూట్(అమెరికా) కు 1,50,000 డాలర్లు (సుమారు రూ.1.4 కోట్ల) చొప్పున అందించారు. అవార్డు ద్వారా లభించే మొత్తంతో ప్రకృతి వ్యవసాయంపై ప్రదర్శనా క్షేత్రాలు, ప్రత్యేక లీడర్షిప్ కోర్సు, రైతు శాస్త్రవేత్తలతో డాక్యుమెంట్ రూపొందించనున్నట్లు రైతు సాధికార సంస్థ తెలిపింది. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితోనే ఈ అవార్డు సాధ్యమైంది. ఏపీలో 18 లక్షల రైతు కుటుంబాలు, 7లక్షల రైతు కూలీల కుటుంబాలు, మార్పునకు కారణమైన 3.4 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళల తరపున ఈ అవార్డును అందుకోవడం గర్వకారణం’ అని విజయ్కుమార్, రాజ శేఖర్ పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు ప్రోత్సాహంతో రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేళ్ల కిందట ప్రారంభించారు. అదిప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ ఉద్యమంగా ఎదిగింది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన గ్రామీణ మహిళల్ని ఇందులో భాగస్వాములుగా చేశారు. తమ కుటుంబాలు ప్రకృతి వ్యవసాయం చేసేలా మార్పు తీసుకురావడంలో వీరు కీలకపాత్ర పోషించారు.
రాష్ట్రవ్యాప్తంగా 10వేల మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్(సీఆర్పీ)ల ద్వారా రైతులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 1,000 మందికి పైగా రైతు శాస్త్రవేత్తలు, మెంటార్లు, 700 మందికి పైగా రైతు పరిశోధకులు ప్రత్యేక సేవలందిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ, కేఎఫ్ డబ్ల్యూ బ్యాంక్, అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ సహకారం అందిస్తున్నాయి.
తెలంగాణలో ఆయిల్పామ్ సాగులో ఆధునిక సాంకేతికతను, పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఇక్రిశాట్లో 100 ఎకరాల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేసి ఆయిల్పామ్లో నాణ్యమైన విత్తనాలు, అధిక దిగుబడి రకాల వృద్ధి, హైబ్రిడ్ సృష్టికి ఇందులో పరిశోధనలు జరగనున్నాయి. ఈ మేరకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఉద్యాన శాఖ, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయాలను ఆదేశించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కోసం భారత్ ఆయిల్పామ్ పరిశోధన సంస్థ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్) ని సైతం భాగస్వామిగా చేర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్రంలో 2.91 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగవుతోంది. ఏటా రెండు లక్షల ఎకరాల పెంపుదలను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ప్రభుత్వ రంగంలో ఆయిల్ఫెడ్, ప్రైవేటు రంగంలో 14 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆయిల్పామ్ సాగుకు సబ్సిడీలను ఇస్తోంది. ఇంత చేస్తున్నా ఆశించిన స్థాయిలో సాగు పెరగడంలేదు. ఈ నేపథ్యంలో ఆయిల్షామ్ సాగుకు ఏర్పడుతున్న అడ్డంకులను ప్రభుత్వం అధ్యయనం చేయించి, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.
హెచ్క్యూ పీఎం-5 పేరుతో అభివృద్ధి చేసిన అధిక ప్రొటీన్ మొక్కజొన్న పంటను గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు (కేవీకే) ఈ విత్తనాలను కేవీకే శాస్త్రవేత్తలు ఈ రబీలో 20 ఎకరాల్లో సాగు చేయిస్తున్నారు. దిల్లీకి చెందిన భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) సహకారంతో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐ.ఏ.అర్.ఐ.) శాస్త్రవేత్తలు ఈ వంగడాలను అభివృద్ధి చేశారు. వీటిని ఆంధ్రప్రదేశ్లోని గండ్రాయి, చెర్వుకొమ్ముపాలెం, బబ్బెళ్లపాడు, తక్కెళ్లపాడు, అనుమంచిపల్లి, కన్నెవీడు గ్రామాల్లో రైతులకు పంపిణీ చేశారు. 20 ఎకరాల్లో పంట సాగులో ఉంది. పంట లేత కంకి దశలో ఉంది. కాకినాడ జిల్లా పెద్దాపురం అఖిల భారత సమన్వయ మొక్కజొన్న పరిశోధన ప్రాజెక్టు సౌజన్యంతో రైతులకు కలుపు మందులు, పురుగు మందులు ఉచితంగా అందించారు. ఈ విత్తనాల ప్రత్యేకతను కేవీకే సేద్యవిభాగం శాస్త్రవేత్త డాక్టర్ పీఎన్ శివప్రసాద్, వ్యవసాయ విస్తరణ విభాగం శాస్త్రవేత్త ఐ. వెంకటరెడ్డి వివరించారు. ఇది బయోఫోర్టిఫైడ్ హైబ్రిడ్ రకం మొక్క జొన్న. సాధారణ రకంతో పోలిస్తే ఇందులో రెట్టింపు అమైనో ఆమ్లాలు (లైసిన్, ట్రిప్టోఫాన్), అధిక ప్రొవిటమిన్-ఎ కంటెంట్తో మెరుగైన పోషకాలు ఉంటాయి. ఈ పంట 90 రోజుల్లో కోతకు వస్తుంది. వ్యాధి నిరోధకత ఎక్కువగా ఉండే ఈ మొక్కజొన్నను మనుషులు తినేందుకు, పశువుల దాణాకు కూడా వినియోగిస్తారు. హెచ్క్యూ పీఎం-5 మొక్కజొన్నలో పోషకాల నాణ్యత దాదాపు 3.37 శాతం లైసిన్, 0.72 శాతం ట్రిప్టోఫాన్, 6.60 పీపీఎం ప్రొవిటమిన్-ఎ కలిగి ఉంటుంది. హెక్టారుకు 43-76 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మన ప్రాంతంతో పాటు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో సాగుకు అనుకూలం. ఇది 5.8-6.8 పీహెచ్ ఉన్న నేలల్లో బాగా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్ కింద దేశ ప్రజల్లో పోషకాహార లోపాలను నివారించడానికి ఈ రకం విత్తనాల సాగును ప్రోత్సహిస్తోంది.
తెలంగాణా రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు అధునాతన శాస్త్రీయ సలహాలు, సూచనలు అందించేందుకు గాను అన్ని హాంగులతో కూడిన ఉద్యాన టెక్నాలజీ సమాచార కేంద్రాన్ని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన పరిపాలన కార్యాలయంలో త్వరలోనే ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నామని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ డి. రాజిరెడ్డి అన్నారు. ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణులు డాక్టర్ దిలీప్ ఉద్యానవర్సిటీని సందర్శించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. రైతులకు విస్తరణ సేవలు మరింత బలోపేతం చేసేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యాన పంటల్లో డ్రోన్ టెక్నాలజీ పంటల చీడ, పీడల నిఘా, నియంత్రణ తద్వారా దిగుబడి, నాణ్యత పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల్లో మోడల్ డ్రోన్ వాడకం దేశానికే ఆదర్శంగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఉద్యాన రంగంలో ఆవిష్కరణల పెంపొందింపు, అంకుర పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిచ్ౘ్ేందుకు హార్టీ ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పుతామని తెలిపారు. ఉద్యాన రంగంలో మొక్కలు నాటడం మొదలుకొని కోత, కోత అనంతరం విలువ జోడింపు వరకు స్టార్టప్ల స్థాపనకు మేలైన అవకాశాలు ఉన్నాయని డాక్టర్ దిలీప్ తెలిపారు. రైతులు, విద్యార్థులు, ఔత్సాహికులకు ఇవి బాగా ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్టార్ డాక్టర్ భగవాన్, హార్టికల్ౘ్ర్ డీన్ డాక్టర్ జె. చీనా, పరిశోధన సంచాలకులు డాక్టర్ డి. లక్ష్మీనారాయణ, విస్తరణ సంచాలకులు డాక్టర్ సురేష్ కుమార్, కంట్రో…ర్ ఆఫ్ ఎగ్ౙామినేషన్స్ డాక్టర్ ఎన్ శ్రీనివాసన్, కన్సల్టెంట్ డాక్టర్ వీరాంజనేయులు, డాక్టర్ సునందిని, ప్రొఫెసర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆదివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలోని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండే షన్ కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు వసతి గృహాన్ని, విలువ ఆధారిత ఉత్పత్తుల ఆహార శుద్ధి ప్రయోగశాలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. అన్నదాతలు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే విధంగా కేవీకేలు కృషి చేస్తున్నాయన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ.. ప్రజాప్రయోజనాల కోసమే కేవీకేలు పనిచేస్తున్నాయని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరారు. జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి డీజీ మంగీలాల్ ఝాట్, అటార్నీ డైరెక్టర్ షేఖ్ ఎన్మీరా, అఖిల భారతీయ కార్యకారిణి సదస్య బాగయ్య తదితరులు మాట్లాడారు. అంతర్ౙాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తునికి సర్పంచి ధనలక్ష్మిని కేంద్ర మంత్రి సంజయ్ సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెండురోజుల రైతుమేళా రాజేంద్రనగర్లోని క్రీడా ప్రాంగణంలో ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మానవరహిత వ్యవసాయ ప్రాజెక్టులో భాగంగా అగ్రివర్సిటీ సాంకేతిక కేంద్రం, ఇంజినీరింగ్ విభాగం, అగ్రి రోబోటిక్స్, ఐవోటీ సొల్యూషన్స్ ఫర్ అగ్రికల్చర్ (అరిసా) కేంద్రం రూపొందించిన రోబోలు, ఫార్మ్ రోబోలు, ఆధునిక యంత్ర పరికరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితోపాటు అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు, సేంద్రియ ఎరువులు, చిరుధాన్య ఉత్పత్తులకు సంబంధించి మొత్తం 102 స్టాళ్లను ఏర్పాటు చేయగా రైతులు భారీగా తరలివచ్చారు. ప్రధానంగా రూ.14 లక్షల విలువైన మెగాస్ప్రేయర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరి నారును పొలంలో సమాన దూరంలో నాటే రైస్ ట్రాన్స్ప్లాంటర్ కూడా ఆకట్టుకుంది. భారత వరి పరిశోధన సంస్థ(ఐఐఆరఆర్) అభివృద్ధి చేసిన అధిక దిగుబడి విత్తన రకం డీఆరఆర్ ధాన్ 75, ఇతర రకాలను భారీగా కొనుగోలు చేశారు. భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ(ఐఐఎంఆర్) చిరుధాన్యాల రకాలు, ఆహారాల తయారీ విధానాలు, యంత్రాలను ప్రదర్శించింది. ఉద్యానశాఖ నూతన విత్తన రకాలు, పౌల్ట్రీ డైరెక్టరేట్లో ఏర్పాటు చేసిన కొత్త కోళ్ల రకాలు, దాణా, కమ్యూనిటీ సైన్స్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన సహజ ఆహార పదార్థాలను రైతులు కోనుగోలు చేశారు.
మహిళా రైతులకు త్వరలో డ్రోన్లు
తెలంగాణలో రైతులు కోటీశ్వరులు కావాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వర్సిటీ, వ్యవసాయ శాఖ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మెగా రైతు మేళాను పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి తుమ్మల ప్రారంభించారు. ‘వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మహిళా రైతులకు భవిష్యత్తులో డ్రోన్లు ఇస్తాం. డిమాండ్కు అనుగుణంగా పంటమార్పిడి, సహజ వ్యవసాయ విధానాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం’ అని తుమ్మల తెలిపారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ‘రైతులు అధునాతన నైపుణ్యాలు, సాంకేతికతను వినియోగించుకొని ఉత్పత్తులను పెంచాలి. అగ్రివర్సిటీ నూతన వంగడాలను రైతులకు అందుబాటులోకి తేవాలి’ అని సూచించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ‘ఆహార ఉత్పత్తిలో మహిళలది ప్రధాన పాత్ర. వారిని ఆర్థికంగా ప్రోత్సహించేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో భాగస్వామ్యం కల్పించేలా కృషి చేస్తున్నాం’ అన్నారు.