రైతుల కోసం కేంద్రం కొత్త పథకాలు
రైతుల ఆదాయం, ఆహార భద్రతను మెరుగు పరిచేందుకు కేంద్రం పీయం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషోన్నత యోజన పథకాలను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అందుకోసం 1,01,321 కోట్ల రూపాయలు కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం లభించినట్లు మంత్రి పేర్కొన్నారు. పీయం-ఆర్కేవీవైలో భాగంగా నేల సారం, పంటల వైవిధ్యం, వ్యవసాయ యాంత్రీకరణ… వంటి వివిధ చర్యల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించాలని నిర్ణయించాం అని మంత్రి అన్నారు. నూనెగింజల ఉత్పత్తిలో దేశానికి స్వావలంబన చేకూర్చేందుకు ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్’ ఏర్పాటుకు రూ. 10,103 కోట్లు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. ఈ మిషన్ ద్వారా రానున్న ఏడేళ్ళలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నాం అని మంత్రి అన్నారు. ఈ మిషన్లో భాగంగా నూనెగింజల సాగును 40 లక్షల హెక్టార్లకు విస్తరించనున్నాం అని మంత్రి చెప్పారు.

