రూ.150కే పెయ్య దూడ

  • నేటి నుంచి రైతులకు అందుబాటులో వీర్యం
  • రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి 10 లక్షల డోసులు

గేదెలకు పెయ్యదూడలు మాత్రమే పుట్టేందుకు వీలుగా రూపొందించిన లింగ నిర్ధారిత వీర్యం రూ.150కే అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ మర్రిపూడి శ్రీనివాసరావు వెల్లడించారు. ఆయన సోమవారం గుంటూరులోని తన కార్యాలయంలో మాట్లాడారు. ‘లింగ నిర్ధారిత వీర్యం విలువ బహిరంగ మార్కెట్‌లో ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులోకి తెస్తున్న వీర్యం ఒక్కో డోసు రూ.300 వరకు ఉండగా, రైతులకు రూ.150 సబ్సిడీతో ప్రభుత్వం సరఫరా చేస్తుంది. మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం వల్ల అతి తక్కువ ధరకే రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం దక్కింది. గతంలో ఇదే లింగ నిర్ధారిత వీర్యం కోసం రైతులు రూ.550 చెల్లించాల్సి వచ్చేది. పశు యజమానులపై భారం తగ్గించేందుకు నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డుతో సంప్రదింపులు జరిపి తక్కువ ధరకు రైతులకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల డోసులు (ఒక్కో గేదెకు రెండు డోసులు) లింగ నిర్ధారిత వీర్యం గేదెలకు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ వీర్యం వేయటం వల్ల గర్భం దాల్చే ఐదు లక్షల గేదెల్లో కనీసం 90 శాతం పెయ్యదూడలు పుట్టే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం చేపట్టటం వలన నేరుగా 20 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. 2030 నాటికి పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 30 లక్షల డోసులు లింగ నిర్ధారిత వీర్యం వేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ముర్రా గేదెలు, సంకర జాతి ఆవుల హబ్‌గా తీర్చి దిద్దాలన్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. దానివల్ల రానున్న ఐదు సంవత్సరాల్లో పశువుల్లో స్త్రీ సంపద పెరిగి పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. లింగ నిర్ధారిత వీర్యం అతి తక్కువ ధరకే అందజేసే కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నాం. పునరుత్పత్తి అవకాశం ఎక్కువగా ఉన్న గేదెలను ఎంపిక చేసి వీర్యం డోసులు ఇస్తాం. ఈ అవకాశం వినియోగించుకోవాలి’ అని కోరారు.

Read More

మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ సాయం

21న తొలి విడత చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి

అన్నదాత సుఖీభవ సాయాన్ని రైతులకు మూడు విడతల్లో అందజేస్తామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పీఎం కిసాన్‌ కింద కేంద్రమిచ్చే రూ.2 వేలు, రాష్ట్రం వాటా రూ.5 వేలు కలిపి ఈ నెల 21న తొలివిడతలో రూ.7 వేలు జమ చేస్తామన్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరులో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏరువాక పౌర్ణమిని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఇటీవల గుంటూరు నుంచి ఎగుమతి అయిన మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని కొన్ని కంటెయినర్లను చైనా అధికారులు తిరస్కరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన పంటను ఉత్పత్తి చేయాలి” అని వెల్లడించారు.

కోకో రైతులకు న్యాయం చేస్తాం
పెదవేగిలో సాగవుతున్న కోకో, పామాయిల్‌ పంటలను మంత్రి పరిశీలించి రైతులు, కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. పామాయిల్‌ తరహాలోనే కోకో గింజల కొనుగోలుకు విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. సరకు నాణ్యతతోనే గిట్టుబాటు ధరలు సాధ్యమవుతాయని స్పష్టంచేశారు. కంపెనీలు సాగు సమయంలో చెప్పే మాటలు ఆచరణలో విస్మరిస్తున్నాయని రైతులు మంత్రికి మొర పెట్టుకున్నారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు రాయితీపై పరికరాలివ్వాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కోరారు. ఏలూరు మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన 50 కిలోవాట్ల సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు.

Read More