పోలవరం సాగు నీటి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి 2027 జూలై నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థలు, జల వనరుల శాఖ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వెలగపూడి, సచివాలయంలో బుధవారం జల వనరుల శాఖపై మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌, ఈఎన్‌సీ ఎం. వెంకటేశ్వరరావు, చీఫ్‌ ఇంజనీరు నరసింహమూర్తి, మేఘా, బావర్‌ సంస్థల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. 1,396.60 మీటర్ల పొడవైన డయాఫ్రమ్‌వాల్‌ డిజైన్లను ఆప్రై సంస్థ… పోలవరం ప్రాజెక్టు అథారిటీకి, విదేశీ నిపుణుల ప్యానెల్‌కు అందజేసిందని అధికారులు ఆయనకు తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో నిపుణుల ప్యానెల్‌.. డిజైన్లపై వర్క్‌షాపు నిర్వహించి చర్చిస్తుందని, ఆ డిజైన్లను వచ్చే నెల 24 నాటికి ఆమోదిస్తామని వివరించారు. కొత్త వాల్‌కు రూ. 960.34 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర జలసంఘం ఆమోదించిందని, దానిని 2025 జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులతో పాటు కాంట్రాక్టు సంస్థలు వెల్లడించాయి. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులను 2025 నవంబరులో ప్రారంభించి 2027 జూలై నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నాయి. భూసేకరణ సహా కీలకమైన పనులన్నీ 2025 జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.