ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌లోగల ‘శ్రీ శాకంబరి కన్హా ఉపవన్‌ గోశాల’లో హోలీ వేడుకల కోసం ఆవుపేడతో గులాల్‌ తయారుచేశారు. దీని వాడకం వల్ల ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవని చెబుతున్న నిర్వాహకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పర్యావరణ హితమైన ఈ గులాల్‌ను పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ సంజయ్‌ చౌహాన్‌ పర్యవేక్షణలో ప్రకృతి సిద్ధంగా రూపొందిన ఈ గులాల్‌ సింథటిక్‌ రంగులతో కలిగే హాని బారిన పడకుండా చక్కటి ప్రత్యామ్నాయమని అంటున్నారు. మున్సిపల్‌ కార్పొరేషను ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ గోశాల ప్రయోగాలకు ఐఎస్‌వో ధ్రువపత్రం కూడా ఉందని, గతంలో పర్యావరణహిత పెయింటు కూడా తయారుచేసినట్లు సంజయ్‌ చౌహాన్‌ తెలిపారు. 4 రంగుల్లో రూపొందించిన గులాల్‌ ప్యాకెట్లను అన్‌లైనులో అందుబాటులో ఉంచినట్లు గోశాల చీఫ్‌ ఇంజినీరు బీకే సింగ్‌ వెల్లడించారు.