120 రోజుల్లోనే కంది పంట

  • ఏటా మూడు పంటలు.. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి
  • కొత్త వంగడాన్ని ఆవిష్కరించిన ఇక్రిశాట్‌

కందుల ఉత్పత్తిలో స్వావలంబన సాధించే దిశగా కొత్త వంగడాన్ని ఆవిష్కరించింది హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్‌). 120 రోజుల్లోనే పంట చేతికి రావడం, ఏడాదిలో మూడు పంటలు పండించుకునే అవకాశం ఉండడం.. చీడపీడలను, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడం ఈ వంగడం ప్రత్యేకతలు. ప్రస్తుత రకాలు వర్షాకాలంలోనే సాగుకు అనుకూలమైనవి. 6 నెలల పంటకాలంతో ఎకరాకు గరిష్ఠంగా 6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే ఇస్తున్నాయి. కొత్త వంగడం ఎకరాకు 10 క్వింటాళ్ల మేర దిగుబడి ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ‘ఐసీపీవీ 25444’ వంగడాన్ని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ హిమాన్ష్‌ పాఠక్‌ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ‘యాక్సిలరేటెడ్‌ క్రాప్‌ ఇంప్రూవ్‌మెంట్‌ గ్లోబల్‌ రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌’ డైరెక్టర్‌ సీన్‌ మేయెస్‌, ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. దేశంలో ఏటా 1.25 కోట్ల ఎకరాల్లో కంది పంట సాగవుతుండగా.. 35 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా.. 2.01 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. దేశీయ అవసరాల కోసం ఏటా 15 లక్షల టన్నుల మేర కందులను ప్రభుత్వం దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇక్రిశాట్‌లో ఐదేళ్ల విస్తృత పరిశోధన అనంతరం సీనియర్‌ శాస్త్రవేత్త గంగిశెట్టి ప్రకాశ్‌ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు బెలియప్ప శ్రుతి, బొమ్మ నరేశ్‌ల బృందం మేలైన కంది రకం ఐసీపీవీ 25444ను అభివృద్ధి చేసింది. తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో దీనిని పరీక్షించగా మంచి ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుత రకాలు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలను మాత్రమే తట్టుకుంటుండగా.. కొత్త రకం 45 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ పండుతుందని, ఎకరానికి 2 కిలోల విత్తనాలు సరిపోతాయని వెల్లడించారు.

పది లక్షల టన్నుల అదనపు ఉత్పత్తికి అవకాశం
నూతన వంగడంతో దేశంలో కంది సాగు, ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. దీని ద్వారా అదనంగా పది లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించే అవకాశం ఉంది. అన్నదాతల ఆదాయం మూడురెట్లు పెరుగుతుంది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వరికి ప్రత్యామ్నాయంగా కంది సాగు పెరిగేందుకు ఇది దోహదపడుతుంది.

  • హిమాన్షి పాఠక్‌, ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌
Read More

వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రకృతి సేద్యం

ప్రకృతి సేద్యాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల డిగ్రీ కోర్సుల్లో దాన్ని చేర్చాలని అగ్రి వర్సిటీల డీన్‌ల జాతీయ సదస్సు తీర్మానించింది. హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్‌)లో డీన్‌ల సదస్సు జరిగింది. వ్యవసాయ విద్యా విధానాలు, సవాళ్లు, పురోగమనం అంశాలపై ఇందులో చర్చించారు. 45 రాష్ట్ర, కేంద్ర, డీమ్డ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన 56 మంది డీన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు. నార్మ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌సీ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More

సేంద్రియ సాగు విస్తరించాలి

తెలంగాణలో సేంద్రియ సాగు విస్తరించాలని.. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి నేల, మానవ ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని ఉద్యాన శాస్త్రవేత్తలు సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అలబామ విశ్వవిద్యాలయం, ఏషియన్‌ పీజీపీఆర్‌ సొసైటీల ఆధ్వర్యంలో ‘మొక్కల ఆరోగ్యం – ఆహార భద్రత’పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ దండా రాజిరెడ్డి మాట్లాడుతూ సేంద్రియ సాగుకు ఆధునికతను జోడిస్తేనే సురక్షిత ఆహారం, మానవ ఆరోగ్యం సాధ్యమన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా ఉద్యాన పంటల ఉత్పత్తులను పెంచేందుకు సేంద్రియ పద్దతులను పాటించాలని, ఆధునిక పరిశోధన ఫలితాలను మేళవించి సుస్థిర వ్యవసాయ పద్ధతుల వైపు మరల్చాలని సూచించారు. అలబామ వర్సిటీ ప్రొఫెసర్‌, ఏషియన్‌ పీజీపీఆర్‌ సొసైటీ చైర్మన్‌ ఎంఎస్‌ రెడ్డి మాట్లాడుతూ సురక్షిత ఆహారానికి అనుగుణంగా పరిశోధనలు ముమ్మరం కావాలని చెప్పారు. ఉద్యాన వర్సిటీ అంతర్జాతీయ కార్యక్రమాల డైరెక్టర్‌ శ్రీనివాసన్‌, రిజిస్ట్రార్‌ భగవాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More