ఇజ్రాయెల్‌ కంపెనీ ప్రతినిధులు తుమ్మల నాగేశ్వరరావుతో మర్యాదపూర్వక భేటీ

ఇజ్రాయెల్‌ కంపెనీ యం.డి. హెచ్‌ఏఐ ఆర్‌ అండ్‌ డి ప్రతినిధులు మరియు విండ్‌ పొనిక్స్‌ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి, వారి సంస్థ ద్వారా వ్యవసాయరంగంలో చేపడుతున్న కార్యక్రమాలను మంత్రికి వివరించడం జరిగింది. స్మార్ట్‌ అగ్రికల్చర్‌, ఏ.ఐ సెన్సార్‌ మరియు ఆటోమేషన్‌ పద్ధతులు, డిజిటల్‌ రెయిన్‌ హార్వెస్టింగ్‌, గ్రే వాటర్‌ ట్రీట్‌ మెంట్‌ వంటి పద్ధతులపై వివరించి ఇజ్రాయిల్‌ మరియు భారతదేశం మధ్య కుదిరిన ఒప్పందం అనుసరించి యం.డి. హెచ్‌ఏఐ ఆర్‌ అండ్‌ డి భాగస్వామ్యంతో, తెలంగాణ రాష్ట్రంలో పైలట్‌ పద్ధతిలో వ్యవసాయరంగములో వస్తున్న ఆధునిక టెక్నాలజీని మన దగ్గర రైతులకు శిక్షణ ఇచ్చేందుకు, విండ్‌ పొనిక్స్‌ సంస్థ సిద్ధంగా ఉందని, అదేవిధంగా యూనివర్సిటీల మధ్య కూడా ఒప్పందాల ద్వారా ఇజ్రాయిల్‌ టెక్నాలజీని తెలంగాణ రాష్ట్రములో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
దానికి మంత్రి స్పందిస్తూ, తాను 1995 సంవత్సరములో ఇజ్రాయిల్‌ దేశంలో పర్యటించినపుడు అప్పటి ముఖ్యమంత్రి ప్రోత్సహముతో ప్రవేశపెట్టిన డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రాచుర్యంలోకి రావడానికి దాదాపు 25 ఏళ్లు పట్టిందని, అదేవిధంగా కొత్త టెక్నాలజీని ఒడిసిపట్టి, అది మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి రైతులకు సేద్యరంగములో తోడ్పడేందుకు తమ ప్రభుత్వము ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని, త్వరలోనే సంబంధిత అధికారులతో పూర్తి స్థాయిలో సమావేశమై, వారి ప్రాజెక్ట్‌ నివేదికను సమర్పించాల్సిందిగా ఆ ప్రతినిధులను కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ డైరెక్టర్‌ గోపి, హార్టికల్చర్‌ డైరెక్టర్‌ శ్రీమతి యాస్మిన్‌ బాషా, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More

సహకార శాఖ మరియు ఉద్యానశాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష

సిద్దిపేట జిల్లా, నర్మెట్టలో ఆయిల్‌ పాం ఫ్యాక్టరీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, మే నెలాఖరు వరకు ఆయిల్‌ పాం గెలల ప్రాసెసింగ్‌ ప్రారంభించాలని, టిజి ఆయిల్‌ ఫెడ్‌లో అంతర్జాతీయ స్థాయి కంపెనీలలో ఉండే ఆర్గనైజేషన్‌ స్ట్రక్చర్‌ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని ఈ రోజు సచివాలయంలో సహకార శాఖ మరియు ఉద్యానశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గద్వాల జిల్లా బీచుపల్లి ఆయిల్‌ పాం ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు.

టిజి ఆయిల్‌ ఫెడ్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సంస్థల మాదిరిగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయిల్‌ ఫెడ్‌ సంస్థలోని ఫ్యాక్టరీ, నర్సరీ, ప్లాంటేషన్‌, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌ మరియు ఇతర విభాగాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించి, సంస్థను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. మార్చి నాటికి ఆయిల్‌ పాం కంపెనీలు తమ నిర్దేశిత ప్లాంటేషన్‌ లక్ష్యాన్ని పూర్తి చేయించాలని డైరెక్టర్‌ గారికి సూచించారు. లక్ష్యాన్ని పూర్తి చేయనివారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సహకార సంఘాల నిర్వహణపై దృష్టి పెట్టాలని, గడువు ముగిసిన అన్ని సహకార సంఘాల ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు సరిచేసి సిద్ధంగా ఉంచాలని మంత్రిగారు అధికారులను ఆదేశించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న విచారణలను త్వరగా పూర్తి చేసి, తేలిన మొత్తాలను వెంటనే రికవరీ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో వ్యవసాయ సహకారశాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, హార్టికల్చర్‌ డైరెక్టర్‌ శ్రీమతి యాస్మిన్‌ బాషా, సహకార శాఖ డైరెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read More

ఆయిల్‌ పాం సాగులో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఆయిల్‌ పాం సాగులో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నేడు సచివాలయంలో ఆయిల్‌ పాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రిగారు.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్‌ పాం సాగు చేపట్టాలన్నారు. ఈ సంవత్సరంలో 16,729 ఎకరాలలో ఆయిల్‌ పాం సాగు చేపట్టగా, మార్చిలోగా 19,271 ఎకరాలలో ఆయిల్‌ పాం సాగయ్యేటట్టు చర్యలు తీసుకొని, లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఆయిల్‌ పాం గెలల ధర కూడా పెరిగినందున రైతులను ఆయిల్‌ పాం సాగు వైపు ప్రోత్సహించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టలన్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్‌ పాం ప్రాసెసింగ్‌ యూనిట్‌ జూన్‌ 1 కల్లా పూర్తి చేసి, ఆయిల్‌ పాం గెలల ప్రాసెసింగ్‌ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బీచ్‌పల్లి, కల్లూరు గూడెంలలో ప్రాసెసింగ్‌ ప్యాక్టరీల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ చేపట్టి, పనులు ప్రారంభించాలన్నారు. దీనివలన ఆయిల్‌ పాం సాగు చేపడుతున్న కొత్త జిల్లాలలో రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు, కొత్త రైతులు ముందకు రావడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అదేవిధంగా సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూములను సంస్థ పేరు మీదకు మార్చుకొని, చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్పోరేట్‌ సంస్థ మాదిరిగా పనిచేసేందుకు కార్పోరేట్‌ మోడల్లో వివిధ విభాగాలకు నిపుణత కలిగిన సిబ్బందిని నియమించుకునేట్టుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

*సహకార విద్యుత్‌ సరఫరా సంఘం లిమిటెడ్‌, సిరిసిల్ల (సెస్‌)*

నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరాను రైతులకు మరియు పవర్‌ లూమ్‌ పరిశ్రమకు అందించాలని సెస్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. అదనంగా ట్రాన్స్‌ ఫార్మర్లను అందుబాటులో ఉంచుకొని, సమస్య వచ్చిన వెంటనే మార్చి, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా విద్యుత్‌ రెగ్యులేటరి కమిషన్‌ నియమాల ప్రకారం సంస్థను నడిపించాలన్నారు. సంస్థ సిబ్బంది ప్రజాప్రతినిధులను కలుపుకొని వారి సూచనల మేరకు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.

*చేనేత జౌళి శాఖ*

చేనేత అభయ హస్తము పథకంను ప్రణాళికబద్దంగా అమలు చేయాలన్నారు. ఈ పథకమును త్వరితగతిన అమలు చేయుటకు నేత కార్మికులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని మరమగ్గాల యూనిట్లకు 25 హెచ్‌పి వరకు 50% విద్యుత్‌ సబ్సిడీ అమలు చేయాలని, యారన్‌ డిపో ద్వారా ఆసాములకు మాత్రమే నూలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆసాములకు నూలుకు అవసరమగు పెట్టుబడిని బ్యాంకుల ద్వారా అందజేయుటకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. తద్వారా ఆసాములు ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా నూలు కొనుగోలు చేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. యారన్‌ డిపో లో నూలు స్టాకులను పెంచి నూలు కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. జీ.వో.ఎంఎస్‌.నం. 1, తేదీ: 18.03.2024 ప్రకారము ఏ ఏ శాఖలు ఇప్పటిదాకా తమకు కావాల్సిన వస్త్ర ఇండెట్లు టెస్కో కు సమర్పించడం లేదో ఆయా శాఖల మీద చర్యలు తీసుకొనుటకు, చేనేత సహకార సంఘాలకు మరియు పవర్‌ లూమ్‌ సంఘాలకు టెస్కో ద్వారా చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశాలలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్‌, వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్‌ రావు, సహకారశాఖ డైరెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌, హార్టికల్చర్‌ డైరెక్టర్‌ శ్రీమతి యాస్మిన్‌ బాషా ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More