తెలంగాణలో సేంద్రియ సాగు విస్తరించాలని.. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి నేల, మానవ ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని ఉద్యాన శాస్త్రవేత్తలు సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అలబామ విశ్వవిద్యాలయం, ఏషియన్‌ పీజీపీఆర్‌ సొసైటీల ఆధ్వర్యంలో ‘మొక్కల ఆరోగ్యం – ఆహార భద్రత’పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ దండా రాజిరెడ్డి మాట్లాడుతూ సేంద్రియ సాగుకు ఆధునికతను జోడిస్తేనే సురక్షిత ఆహారం, మానవ ఆరోగ్యం సాధ్యమన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా ఉద్యాన పంటల ఉత్పత్తులను పెంచేందుకు సేంద్రియ పద్దతులను పాటించాలని, ఆధునిక పరిశోధన ఫలితాలను మేళవించి సుస్థిర వ్యవసాయ పద్ధతుల వైపు మరల్చాలని సూచించారు. అలబామ వర్సిటీ ప్రొఫెసర్‌, ఏషియన్‌ పీజీపీఆర్‌ సొసైటీ చైర్మన్‌ ఎంఎస్‌ రెడ్డి మాట్లాడుతూ సురక్షిత ఆహారానికి అనుగుణంగా పరిశోధనలు ముమ్మరం కావాలని చెప్పారు. ఉద్యాన వర్సిటీ అంతర్జాతీయ కార్యక్రమాల డైరెక్టర్‌ శ్రీనివాసన్‌, రిజిస్ట్రార్‌ భగవాన్‌ తదితరులు పాల్గొన్నారు.