ఈ మిశ్రమం సూక్ష్మక్రిములకు, వానపాములకు ఆహారంగా ఉపయోగపడి మొక్క ఆరోగ్యంగా పెరుగుటకు దోహదపడుతుంది.
మోతాదు : ఎకరానికి 50 లీటర్లు
కావలసిన పదార్థాలు : ఆవుపేడ : 25 కిలోలు; నీరు : 50 లీటర్లు; కుళ్ళిన పండ్లు లేదా కూరగాయలు : 20 కిలోలు.
తయారు చేయు విధానం: ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో నీరు, ఆవుపేడ కలిపి నాలుగు రోజులు మురగబెట్టాలి. కుళ్ళిన పండ్లు లేదా కూరగాయలను ఒక డ్రమ్ములో వేసి మూతబెడితే 4 రోజులలో కుళ్ళిపోతాయి. వీటిని అదే రోజున మెత్తగా పిసికి, ఆవుపేడ, నీళ్ళు కలిపిన డ్రమ్ములో వేసి కలియ పెట్టాలి. ఆపైన మూత వదులుగా పెట్టి, మరుసటి రోజున ఈ మిశ్రమాన్ని కర్రతో కలిపి డ్రమ్ముపై మూతపెట్టాలి. 10 రోజులలో మిశ్రమం తయారవుతుంది. 11వ రోజున ఈ మిశ్రమాన్ని వడబోసి, సుమారు 50 లీటర్లు ఒక ఎకరం పొలంలో నీటిద్వారా గాని, లేదా కళ్ళాపిలా గాని నేలపై చల్లాలి.
చేప-బెల్లం ద్రావణంలో ఎన్నో రకాల ‘అమినో యాసిడ్’ లు ఉంటాయి. ఇవి పంటల యొక్క పెరుగుదలకు ఉపయోగపడతాయి.
కావలసిన పదార్థాలు: చేప వ్యర్థాలు : 1 కిలో (ఎముకలు, మొప్పలు, చర్మం మొ॥); బెల్లం : 1 కిలో
తయారు చేయు పద్ధతి (చోహాన్ క్యూ పద్ధతి):
ఒక కిలో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించిన చేపల వ్యర్థ పదార్థాలను, ఒక కిలో బెల్లం పొడిని తీసుకొని బాగా కలిపి ఒక కుండలో నిలువ చేయాలి.
కుండపై మూతపెట్టి 10-12 రోజుల పాటు ఆ మిశ్రమాన్ని పులియబెట్టాలి.
ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ కర్రతో బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని 10-12 రోజుల తర్వాత వడపోసి, ఒక లీటరు మిశ్రమానికి 100 లీటర్ల నీటిని కలిపి (1 శాతం) ఒక ఎకరం పొలంలో పంటపై గానీ, పొలంలోని భూమిపైగానీ, కంపోస్టు గుట్టపైగానీ పిచికారీ చేయాలి. సూచనః
పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు.
ఈ ద్రావణాన్ని అన్ని పంటలలో, పండ్ల తోటలలో వాడవచ్చు.
ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే ఉపయోగించుకోవాలి. నిల్వ ఉంచరాదు.
రైతునేస్తం ప్రచురణ ‘స్వేద వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
వర్మి వాష్ తయారీ విధానం: 200 లీ. డ్రమ్ముని తీసుకుని, దాని అడుగు భాగం నుండి కొంచెం పైన కుళాయి బిగించాలి. డ్రమ్ములోపల 15 సెం.మీ. వరకు ఇసుకపోసి, ఇసుకపై డ్రమ్ముపై వరకు ఎర్రమట్టి పోయాలి. దానిపైన పేడ, కూరగాయల వ్యర్థాలను వేసి వానపాములను వదలాలి. ప్రతిరోజూ డ్రమ్ములో 2 లీ. నీటిని పోస్తూ ఉండాలి. ఇలా 15 రోజులు చేసిన తర్వాత డ్రమ్ములోని నీటిని కుళాయి ద్వారా పాత్రలో సేకరించి 15 రోజుల కొకసారి మొక్కలపై పిచికారి చేయాలి. డ్రిప్ ద్వారా వారానికొకసారి పంపించాలి. దీనివలన మొక్కలు ఆరోగ్యవంతంగా పురుగులు, తెగుళ్ళు సోకకుండా పెరుగుతాయి.
2030 నాటికి రసాయన ఎరువుల్లో తప్పనిసరిగా 10% పులియబెట్టిన సేంద్రియ ఎరువుల (ఎఫ్ఓఎం)ను కలిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ (ఐబీఏ) పిలుపునిచ్చింది. ఇందువల్ల ఏటా ఎరువుల దిగుమతులపై 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.19,000 కోట్లు) ఆదా చేయొచ్చని పేర్కొంది. ‘ఎఫ్ఎం నేలకు పోషణనిస్తుంది ఇందువల్ల సుస్థిరతకు నేల పోషణనిస్తుంది’ అనే శ్వేతపత్రాన్ని ఐబీఏ సమర్పించింది. కేంద్ర కొత్త, పునరుత్పాదక ఇంధన కార్యదర్శి సంతోష్ కుమార్ సారంగి ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేశారని ఐబీఏ తెలిపింది. దేశంలో క్షీణిస్తున్న నేల సారాన్ని పునరుద్ధరించడానికి, సుస్థిర వ్యవసాయం వైపు పరివర్తనను వేగవంతం చేయడానికి సూచనలు చేసినట్లు వివరించింది. 2030 నాటికి రసాయన ఎరువుల్లో ఎఫఎంను 10% మేర కలపడాన్ని దశల వారీగా సాదించాలని శ్వేతప్రతం ప్రతిపాదించింది. 2026-27లో 1%, 2027-28లో 3%, 2028-29లో 5%, మేర ఎఫఎఎంను రసాయన ఎరువుల్లో కలపడం తప్పనిసరి చేసి, 2030కి 10 శాతానికి చేర్చాలని ప్రతిపాదించింది. బయోగ్యాస్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల నుంచి ఎఫఎంను సమీకరించాలని తెలిపింది.
వినూత్న రీతిలో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. పంట కాలువల్లో విపరీతంగా పెరిగే ఈ గుర్రపు డెక్కతో సాగునీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఏళ్లుగా అన్నదాతలను పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఇదొకటి. మరోవైపు, గుర్రపుడెక్క తొలగింపునకు ప్రభుత్వం ఏటా భారీగా ఖర్చు చేస్తోంది. ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు పశ్చిమగోదావరి కలెక్టర్ చదలవాడ నాగరాణి వినూత్నంగా ఆలోచించారు. ‘గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారీకి శ్రీకారం చుట్టారు. డీఆర్డిఏ పీడీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆకివీడు మండలం సిద్ధాపురంలోని సంపద తయారీ కేంద్రంలో కుండీల్లో గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారీని ప్రయోగాత్మంగా చేపట్టారు. ఫలితంగా అన్నదాతల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు.. మహిళల ఉపాధికి అవకాశం ఏర్పడినట్లైంది. గుర్రపు డెక్క ముక్కలు, ఆవుపేడ, మైక్రోబియల్ కల్చర్తో ఇలా చేశారు. 3-9 అడుగుల కుండీల్లో కింద గడ్డిని పొరగా వేసి, ఆపైన ముక్కలుగా చేసిన గుర్రపుడెక్క, దానిపైన రెండు అంగుళాల మందంలో ఆవుపేడను ఏడు నుంచి ఎనిమిది పొరలుగా వేశారు. 21 రోజుల పాటు అలా వదిలేశారు. అనంతరం మైక్రోబయల్ కల్చర్ను వాడి త్వరగా కంపోస్టింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చేశారు. ఆ మిశ్రమాన్ని ఏడు వారాల తర్వాత గుళికలుగా తయారుచేశారు. ఎరువు తయారీ ప్రాంతాన్ని క్రిమికీటకాలు ఆకర్షించే ప్రమాదం ఉండడంతో ఇళ్లకు, గోదాములకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.*నాణ్యమైన సేంద్రియ ఎరువు… తక్కువ సమయంలో…* గుర్రపుడెక్క ఎరువు సాధారణ సేంద్రియ ఎరువు కంటే రెండు నుంచి మూడు రెట్లు నాణ్యంగా ఉన్నట్లు ప్రయోగ పరీక్షల్లో తేలింది. ఈ తీగ కుళ్లడానికి తక్కువ సమయం పడుతోంది. పశువుల వ్యర్థాల కన్నా ఇందులో నత్రజని, భాస్వరం, పొటాషియం, సేంద్రియ కర్బనం, కాపర్, మాంగనీస్, జింక్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. ఈ సేంద్రియ ఎరువు 6 నెలలపాటు నిల్వ ఉంటుంది. మిద్దె పంటలు, కొబ్బరి, మామిడి, సపోటా, కూరగాయలు, ఆయిల్పామ్, పూలమొక్కలు, కూరగాయలు, వరి, ఉద్యాన పంటలన్నింటికీ గుర్రపుడెక్కతో తయారుచేసిన ఎరువును ఉపయోగించుకోవచ్చు.*స్వయం ఉపాధి మార్గం* ఎరువు తయారీని మహిళా సమాఖ్యలకు అప్పగించడంతో ఆర్థికాభివృద్ధి సాధించడంతో పాటు రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన సేంద్రియ ఎరువు దొరుకుతోంది. గుర్రపుడెక్కతో తయారుచేసిన సేంద్రియ ఎరువు ధర కిలో రూ.12 నుంచి రూ.15గా, టన్ను రూ.12 వేలుగా నిర్ణయించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటికే 100 యూనిట్లు నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎరువు తయారు కావడానికి ఒక్కో యూనిట్లో 20 మందికి 50 రోజుల పాటు ఉపాధి లభిస్తుంది. దీనిని రైతులే స్వయంగా తయారు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.