రైతుకు లాభం… దేశానికి దన్ను!

కొత్త కంది వంగడంతో ఏటా మూడు పంటలు
ఎకరాకు టన్ను దిగుబడితో రూ.2.70 లక్షల రాబడి
నూతన వంగడం రూపకర్త, ఇక్రిశాట్‌ ప్రధాన శాస్త్రవేత్త గంగశెట్టి ప్రకాశ్‌

హైదరాబాద్‌లో కొత్తగా ఆవిష్కరించిన కంది వంగడం దేశ పప్పుదినుసుల రంగంలో విప్లవాత్మక మార్పులు తేనుంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చాక.. రైతుల రాబడి పెరగడంతోపాటు వినియోగదారులకు ప్రస్తుత ధరలకంటే తక్కువకే కంది పప్పు లభిస్తుందని ఐసీపీవీ 25444 వంగడం సృష్టికర్త హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌ సీనియర్‌ శాస్త్రవేత్త గంగశెట్టి ప్రకాశ్‌ భరోసా ఇస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఆయన జెనెటిక్స్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. ఇక్రిశాట్‌లో పదేళ్లుగా పనిచేస్తున్న ప్రకాశ్‌ పలు అంతర్జాతీయ పరిశోధనల్లో పాలుపంచుకున్నారు. తాజాగా ఆయన రూపొందించిన కంది రకం భారత్‌తో సహా పలు దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వంగడం విడుదల సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు.

స్పీడ్‌ బ్రీడ్‌ విధానాన్ని పాటించాం
‘మనదేశంలో 1.13 కోట్ల ఎకరాల్లో, తెలంగాణలో ఏడు లక్షల ఎకరాల్లో, ఏపీలో నాలుగు లక్షల ఎకరాల్లో కంది సాగవుతోంది. అదేసమయంలో ఇతర ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌ల లో దీని సాగు యేటేటా పెరుగుతోంది. ఈ దేశాలతో పోలిస్తే మన దిగుబడి తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇక్రిశాట్‌లో కందిపై 2021లో పరిశోధనలు ప్రారంభించాం. సంప్రదాయ విధానంలో కొత్త వంగడం రూపకల్పనకు 15 సంవత్సరాలు పడుతుంది. దీనికి భిన్నంగా స్పీడ్‌ బ్రీడ్‌ విధానాన్ని ప్రపంచంలో తొలిసారిగా వినియోగించి ఐసీపీవీ 25444 వంగడాన్ని తయారు చేశాం. తెలంగాణ, ఒడిశా, కర్ణాటకలలో ప్రయోగాత్మకంగా సాగు చేయించగా అద్భుత ఫలితాలు వచ్చాయి. దీనికి పెట్టుబడితోపాటు ఎరువులు, నీటి వినియోగం తక్కువ. దిగుబడి ఎక్కువ. ప్రతి 120 రోజులకు ఒకసారి చొప్పున ఏడాదికి మూడు పంటలు వేయవచ్చు. ఎకరానికి రెండు కిలోల విత్తనాలు చాలు. తక్కువ ఎత్తు ఉండడంతో ఎకరం విస్తీర్ణంలో సాధారణ పంట కంటే 30% అధికంగా మొక్కలను వేయొచ్చు. దాంతో ఎకరానికి టన్ను దిగుబడి వస్తుంది. ప్రస్తుతం క్వింటాలుకు రూ. 9 వేల చొప్పున కందికి ధర ఉండగా… ఎకరాకి 90 వేల మేరకు ఆదాయం రైతుకు ఒక పంటకు వస్తుంది. మూడు పంటలతో రూ.2.70 లక్షల మేరకు రాబడి పొందొచ్చు. దేశంలో ఏటా 3.5 మిలియన్‌ టన్నుల కందుల ఉత్పత్తి జరుగుతుంది. దేశీయ అవసరాలకు యేటా 1.5 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకుంటున్నాం. కొత్త వంగడంతో దేశంలో ఉత్పత్తి సామర్థ్యం మరో పది లక్షల టన్నుల మేరకు పెరిగే అవకాశముంది. తద్వారా దిగుమతుల భారం భారీగా తగ్గి, విదేశీమారక ద్రవ్యం మిగులుతుంది. కొత్త విత్తనాలను తెలుగు రాష్ట్రాలకు సాధ్యమైనంత త్వరగా అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాం అని ప్రకాశ్‌ అన్నారు.

Read More

రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి అనూహ్య స్పందన – PJTAU ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య

600 గ్రామాల్లో 37,000 రైతులతో అవగాహన కార్యక్రమం

  • రైతుల్లో అసంతృప్తి లేదు.. కానీ చేయాల్సింది చాలా ఉంది

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ సహకారంతో నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ రాష్ట్రవ్యాప్తంగా నిరాటంకంగా, విజయవంతంగా సాగుతోంది. మే 5వ తేదీన వికారాబాద్ జిల్లా ధరూర్ లో ఈ కార్యక్రమాన్ని శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ శ్రీ M. కోదండ రెడ్డి, PJTAU ఉపకులపతి డాక్టర్ అల్దాస్ జానయ్య లాంచనంగా ప్రారంభించారు. ఆరోజు నుండి ఈ కార్యక్రమం నేటి వరకు 600 గ్రామాల్లో నిర్వహించగా సుమారు 31,000 మంది పురుషులు, 6,000 మంది మహిళలు పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 37,000 మంది రైతులతో శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ విద్యార్థులు ముఖాముఖిగా మాట్లాడారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ MP డాక్టర్ మల్లురవి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ G. చిన్నారెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, ఎమ్మెల్సీలు, సుమారు 25 మంది శాసనసభ్యులు, వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ విద్యార్థులతో పాటు వారంలో ఒకరోజు ఉపకులపతి, ఇతర విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. PJTAU శాస్త్రవేత్తలు, విద్యార్థులు, వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు, అభ్యుదయ రైతులు, రైతు గ్రూపులు, సంఘాల ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఆరు అంశాలైన తక్కువ యూరియా వాడి సాగు ఖర్చును తగ్గించడం, అవసరం మేరకే రసాయనాలను వాడి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడడం, వివిధ ఇన్ పుట్స్ కొనుగోలుకు సంబంధించిన రశీదులని భద్రపరచుకోవడం, సాగునీటిని ఆదా చేయడం, పంట మార్పిడులను పాటించి సుస్థిరాదాయాన్ని పొందడం, చెట్లను నాటి పర్యావరణాన్ని రక్షించడం వంటి వాటిపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్ధులు రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే రైతులు అడుగుతున్న అనేక సందేహాలను శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో నివృత్తి చేస్తున్నారు.

ఉపకులపతి సమీక్ష :-

   మూడు వారాలుగా సాగుతున్న 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం పై ఉపకులపతి అల్దాస్ జానయ్య ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ కార్యక్రమానికి రైతాంగం నుంచి మంచి స్పందన వస్తుందని వివరించారు. ప్రభుత్వం రైతాంగానికి అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రస్తుత వ్యవసాయ పరిస్థితుల పై రైతాంగంలో ఎటువంటి అసంతృప్తి లేదని జానయ్య స్పష్టం చేశారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాల కారణంగా రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుందని తెలిపారు. అలాగే ఇంకా కొన్ని వ్యవసాయ అంశాలకి ప్రభుత్వపరంగా ప్రోత్సాహం ఇవ్వవలసిందిగా రైతులు కోరుతున్నారని జానయ్య అన్నారు.  ముఖ్యంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురయ్యే నష్టాల్ని అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం పంటల బీమా సదుపాయం ప్రవేశపెట్టాలని రైతులు కోరుకుంటున్నారని, అలాగే చిన్న, సన్నకారు రైతులకి ఆధునిక వ్యవసాయ పనిముట్లని మరియు పచ్చి రొట్ట విత్తనాలను రాయితీపై  అందించాలని, విస్తృతంగా భూసార పరీక్షలు నిర్వహించాలని రైతాంగం కోరుకుంటున్నారని అల్దాస్ జానయ్య వివరించారు. ఇదే స్ఫూర్తితో రైతు సోదరులు, మహిళలు, అభ్యుదయ రైతులు, రైతు గ్రూపులు, సంఘాల ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని  దీన్ని ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఉపకులపతి కోరారు.
Read More