తెలంగాణలో రైతులు నూనె గింజలు, ఆయిల్‌పామ్‌ పంటలను అత్యధికంగా సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ప్రభుత్వపరంగా రైతులను అన్నివిధాలా ప్రోత్సహిస్తామని తెలిపారు. జాతీయ నూనె గింజల పథకం కింద రూ.46.14 కోట్లతో 2025-26కి గాను మేలిమిరకం వేరుసెనగ విత్తనాల ఉచిత పంపిణీని మంగళవారం సచివాలయం నుంచి ప్రారంభించారు. ‘ఇతర పంటల కంటే నూనెగింజలు, ఆయిల్‌పామ్‌కు మంచి డిమాండ్‌ ఉంది. సాగును పెంచేందుకు వీలుగా 38,434 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, నల్గొండ జిల్లాల్లో ఎంపిక చేసిన రైతులకు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ల ద్వారా పంపిణీ చేయించాం. నూనెగింజల పంటలకు యూరియా వాడకాన్ని తగ్గించి, సమతుల ఎరువుల వాడకాన్ని అలవర్చుకోవాలి’ అని తుమ్మల సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, సంచాలకుడు గోపి తదితరులు పాల్గొన్నారు.