వ్యవసాయ వ్యర్థాలకు నిప్పుతో అనేక ప్రమాదాలు

ధూమపానం చేసే వారి నిర్లక్ష్యంతో, విద్యుదాఘాతంతో ఒకప్పుడు అగ్ని ప్రమాదాలు జరిగేవి. ప్రస్తుతం పంట వ్యర్థాల దహనం పేరిట, పెట్టే మంటలకు సమీప రైతుల ఆస్తులు అగ్నికి ఆహుతవుతున్నాయి. పంటలను తగలబెట్టడం మంచిది కాదని హితబోధ చేస్తున్నా, పెడచెవిన పెడుతున్న వ్యక్తులతో నిత్యం ఎక్కడో చోట మంటలు రేగుతూనే ఉన్నాయి. పచ్చని చేలు సైతం బూడిదగా మారుతున్నాయి. ఈ ఏడాది మైలవరం, తిరువూరు నియోజకవర్గాల పరిధిలో దాదాపు 25 వేల ఎకరాల వరకు మొక్కజొన్న సాగు చేశారు. గడిచిన నెలన్నర రోజులుగా కోతలు ముమ్మరంగా సాగగా, ఇప్పటికే 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. కోతల అనంతరం ఖరీఫ్‌కు చేలను సిద్ధం చేయాలన్న ఆలోచనలో రైతులు, కంకులు విరవగా, ఉన్న పంట వ్యర్థాలను తగలబెట్టే పనులకు శ్రీకారం చుట్టారు. ఒకరిని చూసి, మరొకరు ఇదే పనికి పూనుకుంటున్నారు. ఏ చేను చూసిన మసిగా మారి కన్పిస్తోంది. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలను ఆర్పేందుకు వెళ్తున్న అగ్నిమాపక శకటాలకు సరైన దారిలేక మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుండటంతో సకాలంలో ఆర్పలేకపోతున్నారు.
20కి పైగా ప్రమాదాలు: మైలవరం ఫైర్ స్టేషన్ పరిధిలోని ఆరు మండలాల్లో గడిచిన రెండు నెలల వ్యవధిలో 20 వరకు అగ్ని ప్రమాదాలు జరిగాయి. అవన్నీ పొలాల్లో నిప్పు పెట్టినవే. విలువైన జామాయిల్ పంటలతో పాటు సాగునీటి సరఫరా సామగ్రి దగ్ధమ య్యాయి. ఎండలు మండుతున్న తరుణంలో, పూర్తిగా ఎండిన చేలల్లో అగ్గిపుల్ల గీసేసి వెళ్తుండటంతోనే పక్క చేలకు వ్యాపించి, ప్రమాద స్థాయి పెరుగుతోంది. కొన్నిసార్లు మంటలార్పేందుకు మేము దగ్గరకు వెళ్లలేని పరిస్థితి తలెత్తుతోంది అని మైలవరం అగ్నిమాపక అధికారి అన్నారు.

Read More

పురుగు మందుల నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యం

మనదేశంలో పురుగు మందులు వినియోగిస్తే కొన్నిసార్లు పురుగులు కాకుండా పంటలు నాశనమవడం, తెగుళ్లపై ఎలాంటి ప్రభావం కనిపించకపోవడం, రైతులు మరణించడం, పర్యావరణానికి తీవ్ర హాని జరగడం సర్వసాధారణంగా మారింది. మరోవైపు ఈ విపరిణామాల బాధ్యులు చట్టం నుంచి సులువుగా తప్పించుకుం టున్నారు. ఈ ధోరణిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం నాణ్యతకు, ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ… వాటిని ఉల్లంఘించిన వారికి రూ. అర కోటి జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నూతన పురుగు మందుల నిర్వహణ (పెస్టిసైడ్స్ మేనేజ్‌మెంట్) చట్టం తెస్తోంది. ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలు తెలపాలంటూ తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపింది. రైతులు, పౌరసమాజం సైతం సూచనలు చేయడానికి ఫిబ్రవరి 4వ తేదీ వరకు గడువునిచ్చింది. ముసాయిదా బిల్లును మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ agriwelfare.gov.inలోనూ ఉంచింది.
కేంద్రానికి సర్వాధికారాలు
ప్రస్తుతం అమలులో ఉన్న పురుగు మందుల చట్టం(1968), పురుగు మందుల నిబంధన(1971)ల్లో ఉన్న లోపాలను సవరించడానికే కొత్త చట్టం తెస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ‘పురుగు మందుల తయారీ, అమ్మకం నుంచి వాడకం వరకు పారదర్శకతను తీసుకురావడం, రైతులకు నాణ్యమైనవే అందేలా చూడటం, వాటి ప్రమాణాలు గుర్తింపు సామర్థ్యం పెంచడం, నకిలీలను నియంత్రించడం, కఠిన జరిమానాలు విధించడం, తయారయ్యే ప్రతి మందునూ ప్రయోగశాలల్లో పరీక్షల అనంతరమే ధ్రువీకరించడం, జీవ పురుగు మందుల వినియోగాన్ని ప్రోత్సహించడం, మానవులు, జంతువులు, పర్యావరణానికి కలిగే ముప్పును తగ్గించడం, స్వదేశీ తయారీ భారీఎత్తున పెంచడం” తమ లక్ష్యాలని వెల్లడించింది. ఈ చట్టం అమలులోకి వచ్చాక దేశవ్యాప్తంగా పురుగు మందుల నాణ్యత, పంపిణీ అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి సంక్రమిస్తాయి.
తయారీదారులు ప్రమాణాలు పాటించాలి
పురుగు మందు పేరు, బ్యాచ్ నంబరు, గడువు తేదీలను డబ్బాపై ముద్రించాలి. తయారీ సంస్థ పేరు, చిరునామా, ఉత్పత్తి స్థలం, వాడిన రసాయనాలు, ఇతర వివరాలుండాలి. ప్యాకేజింగ్ ప్రమాణాలను పాటించాలి. లైసెన్స్ ఉన్న ప్రాంగణాల్లో, భద్రత ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే ఉత్పత్తి జరగాలి. క్యూఆర్ కోడ్ ద్వారా వివరాలు వెల్లడించే సాంకేతికతను వినియోగించాలి.
ఉల్లంఘిస్తే శిక్ష
పురుగు మందుల రసాయన మిశ్రమంలో మార్పులు ఉండి, ప్రభావాన్ని చూపలేకపోయినా, రైతుల ఆరోగ్యానికి హాని కలిగించినా, నాణ్యత తగ్గించేలా ఇతర పదార్థాలు కలిపినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. చట్ట నిబంధనలను ఉల్లంఘించి పురుగుమందుల తయారీ, దిగుమతి చేసుకున్నా… వాటి విక్రయంతో ఎవరైనా మృతి చెందినా, తీవ్రంగా గాయపడినా… ఉత్పత్తిదారుడు, సంస్థను బాధ్యులుగా పరిగణిస్తారు. వారికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, లేదంటే రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. నేర తీవ్రతను బట్టి ఒకేసారి రెండూ విధించొచ్చు. రెండోసారి నేరం చేస్తే… మొదటిసారి విధించిన జరిమానా కంటే రెట్టింపు జరిమానా వేస్తారు. మూడోసారి నేరం చేస్తే… సంబంధిత సంస్థ రిజిస్ట్రేషన్, లైసెన్స్ శాశ్వత రద్దుకు పెస్టిసైడ్ ఇన్‌స్పెక్టర్ సిఫార్సు చేస్తారు. జరిమానాను చెల్లించకుంటే రిజిస్ట్రేషన్ కమిటీ ఇచ్చే రికవరీ సర్టిఫికెట్ ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆ మొత్తాన్ని భూమి శిస్తు బకాయిల్లా వసూలు చేస్తారు. అవసరమైతే ఆస్తిని జప్తు చేస్తారు.

Read More