ఆయిల్‌ పాం సాగులో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నేడు సచివాలయంలో ఆయిల్‌ పాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రిగారు.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్‌ పాం సాగు చేపట్టాలన్నారు. ఈ సంవత్సరంలో 16,729 ఎకరాలలో ఆయిల్‌ పాం సాగు చేపట్టగా, మార్చిలోగా 19,271 ఎకరాలలో ఆయిల్‌ పాం సాగయ్యేటట్టు చర్యలు తీసుకొని, లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఆయిల్‌ పాం గెలల ధర కూడా పెరిగినందున రైతులను ఆయిల్‌ పాం సాగు వైపు ప్రోత్సహించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టలన్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్‌ పాం ప్రాసెసింగ్‌ యూనిట్‌ జూన్‌ 1 కల్లా పూర్తి చేసి, ఆయిల్‌ పాం గెలల ప్రాసెసింగ్‌ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బీచ్‌పల్లి, కల్లూరు గూడెంలలో ప్రాసెసింగ్‌ ప్యాక్టరీల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ చేపట్టి, పనులు ప్రారంభించాలన్నారు. దీనివలన ఆయిల్‌ పాం సాగు చేపడుతున్న కొత్త జిల్లాలలో రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు, కొత్త రైతులు ముందకు రావడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అదేవిధంగా సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూములను సంస్థ పేరు మీదకు మార్చుకొని, చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్పోరేట్‌ సంస్థ మాదిరిగా పనిచేసేందుకు కార్పోరేట్‌ మోడల్లో వివిధ విభాగాలకు నిపుణత కలిగిన సిబ్బందిని నియమించుకునేట్టుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

*సహకార విద్యుత్‌ సరఫరా సంఘం లిమిటెడ్‌, సిరిసిల్ల (సెస్‌)*

నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరాను రైతులకు మరియు పవర్‌ లూమ్‌ పరిశ్రమకు అందించాలని సెస్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. అదనంగా ట్రాన్స్‌ ఫార్మర్లను అందుబాటులో ఉంచుకొని, సమస్య వచ్చిన వెంటనే మార్చి, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా విద్యుత్‌ రెగ్యులేటరి కమిషన్‌ నియమాల ప్రకారం సంస్థను నడిపించాలన్నారు. సంస్థ సిబ్బంది ప్రజాప్రతినిధులను కలుపుకొని వారి సూచనల మేరకు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.

*చేనేత జౌళి శాఖ*

చేనేత అభయ హస్తము పథకంను ప్రణాళికబద్దంగా అమలు చేయాలన్నారు. ఈ పథకమును త్వరితగతిన అమలు చేయుటకు నేత కార్మికులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని మరమగ్గాల యూనిట్లకు 25 హెచ్‌పి వరకు 50% విద్యుత్‌ సబ్సిడీ అమలు చేయాలని, యారన్‌ డిపో ద్వారా ఆసాములకు మాత్రమే నూలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆసాములకు నూలుకు అవసరమగు పెట్టుబడిని బ్యాంకుల ద్వారా అందజేయుటకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. తద్వారా ఆసాములు ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా నూలు కొనుగోలు చేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. యారన్‌ డిపో లో నూలు స్టాకులను పెంచి నూలు కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. జీ.వో.ఎంఎస్‌.నం. 1, తేదీ: 18.03.2024 ప్రకారము ఏ ఏ శాఖలు ఇప్పటిదాకా తమకు కావాల్సిన వస్త్ర ఇండెట్లు టెస్కో కు సమర్పించడం లేదో ఆయా శాఖల మీద చర్యలు తీసుకొనుటకు, చేనేత సహకార సంఘాలకు మరియు పవర్‌ లూమ్‌ సంఘాలకు టెస్కో ద్వారా చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశాలలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్‌, వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్‌ రావు, సహకారశాఖ డైరెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌, హార్టికల్చర్‌ డైరెక్టర్‌ శ్రీమతి యాస్మిన్‌ బాషా ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.