సరిపడా యూరియా నిల్వలు
యాసంగి సీజన్కు రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలున్నందున యూరియా సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్లతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ”ప్రస్తుతం రాష్ట్రంలో 2.15 లక్షల టన్నుల యూరియా నిల్వలున్నాయి. ఇంటి నుంచి బుకింగ్ కోసం ఏర్పాటుచేసిన యాప్ ద్వారా 82,059 మంది 2,01,789 బస్తాలు కొనుగోలు చేశారు. జిల్లాల వారీగా యూరియా నిల్వలు, డిమాండ్, పంపిణీపై కలెక్టర్లు పరిశీలిస్తూ అవసరమైతే అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి” అని మంత్రి సూచించారు.
సహకార సంఘాలను బలోపేతం కోసం పటిష్ఠ చర్యలు
తెలంగాణలో సహకార సంఘాల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని హైదరాబాద్లో నాబార్డు ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ సహకార వారోత్స వాల సదస్సులో మంత్రి తుమ్మల తెలిపారు. ”సహకార సంఘాలను కంప్యూటరీకరించి డిజిటల్ సేవలు అందించాం. ఆధార్ ఆధారిత చెల్లింపులు, బీమా సాయం అందిస్తున్నాం. 2024- 25లో పీఏసీఎస్ ద్వారా రైతులకు రూ.7,500 కోట్ల రుణాలు ఇచ్చాం. 311 సంఘాలను రైతు ఉత్పత్తి సంఘాలుగా మారుస్తున్నాం” అని తుమ్మల తెలిపారు. వంథాతం రుణాల రికవరీ, వ్యాపార నిర్వహణలో పురోగతి సాధించిన 11 ప్రాథమిక వ్యవసాయ సంఘాలకు ఈ సందర్భంగా మంత్రి పురస్కారాలు అందించారు. సమావేశంలో నాబార్డు తెలంగాణ, మహారాష్ట్రల సీజీఎంలు ఉదయభాస్కర్, మణికుమార్, ఆర్బీఐ ప్రాంతీయ సంచాలకుడు చిన్మయ్కుమార్, ఎన్సీడీసీ రీజనల్ డైరెక్టర్ శార్దూల్ జాదవ్, రాష్ట్ర సహకార బ్యాంకుల సంఘం జాతీయ చైర్మన్ కొండూరి రవీందర్రావు, తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.



