ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం
కొబ్బరి ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 3 ఎకరాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ), ఐదు ఎకరాల్లో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు రైతు ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. కొబ్బరి పరిశ్రమ అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల కోసం రాజోలు నియోజకవర్గంలోని తూర్పుపాలెం, అమలాపురం నియోజక వర్గంలోని మామిడికుదురు మండలంలో పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం కొబ్బరికాయల తొక్క వొలిచి, ఎండు కొబ్బరికాయలను తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు పంపుతున్నారు. కోనసీమలో కొబ్బరి ప్రాసెసింగ్ పరిశ్రమలు లేకపోవడమే కారణం. దీనిపై అధ్యయనం చేసి జిల్లా స్థాయిలో చర్యలు చేపట్టాలి. నిల్వ సౌకర్యాలు, పరీక్షా కేంద్రానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి. కొబ్బరి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు 10 ఎకరాలు కేటాయించే అవకాశముంది. ఉభయ గోదావరి జిల్లాలకు ఇది ఎంతో ఉపయోగం’ అని మంత్రి పేర్కొన్నారు.


