ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగ పనితీరులో పశ్చిమగోదావరి జిల్లా అగ్రస్థానం

పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ రంగ పని తీరు సూచికల్లో 89 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఎన్టీఆర్‌ 82, కృష్ణా 80, శ్రీసత్యసాయి 80, నంద్యాల 78 స్కోర్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ‘ఏ’ గ్రేడ్‌లో 7 జిల్లాలు, ‘బి’ గ్రేడ్‌ 19 జిల్లాలు ఉన్నాయి. అన్నమయ్య 53, చిత్తూరు 59, శ్రీకాకుళం 61 స్కోర్లకు పరిమితమై అట్టడుగున నిలిచాయి.

ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తి పెరిగింది. గతేడాదితో పోలిస్తే సగటున 23.59% అధిక ఉత్పత్తి లభిస్తుందని అంచనా. దూది (పత్తి) ఉత్పత్తి కూడా గతేడాది కంటే 30.97% పెరుగుతుందని పేర్కొ న్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో అధిక ఉత్పత్తి లభించనుంది. మొక్కజొన్న ఉత్పత్తిలో ప్రకాశం, పల్నాడు జిల్లాలు తొలి స్థానాల్లో నిలిచాయి.

Read More

నిరుద్యోగులకు వ్యవసాయ, అనుబంధ రకాలు దన్నుగా నిలిచాయి

తెలంగాణా రాష్ట్రంలో గత మూడు నెలల్లో నిరుద్యోగ రేటు 6.9 నుంచి 5.7 శాతానికి తగ్గింది.. తయారీ, సేవారంగాల్లో ఉపాధి స్వల్పంగా నెమ్మదించినప్పటికీ వ్యవసాయ, అనుబంధ రంగాలు దన్నుగా నిలిచినట్లు కార్మిక బలగం సర్వే (జులై-సెప్టెంబరు, 2025) నివేదిక వెల్లడించింది. గత మూడు నెలల్లోనే ఈ రంగంలో ఉపాధి పొందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. ఇదే సమయంలో 15-29 ఏళ్ల యువతలో నిరుద్యోగం స్థిరంగా 20.2 శాతంగా (యువతుల్లో 21.7%, యువకుల్లో 19.5%) నమోదైనట్లు వెల్లడించింది. గ్రామీణ యువతలో నిరుద్యోగం 18.0 శాతం ఉంటే.. పట్టణాల్లో 22.7 శాతంగా ఉన్నట్లు తెలిపింది. గ్రామీణ మహిళల్లో నిరుద్యోగ రేటు తక్కువ ఉంటే.. పట్టణ మహిళల్లో ఎక్కువగా ఉంది. నివేదికలోని ముఖ్యాంశాలివి..
రాష్ట్రంలో వ్యవసాయరంగంలో ఉపాధి పొందుతున్నవారు జూన్‌ నాటికి 32.9% మంది ఉంటే.. ప్రస్తుతం 40.5% ఉన్నారు. వర్షాలు పడటం, సాగు విస్తీర్ణం పెరగడంతో మూడు నెలల్లో ఈ రంగంపై ఆధారపడిన గ్రామీణుల శాతం 50.1 (ఏప్రిల్లో) నుంచి 60.1కి (సెప్టెంబరు నాటికి) చేరింది.
పట్టణాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడిన కార్మికుల వాటా మూడు నెలల క్రితం 4.1% ఉంటే.. ఇటీవల 6.2 శాతానికి చేరింది.
రాష్ట్రంలో తయారీ, క్వారీ, మైనింగ్‌ రంగాల్లో ఉపాధి తగ్గింది. జూన్‌ నాటికి ఈ రంగాల్లో 29.1% ఉంటే.. సెప్టెంబరు నాటికి 22.2 శాతానికి పడిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా సేవారంగంలోనూ స్వల్పంగా 38 నుంచి 37.3 శాతానికి తగ్గింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని సేవా రంగాల్లో ఉపాధి రేటు 20.8 నుంచి 21.3 శాతానికి పెరిగింది.
జాతీయ స్థాయిలో పరిశీలిస్తే స్వయంఉపాధి పొందుతున్నవారి సంఖ్య పెరిగింది. జూన్‌ నాటికి 39% మంది స్వయంఉపాధి పొందుతుండగా.. సెప్టెంబరు నాటికి అది 40.6 శాతానికి చేరింది. పురుషుల్లో 41.3 నుంచి 43.2 శాతానికి పెరిగింది.

Read More

మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా రైతులు సాగులో మార్పులు చేసుకోవాలి

ప్రపంచమంతా ఆహారపు అలవాట్లు మారి అన్నం తినేవారు తగ్గిపోతున్నారు. ఇందుకు అనుగుణంగా సాగులో మార్పులకు సిద్ధమవ్వాలి. ‘రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఖర్చులు తగ్గించుకుని, దిగుబడి పెంచుకోవాలి. తద్వారా ఆదాయం పెరగాలి. ఈ మేరకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌ దేశానికి అన్నపూర్ణగా ఉన్నాయి. పంజాబ్‌లో పురుగుమందుల వాడకం పెరగడంతో క్యాన్సర్‌ బాధితులు చికిత్స కోసం పంజాబ్‌ నుంచి దిల్లీకి రోజూ రెండు రైళ్లలో వెళుతున్నారు. ఇలాంటివి నివారించాలంటే ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించాలి. ప్రత్యామ్నాయంగా పదేళ్ల కిందటే ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాను. ఇప్పుడు దానికి సాంకేతికతను జోడించి, అభివృద్ధి చేస్తాం’ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అని చెప్పారు. ‘ఆధునిక రాజ్యాంగ సంస్థలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో చంద్రబాబు వ్యవసాయ రంగంలో కృషి చేసిన రైతు కుంచాల రామకృష్ణ, శాస్త్రవేత్త కుర్రా శ్రీనివాసబాబులను సన్మానించారు. ఎన్జీ రంగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు శ్రావణ్‌ కుమార్‌, నసీర్‌ అహ్మద్‌, మాధవి, రామాంజనేయులు, ఎన్జీరంగా కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Read More

రైతుల సంక్షేమం కోసం నాబార్డు భాగస్వామ్యం అవసరం – మంత్రి తుమ్మల

రాష్ట్ర రైతుల ప్రయోజనాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నాబార్డు అధికారులను మంత్రి కోరారు. శుక్రవారం మంత్రి కార్యాలయంలో నాబార్డు సీజిఎం ఉదయ్‌ భాస్కర్‌తో కలిసి నాబార్డు ద్వారా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాబార్డు అధికారులు గ్రామీణాభివృద్ధి కోసం ప్రభుత్వంతో భాగస్వామ్యం, మైక్రో ఇరిగేషన్‌ పథకం కోసం నిధుల విడుదల, బహుళోపయోగ ప్రాథమిక సహకార సంఘాల (M-PACS) ఏర్పాటు వంటి అంశాలపై మంత్రితో చర్చించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సూక్ష్మ సాగు, సహకార రంగ బలోపేతం వంటి అంశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డ్‌ మద్దతు అందిస్తోందని ఇదేంతో ప్రశంసనీయమని మంత్రి అన్నారు. ఇందుకోసం గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఆర్‌ఐడిఎఫ్‌) కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి నాబార్డ్‌ రూ. 300 కోట్లు రాష్ట్రానికి కేటాయించినట్లు నాబార్డు అధికారులు తెలిపారు. ఈ నిధులు తక్కువ వడ్డీ రేటుతో (ప్రస్తుతం 4.25%) అందిస్తున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 2025 ముగిసేలోపు కొత్త ఆర్‌ఐడిఎఫ్‌ ప్రాజెక్టు ప్రతిపాదనలు సమర్పించినట్లయితే ఈ నిధులను వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుందని మంత్రికి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్‌ఐడిఎఫ్‌ కింద రూ. 41.37 కోట్లు మాత్రమే డ్రా చేసుకుందని, కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం రూ. 1811 కోట్ల డ్రాయబుల్‌ గ్యాప్‌ ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన ఈ ఆర్‌ఐడిఎఫ్‌ రుణాలను వినియోగించుకోవాలని అధికారులు మంత్రికి సూచించారు. ఈ విషయమై త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడుతానని మంత్రి అధికారులకు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 32 జిల్లాలలో మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో నాబార్డు తెలంగాణ రాష్ట్రానికి మైక్రో ఇరిగేషన్‌ ఫండ్‌ (ఎంఐఎఫ్‌) కింద రూ. 144 కోట్ల నిధులను ఆమోదించినట్టు, ఈ నిధుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బిఐతో ఒప్పంద ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉందని అధికారులు తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో 197 కొత్త ఖ-ఆజ్పుఐల ఏర్పాటుకు నాబార్డ్‌ అనుమతి ఇచ్చింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర సహకార అభివృద్ధి కమిటీ (ఐ్పుఈ్పు) ద్వారా త్వరితగతిన ఆమోదించాల్సి ఉందని మంత్రి దృష్టికి తీసుకురాగా మంత్రిగారు వీటన్నిటిపై త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన రైతుల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. పెరిగిన ఉత్పత్తులను అనుగుణంగా నిల్వ సామార్థ్యాలతో గోదాములు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గోదాముల నిల్వ సామార్థ్యం, రైతుల ఉత్పత్తి సామార్థ్యానికి అనుగుణంగా లేదని అన్నారు. గతంలో నాబార్డు వారు తక్కవ వడ్డీతో ఇచ్చిన రుణాలతో ప్రభుత్వం గోదాముల నిర్మాణం చేపట్టేదని గుర్తుచేశారు. అదే ప్రక్రియను తిరిగి కొనసాగించి గోదాములు నిర్మించేందుకు తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని కోరారు. రైతుల ప్రయోజనాల కోసం, వారి అర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అందుకు అనుగుణంగా అనేక పథకాలు పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో నాబార్డు భాగస్వామం కొనసాగించాలని ఈ సందర్భంగా నాబార్డు అధికారులను కోరారు.

Read More