ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరదలు వచ్చే అవకాశం ఉన్నందున పశుపోషకులంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ పశు సంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్‌ టి. దామోదర్‌ నాయుడు తెలిపారు. ఈ మేరకు కొన్ని సూచనలు చేశారు. ‘పశువులు సహా ఇతర జీవాల షెడ్లను పొడిగా ఉంచి వాటి చుట్టూ బ్లీచింగ్‌ పౌడర్‌ వంటివి చల్లాలి. ఈ కాలంలో సంభవించే వ్యాధుల నుంచి వాటిని రక్షించుకుంటూ ప్రభుత్వం ఉచితంగా అందించే నట్టల నివారణ మందులు, వ్యాధి నిరోధక టీకాలను వేయించాలి. లేగదూడలకు వెచ్చని వాతావరణం కల్పించాలి. పశువులకు సురక్షిత నీటిని అందించాలి. తడిసిన దాణా పెట్టకూడదు. పశువులకు అనారోగ్య లక్షణాలు కనిపించినా లేదా చనిపోయినా సమీప పశువైద్యశాలలో తప్పకుండా తెలియజేయాలి’ అని దామోదర్‌ వివరించారు.