వాతావరణ మార్పులు, చీడ పీడలు, నీటి కొరత దృష్ట్యా రైతులు వరి సాగు విధానాలను మార్చాలని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ ఇరి) శాస్త్రవేత్తలు సూచించారు. గురువారం ఇరి ఆధ్వర్యంలో ఇక్రిశాట్‌ కార్యాలయంలో ‘వరి విత్తన విస్తరణ’పై సమావేశం నిర్వహించారు. ఇరి దక్షిణాసియా విభాగాధిపతి స్వాతినాయక్‌, ప్రాంతీయ విత్తన విభాగాధిపతి వికాస్‌ కుమార్‌ సింగ్‌, శాస్త్రవేత్తలు మొషారఫ్‌ హొసేన్‌, గుత్తా లింగారెడ్డి, సంకల్ప్‌ భోస్లేలతోపాటు రాష్ట్ర విత్తన సంస్థలు, ప్రైవేట్‌ విత్తన సంస్థలు, చిన్న, మధ్య తరహా విత్తన వ్యాపారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వాతినాయక్‌, వికాస్‌ కుమార్‌లు మాట్లాడుతూ… ”భారత్‌ ప్రపంచంలోనే అత్యధికంగా వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, పాత రకాలను ఎక్కువ కాలం సాగు చేయడంతో హెక్టారుకు ఉత్పాదకత తక్కువగా ఉంది” అని పేర్కొన్నారు. ప్రతి కూలతలను తట్టుకొని రైతులకు లాభాలను అందించే కొత్త వరి రకాలను దేశంలో భారీగా విస్తరించేందుకు కార్యాచరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.