అనేక ఆటుపోట్లను తట్టుకొని సాగు చేస్తున్న రైతులకు రూపాయిలో మూడోవంతు కూడా దక్కడం లేదని ఆర్‌బిఐకి నిపుణుల బృందం నివేదిక అందించింది. కూరగాయల ద్రవ్యోల్బణంపై.. రైతు నుంచి రిటైలర్‌ వరకు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నిపుణుల బృందం రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) కోసం అధ్యయనం చేసింది. రైతు నుంచి వ్యవసాయ మార్కెట్‌లో దిగుబడులు కొనుగోలు చేసే ట్రేడర్లు, హోల్‌సేల్‌ వ్యాపారులు, రిటెయిలర్ల కమీషన్లు, రవాణా, లోడింగ్‌, అన్‌లోడింగ్‌, నిల్వ ఛార్జీల రూపంలో ఖర్చులు ఎక్కువ అయ్యి ధరలు పెరిగి.. వినియోగదారునిపై భారం పడుతుంది. రైతు చేతికి దిగుబడి వచ్చినప్పటి నుంచి వినియోగదారుడిని చేరే వరకు అవసరమైన వాల్యూ చెయిన్‌ సరిగా లేకపోవడంతో దళారులు దోచుకోవడానికి అవకాశం ఏర్పడిందని నివేదిక వెల్లడించింది. ఇలాంటి పరిణామాల వలన అటు రైతూ, ఇటు వినియోగదారూ ఇద్దరూ నష్టాలే ఎదుర్కొంటున్నారు. కాబట్టి సరఫరా వ్యవస్థలోపాలను సరిచేయాలని సూచించారు.