యాసంగిలోనూ సన్నధాన్యానికి బోనస్
- ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుంది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
యాసంగి సన్న ధాన్యానికీ కనీస మద్దతు ధరతోపాటు బోనస్ ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. దేశంలో క్వింటాకు రూ. 500 బోనస్ అందజేస్తున్న తొలి ప్రభుత్వం తమదేనన్నారు. ఇప్పటి వరకు బోనస్ రూపేణా రైతులకు రూ.1700 కోట్లు అందజేసినట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెంలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ”రూ.20,687 కోట్ల రైతు రుణమాఫీ వలన సుమారు 25.65 లక్షల మంది రైతులు లబ్ధిపొందారు. ‘రైతు భరోసా’ కింద పెట్టుబడి సాయంగా రూ.5,400 కోట్లు అందజేశాం. గత వానాకాలంలో రికార్డు స్థాయిలో 1.53 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగింది. వరి దిగుబడిలో తెలంగాణ ఏపీని అధిగమించింది. వరి వేస్తే ఉరే అనే పరిస్థితిని దాటి విదేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేసే స్థాయికి వచ్చాం. యాసంగి పంటలకు ఏ సమస్య లేకుండా సాగునీరు అందించడంతో ఈ సీజన్ లోనూ రికార్డుస్థాయిలో దిగుబడులు వస్తున్నాయి. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులు తొందరపడి సన్నాలను దళారులకు విక్రయించొద్దు” అని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.






