ANGRAU – DAATTC MOBILEAPP

ANGRAU – DAATTC MOBILE APP – రైతులు, వ్యవసాయ అధికారులు, విద్యార్థులు మరియు శాస్త్రవేత్తలు పంటల సాగు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, తెగుళ్లు – పురుగుల నివారణ, పోషక యాజమాన్యం, వాతావరణ ఆధారిత సూచనలు మరియు విశ్వవిద్యాలయం అందించే తాజా సాంకేతిక వేదిక.

పరిచయం:
వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సమాచారాన్ని సకాలంలో అందించడం అత్యంత అవసరం. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొనిఆచార్య ఎన్.జి. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం (Acharya N.G. Ranga Agricultural University – ANGRAU) పరిధిలోని District Agricultural Advisory and Transfer of Technology Centre (DAATTC) ఆధ్వర్యంలో ANGRAU DAATTC App అభివృద్ధి చేయబడింది. ఈ యాప్ ను డా.పి.బి. ప్రదీప్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త (Transfer of Technology) & కోఆర్డినేటర్, DAATTC, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా రూపొందించారు.
ఈ మొబైల్ యాప్ రైతులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్థులు, విస్తరణ సిబ్బంది మరియు వ్యవసాయంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక సమగ్ర డిజిటల్ సమాచార వేదికగా పనిచేస్తుంది. వ్యవసాయానికి సంబంధించిన తాజా సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ సిఫార్సులు మరియు విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వ్యవసాయ సాంకేతికతలను రైతులకు సులభంగా చేరవేయడం ఈ యాప్ యొక్క ప్రధాన లక్ష్యం.

ఈ యాప్ లో పంటల వారీగా శాస్త్రీయ సాగు విధానాలు, అధిక దిగుబడి ఇచ్చే రకాలు, విత్తనాల ఎంపిక, భూమి తయారీ, విత్తే సమయం, విత్తన మోతాదు, నాటే దూరం, ఎరువుల యాజమాన్యం, సూక్ష్మ పోషకాల వినియోగం, నీటి యాజమాన్యం, కలుపు నియంత్రణ, సమగ్ర పురుగుల మరియు తెగుళ్ల నివారణ పద్ధతులు వంటి అనేక అంశాలపై సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. రైతులు తమ పంటలకు సంబంధించిన సమస్యలకు తక్షణమే శాస్త్రీయ పరిష్కారాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

వ్యవసాయంలో వాతావరణ మార్పులు ప్రధాన ప్రభావం చూపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ఎంతో అవసరం. ఈ యాప్ ద్వారా పంటల వివిధ దశల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వర్షాభావం లేదా అధిక వర్షాల సమయంలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంటలను రక్షించుకునే మార్గాలు వంటి విలువైన సూచనలు అందించబడతాయి. దీని ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించే అవకాశం
ఉంటుంది.

ANGRAU DAATTC_App ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో పూర్తిగా ANGRAU శాస్త్రవేత్తల పరిశోధనలు మరియు అధికారిక సమాచారం సిఫార్సుల ఆధారంగా రూపొందించబడింది. అందువల్ల రైతులకు విశ్వసనీయమైన, శాస్త్రీయమైన మరియు ప్రామాణికమైన సమాచారం అందుతుంది. అదనంగా రైతుల శిక్షణ కార్యక్రమాలు, వ్యవసాయ ప్రదర్శనలు, సాంకేతిక వీడియోలు, ప్రచురణలు మరియు ఇతర అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చు.

ఈ యాప్ కేవలం రైతులకు మాత్రమే కాకుండా వ్యవసాయ విస్తరణ అధికారులకు, రైతు సేవా కేంద్రాల (RSKs)సిబ్బందికి, కృషి విజ్ఞాన కేంద్రాల (KVKs)శాస్త్రవేత్తలకు, వ్యవసాయ పాలిటెక్నిక్ మరియు వ్యవసాయ కళాశాల విద్యార్థులకు కూడా ఒక ఉపయోగకరమైన డిజిటల్ రిఫరెన్స్ వేదికగా ఉపయోగపడుతుంది. శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో, రైతు సమావేశాలు, క్షేత్ర ప్రదర్శనలు మరియు సాంకేతిక సలహాలు అందించే సందర్భాల్లో ఈ యాప్ సమర్ధవంతంగా ఉపయోగపడుతుంది.

ఈ యాప్ యొక్క మరో ముఖ్యమైన విశేషం తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో సులభమైన వినియోగాన్ని అందించడం. గ్రామీణ ప్రాంత రైతులు కూడా సులభంగా ఉపయోగించుకునే విధంగా సరళమైన రూపకల్పన (User-Friendly Interface) కలిగి ఉండటం వల్ల ప్రతి రైతు తన మొబైల్లోనే వ్యవసాయ సమాచారాన్ని పొందగలుగుతున్నాడు. దీంతో వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానం నేరుగా రైతుల చేతికి చేరుతుంది.

డిజిటల్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు శాస్త్రీయ సమాచారం, సకాలంలో వ్యవసాయ సూచనలు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒకే వేదికలో అందించే ANGRAU DAATTC Appనేటి వ్యవసాయ రంగానికి ఎంతో ఉపయోగకరమైన మొబైల్ అప్లికేషన్ గా నిలుస్తుంది. రైతుల ఆదాయం పెంపు, ఉత్పాదకత వృద్ధి, సుస్థిర వ్యవసాయ అభివృద్ధి మరియు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల విస్తరణలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తోంది.

ప్రధాన ప్రయోజనాలు:
• రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సమాచారాన్ని వేగంగా అందిస్తుంది.
పంటల వారీగా సమగ్ర సాగు యాజమాన్య సమాచారాన్ని అందిస్తుంది.
• పురుగులు, తెగుళ్లు మరియు పోషక లోపాల నివారణకు నిపుణుల సూచనలు అందిస్తుంది.
• వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు మరియు విద్యార్థులకు ఉపయోగకరమైన డిజిటల్ రిఫరెన్ గా పనిచేస్తుంది.
• శిక్షణ కార్యక్రమాలు మరియు వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలకు తోడ్పడుతుంది.
డిజిటల్ వ్యవసాయాన్ని ప్రోత్సహించి రైతులను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానిస్తుంది.

ముగింపు:
ANGRAU DAATTC App అనేది కేవలం ఒక మొబైల్ యాప్ మాత్రమే కాదు, రైతులకు శాస్త్రీయ వ్యవసాయ జ్ఞానాన్ని అందించే డిజిటల్ విజ్ఞాన వేదిక. ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను రైతులకు చేరవేసి, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, లాభదాయకత మరియు సుస్థిర అభివృద్ధికి తోడ్పడే ఒక వినూత్న ప్రయత్నంగా ఈ యాప్ నిలుస్తోంది. ప్రతి రైతు, వ్యవసాయ అధికారి, శాస్త్రవేత్త మరియు వ్యవసాయ విద్యార్థి తమ మొబైల్లో ఈ యాప్ ను ఉపయోగించడం ద్వారా నాణ్యమైన వ్యవసాయ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చును.

డా. పి. బి. ప్రదీప్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త &కోఆర్డినేటర్ ఏరువాక కేంద్రం, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా – 531024
డా.డి.ఆదిలక్ష్మీ, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ph: 9550506498
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, చింతపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా– 531111

Read More

ఔషధ మొక్క… పునర్నవ

సాధారణ నామం : ఎర్రగలిజేరు శాస్త్రీయ నామం : బోయెర్‌హేలియా డిఫ్యూసా కుటుంబం: నిక్టాజినేసి

ప్రాకే కొమ్మలు ఎరుపు రంగులో ఉంటాయి. ఆకులు అసమానంగా ఉంటాయి. అండాకారంలో ఉండి అంచులు ఎగుడుదిగుడుగా ఉంటాయి. ఆకుకాడ 1 సెం.మీ. పొడవుంటుంది. పూలు 4 సెం.మీ. పొడవుండి, 4-10 పూవులు కలసి ఉంటాయి. కాప్సూల్ 3þ1 మి.మీ. పరిమాణంలో గద ఆకారంలో ఉంటుంది.

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • పురాతన కాలం నుండి పునర్నవను ఎపిలెప్పి, హిస్టీరియా, గాస్ట్రెåటిస్, జాండిస్, జ్వరం, ఆస్త్మా, డిసెంట్రి, డయేరియా వంటి సమస్యలను నివారించడానికి ఉపయోగిస్తున్నారు. మూత్రనాళం ఆరోగ్యాన్ని నిర్వహిస్తుంది. కాలేయం బాగా పనిచేయడానికి సహాయపడుతుంది.
  • శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరం నుండి ద్రవాలను బయటకు పంపడానికి, శరీర సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. శరీర బరువు తగ్గించడానికి, సహజ యాజమాన్య పద్ధతిలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మూత్రవర్ధకం. జీర్ణకోశ సమస్యలను నివారిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం, ఆకుకూరగా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • అనేక అతిధి మొక్కలలో పునర్నవ ద్రావణం గ్లెåకోప్రోటీన్‌ని పిచికారి చేసినపుడు యాంటివైరల్ కారకాలు ఉత్పత్తి అయ్యాయి (అవస్థి, అతని అనుచరులు, 2013).
  • పరిపక్వత చెందిన మొక్కల ఎండబెట్టిన వేర్ల ద్రావణం లేదా దాని నుండి వేరు చేసిన గ్లెåకోప్రోటీన్‌ని పిచికారి చేసినపుడు పొగాకులో టొబాకో మొజాయిక్ వైరస్, టమాటలో కుకుంబర్ మొజాయిక్ వైరస్, టాబాకోమొజాయిక్ వైరస్‌లు, మెలన్‌లో కుకుంబర్ గ్రీన్‌మాటిల్ వైరస్, జనుములో సన్‌హెంప్ రొసెట్టెవైరస్, గాంఫ్రెనాగాబోసాలో గ్రాంఫెనా మొజాయిక్ వైరస్ ఆశించడాన్ని నివారించింది (అవస్థి, అతని అనుచరులు, 1984).
  • రెండు ఔషధ మొక్కలు పునర్నవ, సెంటెల్లా ఏసియాటిక కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ లార్వా దశలను, పెద్ద పురుగులను సమర్ధవంతంగా నివారించాయి. ఈ రెండు మొక్కల గ్రాన్యూల్ పార్ములేషన్లు తయారు చేసి పరీక్షించినపుడు పురుగు లార్వాలను, పెద్ద పురుగులను గణనీయంగా చంపాయి. ఈ పురుగులని ఈ రెండు మొక్కలు సమర్ధవంతంగా నివారించగలవని రుజువైంది (బిందు, ఆమె అనుచరులు, 2016).
  • మొక్కల ఆకు పొడిని తయారు చేసే విధానం : పునర్నవ, సెంటెల్లా ఏసియాటిక ఆకులను డిస్టిల్డ్ వాటర్‌లో బాగా కడిగి ఆకులను నీడలో ఆరబెట్టి గ్రైండర్‌లో వేసి విడివిడిగా పొడిచేయాలి. దీనిని జల్లించి మెత్తని పొడిని గాజు పాత్రలలో నిల్వ చేయాలి.
  • గ్రాన్యులార్ ఫార్ములేషన్ తయారీ : మొక్కల ఆకుల పొడి, నూనె చెక్క, పొడి బరువు తూయాలి. డిస్టిల్డ్ వాటర్ కలిపి నూనె చెక్కపొడిని రెండు మొక్కల ఆకుల పొడులతో విడివిడిగా కలిపి గ్యాన్యూల్స్ రూపంలో ఫార్ములేషన్ తయారు చేయాలి. 15%, 20%, 25%, 30%, 35%, గ్రాన్యూల్ ఫార్ములేషన్లను (1.5 గ్రా, 2.0 గ్రా., 2.5 గ్రా., 3.0 గ్రా., 3.5 గ్రా. ఆకు పొడిని 8.5 గ్రా., 8.0 గ్రా., 7.5 గ్రా., 7.0. గ్రా., 6.5 గ్రా., నూనె చెక్కపొడితో కలిపి రెండు మొక్కల ఫార్ములేషన్లు) తయారు చేయాలి.
  • పునర్నవ మొక్కను ఇంటిలో వ్రేలాడదీస్తే పేలు వికర్షించపబడతాయి (డెల్ౙీల్, 1861).
  • పునర్నవ మొత్తం మొక్క ద్రావణం టమాట బాక్టీరియల్‌విల్ట్ కారకం రాల్‌స్టోనియా సొలనేసియారంపై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (తువు, అతని అనుచరులు, 2017).
  • పునర్నవ కషాయం వైరస్ నివారిణిగా టమాట ఆకు ముడత వైరస్, టమాట మొజాయిక్ వైరస్, పొటాటో వైరస్, వంగ మొజాయిక్, టమాట యెల్లో మొజాయిక్ వైరస్, పెసర యెల్లో మొజాయిక్ వైరస్, బీన్ కామన్ మొజాయిక్ వైరస్‌లను నివారిస్తుంది.
  • 5 శాతం పునర్నవ వేరు కషాయం క్షేత్రస్థాయిలో బెండ ఎల్లోవీన్ మొజాయిక్ వైరస్‌ని మొక్క దశ నుండి వారం రోజుల వ్యవధిలో పిచికారి చేయడం ద్వారా నివారించింది.
  • పంటలను అన్ని రకాల వైరస్, బాక్టీరియా తెగుళ్ళ నుండి పునర్నవ కషాయం కాపాడుతుంది.

5% పునర్నవ కషాయం తయారు చేసే పద్ధతి :

  • 5 కి. పునర్నవ వేర్లు, కాడలు, ఆకులను 10 లీ. నీటిలో వేసి అరగంట నుండి గంటసేపు బాగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన కషాయం 5 లీ. వరకు ఉంటుంది. దీనిని బాగా చల్లార్చి, వడపోసి 100 గ్రా. సబ్బు పొడి లేదా కుంకుడు కాయల రసం కలిపి తర్వాత 100 లీ. నీటిలో కలిపి ఎకరా పొలంలోని పంటపై పిచికారి చేయాలి.
  • ఎర్రగలిజేరు వేరు నీటి ద్రావణం పిచికారి పెసర, మినుము పంటలనాశించే మూంగ్‌బీన్ ఎల్లోమొజాయిక్ వైరస్, బీన్‌కామన్ మొజాయిక్ వైరస్ ఆశించచడాన్ని క్షేత్ర పరిస్థితులలో తగ్గించి గింజ దిగుబడులను పెంచింది (సింగ్, 2002, సింగ్ అండ్ అవస్థి, 2002).
  • దోస జాతి పంటలలో వారానికొకసారి ఎర్రగలిజేరు వేరు ద్రావణం పిచికారి చేసి, కుకుంబర్ మొజాయిక్ వైరస్, బాటిల్‌గార్డ్ మొజాయిక్ వైరస్, కుకుంబర్ గ్రీన్ మాటిల్‌మొజాయిక్ వైరస్, పంప్‌కిన్ మొజాయిక్ వైరస్‌లు ఆశించడం, వృద్ధి చెందడం, వ్యాప్తి చెందడాన్ని గణనీయంగా అరికట్టారు (అవస్థి అండ్ కుమార్ 2003 ఎ, 2003 బి, కుమార్ అండ్ అవస్థి, 2003ఎ, 2003బి).
  • కుకుంబర్ మొజాయిక్ తెగులు ఆశించడం, వ్యాపించడం ఎర్రగలిజేరు వేరు ద్రావణం పిచికారి ద్వారా అరికట్టబడింది (కుమార్ అండ్ అవస్థి, 2008).
  • టమాట పంటలో ఎర్రగలిజేరు వేరు ద్రావణంతో విత్తనశుద్ధి, పంటపై పిచికారి చేయడం ద్వారా వైరస్ తెగుళ్ళను నివారించారు (అవస్థి అండ్ యాదవ్, యాదవ్, అతని అనుచరులు)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పంట ఉత్పత్తుల నాణ్యతను పెంచే కొమ్ము సిలికా (501)

దీనిని భూమిలో నుండి తీసిన స్వచ్ఛమైన ఒక దినుసు శిల పటకాన్ని ఆవు కొమ్ములో నింపి సారవంతమైన నేలలో ఆకులు రాలు కాలం లేదా వసంత ఋతువులో పాతి పెట్టి తయారు చేస్తారు. ఒక గ్రాము కొమ్ము సిలికాను సరిపడా నీటిలో కలిపి ఒక గంట సేపు సవ్యదిశలో కలియత్రిప్పి పొలంలోని అన్నిపంటలు, పశుగ్రాసాలపై ఉదయం వేళ పిచికారి చేయాలి. కొమ్ము సిలికా భూమిలో సిలికాతో కలిపి పనిచేసి సూర్యకాంతి శక్తిని నేలకందిస్తుంది. ఇది కిరణజన్య సంయోగక్రియకు, భూమిలోనుండి ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు మొక్కల కందడానికి కూడా సహాయపడుతుంది. ఇది పంట ఉత్పత్తుల నాణ్యతను (పక్వదశ, తీపిదనం, రుచి, వాసన, నిల్వశక్తి, పీచు పరిమాణం) పెంచుతుంది. పశుగ్రాసాల రుచిని, హెర్బల్ మొక్కలలో నూనెలను, గింజలలో ప్రొటీన్ పరిమాణాన్ని పెంచుతుంది. కొమ్ము ఎరువు భూమిపై పిచికారి చేసిన తర్వాత కొమ్ము సిలికాని సంవత్సరానికి కనీసం రెండు సార్లు, వసంత ఋతువులో ఒకసారి, ఆకులు రాల్చే కాలంలో ఒకసారి పంటలపై పిచికారి చేయాలి. ఇది అసలైన బయోడైనమిక్ పంటపై చల్లే పిచికారి ద్రావణం.

Read More

ఔషధ మొక్క…. గారచెట్టు / ఇంగుడి / రింగ్రి

గారచెట్టు సాధారణంగా వెడల్పులేని ఆకారంలో 10 మీ. ఎత్తు పెరుగుతుంది. కొమ్మలు సుడివలే చుట్టుముట్టి పైకి పోయే పొడవైన, సూటి ఆకుపచ్చ రంగు ముళ్ళు కలిగి వుంటాయి. ముళ్ళ మొదళ్ళ నుండి ముదురు ఆకు పచ్చ రంగు ఆకులు ఏర్పడతాయి. ఒక్కొక్క ఆకు రెండు చిన్న ఆకులు కలిగి వుంటుంది. కాండం కొంచెం నెరిసిన గోధుమ రంగులో చిరిగిన బెరడు కలిగి వుంటుంది. పూగుచ్ఛం కొన్ని పూలగుత్తులను కలిగి వుంటుంది..

సాధారణ నామం : అడవి ఖర్జూర / ముళ్ళచెట్టు శాస్త్రీయ నామం : బలనైటెస్ ఈజిప్టియాకా కుటుంబం: జైగోఫిల్లేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • ఇంగుడి బెరడు, కాయగుజ్జు, గింజలు, గింజల నూనెని ఔషధంగా ఉపయోగిస్తారు. ఇంగుడి తిక్తరసం, లఘుగుణం, ఉష్ణ, కటు, కఫ, వాత హరం గుణాలను కలిగి వుంటుంది.
  • దీనిని లేపనంగా, లోపలికి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. లేపనంగా మంటలలో కాలిన శరీరభాగాలకు, గాయాలకు, శిరో రోగాలకు, జుట్టు సమస్యలకు, మానని గాయాలకు, ఎలుక కరిచినపుడు ఉపయోగిస్తారు. కడుపులో నులిపురుగులు, మలబద్ధకం, ఆకలి మందగించడం, పొత్తికడుపునొప్పి, రక్త సంబంధ వ్యాధులు, విపరీతమైన దగ్గు, ఆస్త్మా, బ్రోంకైటిస్, డైసూరియా, ల్యూకోడెర్మా, చర్మ వ్యాధులు, ఎలుకకరిస్తే విష నివారణకు లోపలికి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. దీని మోతాదు కషాయం (50-100 మి.లీ.), పొడి (3-6 గ్రా), గింజల నూనె (5-10 చుక్కలు), కాయగుజ్జు (500-1000 మి.గ్రా.) గింజలపొడి (500-1000 మి.గ్రా.)
  • అధిక సపోనిన్స్ కలిగిన కాయగుజ్జు డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేసే దోమల లార్వాలను చంపుతుంది.

వ్యవసాయరంగంలో …

  • ఇంగుడి ద్రావణం పంట కాలువలలో నత్తల గుంపులు, నిల్వ వుంచిన అలసంద గింజలను నష్టపరిచే పురుగు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌ని నివారిస్తుంది (రావు, అతని అనుచరులు, 1997, న్వవోగు, అతని అనుచరులు, 2013)
  • ఇంగుడి ద్రావణం నిల్వ ధాన్యంలో ఆశించే కాప్రాబీటల్, ట్రోగోడెర్మా గ్రానేరం ని అరికట్టింది (మొల్మాద;, 2003), ఇంగుడి గింజల హెక్సేన్ ద్రావణం ట్రోగో డెరా గ్రానేరియం మూడవ దశ లార్వాలను సమర్థవంతంగా చంపింది (మొహ్మద్ అండ్ సత్తి, 2013)
  • ఇంగుడి ద్రావణం అతి తక్కువ (10%) మోతాదులో అలసంద గింజల నిల్వ సమయంలో ఆశించే 85% కాల్లనో బ్రూకస్ మాక్యులేటస్ పురుగులను చంపింది (కేబాల, అతని అనుచరులు, 2013)
  • ఇంగుడి గింజల ఎపికార్ప్, మీసోకార్ప్ ద్రావణాలు యాంటిఫీడెంట్ చర్యతో అలసంద గింజల నిల్వ సమయంలో ఆశించే పురుగు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌ని అరికట్టింది.
  • ఇంగుడి ద్రావణంలో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, టానిన్స్, సపోనిన్స్, కార్బో హైడ్రేట్స్, టెర్పెనాయిడ్స్ వంటి రసాయనాలున్నాయి (ఉమర్ ముహ్ద్‌గుని, 2016)
  • ఇంగుడి కాయ మీసోకార్ప్ ద్రావణంలో వున్న సపానిన్స్ డెంగ్యూ వాహకం ఈడెస్ ఈజిప్టి దోమ లార్వాలను నాశనం చేశాయి (బిష్ణుచాపగన్ అండ్ జీవ్ వీస్మన్, బెన్‌గురియన్ యూనివర్సిటి, ఇజ్రాయెల్)
  • ఇంగుడి + చింతకాయల ద్రావణాన్ని ఉపయోగించి ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ పారసైటికస్‌ల విషపూరిత పదార్థాల వల్ల ఆహారం కలుషితమవకుండా కాపాడవచ్చు (ఎల్. నగర్ బి, అతని అనుచరులు, 2013)
  • ఇంగుడి పచ్చి కాయ ద్రావణం పిచికారి చేసిన 3వ రోజు తర్వాత పిండినల్లి ఫెరిస్టా విర్గేటా నివారించబడింది. పిచికారి చేసిన 7వ రోజు పిండి నల్లులు కనిపించలేదు (వబలె, అతని అనుచరులు, 2010).
  • ఇంగుడి ద్రావణం గొర్రెల నాశించే ఈగ ల్యూసిలియా సెరికేటా మూడు దశల లార్వాలను నివారించింది (మొహ్మద్, అతని అనుచరులు, 2016)
  • ఇంగుడి ద్రావణం రైజోక్టోనియా సొలాని శిలీంద్రం పెరుగుదలను గరిష్టంగాను, ఫిథియం అఫానిడెర్మేటం శిలీంద్రాన్ని కనిష్టంగాను అరికట్టింది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వివిధ పంట రకాలు, ప్రయోజనాలు

పప్పు ధాన్యాలు ` నూనెగింజలు

మినుము :
ఆంధ్ర రాష్ట్రంలో మినుము 9.71 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, దాదాపు 3.65 లక్షల టన్నుల ఉత్పత్తిని, సగటున ఎకరాకు 376 కిలోల దిగుబడి నిస్తుంది. రాష్ట్రంలో మినుమును తొలకరిలో, రబీలో మరియు వేసవిలో వరి కోతల తర్వాత పండిస్తారు.

మినుము పంటను జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. మినుములో అనువైన రకాలు :

జి.బి.జి-1 : ఈ రకం పంట కాలం 70-75 రోజలు, దిగుబడి 8-9 క్వింటాళ్ళు. ఇది పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. అన్ని కాలాలకు అనువైన రకం ఇది. వ్యవసాయ పరిశోధనా స్థానం, ఘంటశాల, కృష్ణాజిల్లా నుండి లభ్యం అవుతుంది- 9248838628

టి.బి.జి. 104 : పంట కాలం- 70-75 రోజలు, దిగుబడి, 8-9 క్వింటాళ్ళు. పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. ఇది అన్ని కాలాలకు అనువైన రకం. ఇది కృషి విజ్ఞాన కేంద్రం, దర్శి, ప్రకాశం జిల్లా నుండి లభ్యం అవుతుంది – 9989623827.

ఎల్.బి.జి-352: ఈ రకం పంట కాలం 75-80 రోజలు . దిగుబడి 6-7 క్వింటాళ్ళు. వరి మాగాణుల్లో ఆలస్యముగా విత్తుటకు కూడా అనువైన రకం. ఇది కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటశాల, కృష్ణా జిల్లా నుండి లభ్యం అవుతుంది – ఫోన్ నంబర్- 8008201253.

ఎల్.బి.జి`904 మరియు టి.బి.జి-129 రకాలు కెవికె, రెడ్డిపల్లి, అనంతపూరం జిల్లా నుండి లభ్యం అవుతున్నాయి – ఫోన్ నెంబర్ -9989623825

పెసర :
ఆంధ్ర రాష్ట్రంలో పెసర సాగు విస్తీర్ణం 2.59 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, దాదాపు 0.81 లక్షల టన్నుల ఉత్పత్తిని, సగటున ఎకరాకు 313 కిలోల ఉత్పాదకతనిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో తొలకరి పంటగాను, కోస్తా ఆంధ్రలో తొలకరి మరియు రబీ పంటగా పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో, వేసవిలో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో మూడవ పంటగాను పండిస్తున్నారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెసరను పండించవచ్చు. కంది, ప్రత్తి మరియు పండ్ల తోటలలో అంతర పంటగా కూడా పండించవచ్చు.

ఎల్.జి.జి-574: ఈ రకం పంట కాలం 65-70 రోజులు. దిగుబడి 6 నుండి 7 క్వింటాళ్ళు. ఇది పల్లాకు తెగులును తట్టుకుంటుంది. ఈరకం కెవికె, రెడ్డిపల్లి అనంతపురం నుండి లభిస్తుంది – 9989623825.

డబ్ల్యు.జి.జి.-42: ఇది ఖరీఫ్ పంటకు అనుకూలం, పంట కాలం 55-60 రోజులు. 4-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉండి మెరుస్తుంటాయి. ఇవి కెవికె, ఊటుకూరు, వై.యస్.ఆర్. కడప జిల్లాలో లభ్యం అవుతాయి. ఫోన్ నెంబర్:9848809236,

కంది : అనువైన రకాలు ఎల్.ఆర్.జి-52 రకం. వ్యవసాయ పరిశోధనా స్థానం, గరికపాడు, ఎన్.టి.ఆర్. జిల్లా నుండి లభ్యం అవుతుంది. ఫోన్ నెంబర్-9491003499 మరియు టి.ఆర్.జి.-59 మరియు జి.ఆర్.జి-152 రకాలు కెవికె, బనవాసి నుండి అభ్యం అవుతున్నాయి – 8074420092.

వేరుశనగ : పంట కాలం 105-110 రోజులు. ఇందులో కదిరి లేపాక్షి రకం తీవ్ర బెట్ట పరిస్థితులను తట్టుకుని 6-8 క్వింటాళ్ళు దిగుబడి ఇస్తుంది. ఈరకం కెవికె, రెడ్డిపల్లిలో లభ్యం అవుతుంది -9989623825, కదిరి చిత్రావతి కూడా లభ్యం అవుతుంది. కె-6, కదిరి, అమరావతి రకాలు వ్యవసాయ పరిశోధనా స్థానం, కదిరి నుండి లభ్యం అవుతున్నాయి. సంప్రదించవలసిన నంబరు – 9490081470. విశిష్ట రకం వ్యవసాయ పరిశోధనా స్థానం, ఊటుకూరు నుండి లభ్యం ఆవుతుంది. ఫోన్ నెంబర్ – 7981982531.

నువ్వులు : నువ్వులలో YLM-66 రకం,YLM-17 రకం ఖరీఫ్‌కు అనువైనవి. పంటకాలం 75-80 రోజులు, దిగుబడి 5-6 క్వింటాళ్ళు. ఇవి రాయలసీమకి ఆనుకూలం. వ్యవసాయ పరిశోధనా స్థానం, యలమంచిలి, అనకాపల్లి జిల్లా నుండి లభిస్తుంది. ఫోన్ నెంబర్: 9440977352, 9849275470.

ఆముదం : ఆముదం పంట కాలం 90-150 రోజులు, దిగుబడి 6 – 7 క్వింటాళ్ళు. ఇందులో కిరణ్ రకం బెట్టను తట్టుకుంటుంది. బూజు తెగులు తక్కువ. డి.సి.ఎస్-107 మరియు ప్రగతి ఎండు తెగులును తట్టుకుంటుంది. ఐ.సి.హెచ్- 66 ఎండు తెగులు మరియు బెట్టను తట్టుకుంటుంది. ఇవి వ్యవసాయ పరిశోధనా స్థానం అనంతపురం నుండి లభ్యం అవుతున్నాయి. ఫోన్ నెంబర్: 9989210879.

వరితో పోల్చితో చిరుధాన్యాల్లో అధిక పోషక విలువలు ఉన్నాయి. వీటిలో అధిక మాంసకృకృత్తులతో పాటుగా మంచి అమైనో ఆమ్లాలు ఉంటాయి. పిండి పదార్థాలు తక్కువ. పీచు పదార్థం ఎక్కువ ఉండి రాగి, కాల్షియం అధిక మోతాదులలో ఉంటాయి. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడే తీవ్ర కరువు ప్రభావాన్ని తగ్గించడానికి, రైతులు అధిక నీటి అవసరం ఉన్న పంటలను కాక నీటి ఎద్దడిని తట్టుకునే చిరుధాన్యాలను సాగు చేసుకున్నట్లయితే తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడులను సాధించవచ్చు.

జొన్న: ఇది అధిక కరువు నిరోధకత కలిగిన పంట. దీని లోతైన “వేరువ్యవస్థ కారణంగా సుదీర్ఘ వర్షాభావ పరిస్థితులను తట్టుకోగలదు. ముఖ్యంగా చిరుధ్యాల సాగు అధికంగా ఉండే రాయలసీమ జిల్లాల్లో ఒకటైన కడపలో ఇటీవల కాలంలో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. నల్లరేగడి నేలలుండి కెసి కెనాల్ ఆయకట్టు ప్రాంతాలైన ప్రొద్దుటూరు మరియు పులివెందుల ప్రాంతాలలో NTJ NJ-1 CSV-29 రకాలను సాగు చేయవచ్చు. అలాగే ఇవి ధాన్యం మరియు పశుగ్రాసం రెండింటిని అందిస్తాయి. సజ్జ పంట విషయానికి వస్తే తక్కువ తేమగల నల్లరేగడి నేలలలో ABH-1, CTP-8203 హైబ్రిడ్ రకాలను ఎంచుకోవచ్చు. ఆలస్యమైనా ఖరీఫ్ సీజన్‌లో ఆగష్టు రెండవ వారం నుండి సెప్టెంబర్ మొదటి వారం లోపు వేసుకోవచ్చు. ఎర్రనేలలు అధికంగా ఉన్న జమ్మలమడుగు మండలంలో కొర్రలు(స్వల్పకాలిక రకాలు) సియా`3223 (రేనాడు/గరుడ) లేదా సూర్యనంది వంటి అధిక దిగుబడులు ఇచ్చే రకాలు నాటుకోవచ్చు.

రాగి రకాలు చూసినట్లయితే గౌతమి (PR) వకుళ, చైతన్య మరియు ఇంద్రావతి వర్షాధార పరిస్థితులకు అనుకూలం. ఈ రకాలు బ్లాస్ట్ తెగులు మరియు తేమ ఒత్తిడిని అధికంగా తట్టుకుంటాయి. పంట ఏది వేసినా విత్తనశుద్ధి తప్పకుండా చేయాలి. సాళ్ళలో నాటడం వలన అప్పుడప్పుడు పడిన వర్షం బొట్టును కూడా ఒడిసి పట్టుకుని పంట నిలబడుతుంది. అలాగే అంతర పంటల సాగుకు కూడా అనుకూలం. కొర్ర లేదా జొన్నను కంది తో కలిపి 4:1 లేదా 5:1 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకోవచ్చు. విత్తనం కొరకు భారత చిరుధ్యాల పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు.ఫోన్ నంబరు : 040 – 24599300.

నీటి ఎద్దడిని తట్టుకునే పశుగ్రాస రకాలు
నీటి ఎద్దడిని (Drought) తట్టుకుని, తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పశుగ్రాస రకాలు పాడి రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అనంతపురం, వై ఎస్ ఆర్ కడప జిల్లాల పరిసర ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు ఈ క్రింది రకాల పశుగ్రాసాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి:

ధాన్యపు జాతి పశుగ్రాసాలు:

జొన్న గడ్డి రకాలు :
ఏకవార్షికాలు – పి.సి -9, ఎం.పి. చారి, పంత్ చారి-5,7, సి.ఎస్.వి. -30F,
32F,

బహు వార్షికాలు – ఎస్. ఎస్. జి 59 -3 , పూస చారి – 6, 23, సి.ఎస్.వి. -33 COFS 29 (కోఎస్ఎస్ 29) COFS 31 (కోఎస్ఎస్ 31). బహుళ కోతలు (మల్టీ కట్) జొన్న రకాలు. కరవును తట్టుకుని, వర్షాలు పడగానే మళ్లీ చిగురిస్తుంది.

సోర్గమ్ -సూడాన్ గడ్డి (SSG): ఇది జొన్న మరియు గడ్డి జాతుల సంకరం. ఇందులో కాండం మందంగా ఉండి రసం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుని పెరుగుతుంది
సజ్జ గడ్డి రకాలు : జైంట్ బాజ్ర , ఎస్ – 530, జె-55 , కె – 533

కాయజాతి (లెగ్యూమ్) పశుగ్రాసాలు:
హెడ్జ్ లూసర్న్ (దశరథ గడ్డి): ఇది బహువార్షిక (3-4 ఏళ్లు వచ్చే) పశుగ్రాసం. ఇందులో ప్రోటీన్లు ఎక్కువ. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది.

అలసందలు / బొబ్బర్లు: వర్షాభావ పరిస్థితుల్లో స్వల్పకాలికంగా పండించడానికి ఇది అనువైన పశుగ్రాసం.
స్టైలో హేమాటా – ఇది నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. దీనిని వర్షాధారంగా సారవంతం కాని భూముల్లో సాగుచేయవచ్చు. భూసారాన్ని పెంచుతుంది. మిశ్రమ పంట లాగా తోటల్లో సాగు చేయవచ్చు.

గడ్డి జాతులు:
బాజ్రా నేపియర్ హైబ్రిడ్ : నేపియర్ రకాల వేర్లు లోతుగా చొచ్చుకుపోయి నీటిని గ్రహిస్తాయి కాబట్టి కరవును తట్టుకుంటాయి.

అంజన్ గడ్డి – ఇసుక నేలల్లో కూడా సాగు చేయవచ్చు. తోటల్లో మిశ్రమ పంటగా సాగు చేసుకోవచ్చు
గిన్ని గడ్డి – ఇది నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో బాగా అనువైన రకం.

చెట్ల మేత:
సుబాబుల్ మరియు అవిశ: నీరు లేని సమయాల్లో వీటి కొమ్మలు, ఆకులను పశువులకు మేతగా వేయవచ్చు.

విత్తనాలు లభ్యత :
పశుగ్రాస విత్తనాలను ఆంధ్రప్రదేశ్ లోని పశువైద్య విశ్వ విద్యాలయ పరిధిలోని పరిశోధన కేంద్రాలు, ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణ కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు లేదా వ్యవసాయ సంభందిత ఆన్లైన్ ప్లాట్ ఫారముల ద్వారా పొందవచ్చు.

రైతుల సమాచారం కోసం కెవికె శాస్త్రవేత్తలచే రూపొందించబడినది. సంప్రదించవలసిన చిరునామా, కెవికె, ఒనిపెంట`9398982828, 7032463875, 8121136184

డా. శ్రీవిద్య రాణి.ఎన్, శాస్త్రవేత్త, విస్తరణ విభాగం , డా.బి.ఎస్.కాంతి శ్రీ, శాస్త్రవేత్త, గృహవిజ్ఞాన విభాగం, డా. టి.విజయ నిర్మల, శాస్త్రవేత్త, పశుపోషణ విభాగం. Ph: 93989 82828

Read More

ఎల్‌ నినో (El Nino) ప్రభావం మరియు పశువుల సంరక్షణ – సమగ్ర నివేదిక

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఒక తీవ్రమైన వాతావరణ మార్పు. దీని ప్రభావం వల్ల భారతదేశం, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండి, అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు మరియు తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ప్రతికూల వాతావరణం వ్యవసాయంతో పాటు పాడి మరియు మాంసం కోసం పెంచే పశువుల ఆరోగ్యం, మరియు ఉత్పాదకతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

పశువులపై ఎల్‌నినో చూపే ప్రభావాలు, వాటి వల్ల కలిగే నష్టాలు, మరియు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య, నివారణ చర్యల గురించి కింద వివరంగా వివరించబడింది:

  1. పశువులపై ఎల్‌ నినో చూపే తీవ్ర ప్రభావాలు

ఎ. ఉష్ణోగ్రత మరియు హీట్ స్ట్రెస్:
• ఎల్‌నినో సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6°C వరకు పెరిగే అవకాశం ఉంటుంది.
• పశువులకు వాతావరణంలో ఉష్ణోగ్రత-తేమ సూచిక 68 కంటే తక్కువగా ఉంటే సురక్షితం. కానీ ఎల్‌నినో వల్ల ఈ సూచిక 79 కంటే ఎక్కువగా నమోదై, పశువులు భయంకరమైన హీట్ స్ట్రెస్‌కు గురవుతాయి.
• మనుషుల లాగా పశువులకు చెమట పట్టే సామర్థ్యం చాలా తక్కువ. కాబట్టి వేడిని తట్టుకోవడానికి పశువులు వేగంగా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తాయి. దీనివల్ల పశువు శరీరంలోని శక్తి మాంసం, పాలు ఉత్పత్తికి బదులుగా శ్వాస తీసుకోవడానికే వృథా అవుతుంది.

బి. రోగనిరోధక వ్యవస్థ క్షీణత మరియు వ్యాధులు:
• ఎల్‌నినో సమయంలో వాతావరణ ఒత్తిడి వల్ల పశువుల శరీరంలో కార్టిసోల్ మరియు ఏసీటీఎచ్ అనే ఒత్తిడి హార్మోన్లు విపరీతంగా విడులవుతాయి. ఈ హార్మోన్లు పశువుల రోగనిరోధక శక్తిని అణచివేస్తాయి.
• వేడి, తేమతో కూడిన వాతావరణం వల్ల పేలు, గోమారలు, మరియు ఈగలు ఎక్కువగా వృద్ధి చెంది పశువులకు వ్యాధులను వ్యాపింపజేస్తాయి.
• అలాగే రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల గొంతువాపు, జబ్బవాపు, ఆంత్రాక్స్ లాంటి ప్రమాదకరమైన బాక్టీరియా మరియు వైరల్ వ్యాధులు వేగంగా సోకుతాయి.

సి. పాడి ఆవులు, గేదెలపై ప్రభావం:
• ఆవులు తమ శరీరంలో వేడిని తగ్గించుకునే క్రమంలో జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల దాణా తీసుకోవడం తగ్గిపోతుంది.
• తగినంత దాణా తీసుకోకపోవడం వల్ల పాల దిగుబడి 10% నుంచి 30% వరకు పడిపోతుంది. పాలలో కొవ్వు మరియు ప్రోటీన్ శాతం బాగా తగ్గిపోయి పాలు పలచబడతాయి.
• ప్రత్యుత్పత్తి వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుంది. ఈస్ట్రోజెన్, ఎల్‌హెచ్ హార్మోన్ల స్థాయిలు పడిపోయి అండాల నాణ్యత దెబ్బతింటుంది.
• ఆవులు సైలెంట్ హీట్‌కు గురవుతాయి మరియు గర్భస్థ పిండాలు చనిపోయే ప్రమాదం ఉంటుంది.
• ఒక పరిశోధన ప్రకారం, ఎల్‌నినో వల్ల కలిగే హీట్ స్ట్రెస్ సమయంలో ఆవులలో పిండాల ఉత్పత్తి తగ్గిపోతుంది. చల్లటి వాతావరణంలో సజీవ పిండాల శాతం 59.2% ఉండగా, ఎల్‌నినో సమయంలో అది 38.2%కి పడిపోయినట్లు గుర్తించారు.

డి. మాంసం కోసం పెంచే పశువులపై ప్రభావం:
• సరైన పశుగ్రాసం లేకపోవడం వల్ల పశువుల బరువు పెరగడం ఆగిపోతుంది.
• తీవ్రమైన ఎండల వల్ల పశువుల కండరాల్లో నిల్వ ఉండే గ్లైకోజెన్ శక్తి పూర్తిగా హరించుకుపోతుంది.
• దీనివల్ల మాంసం కోసే సమయానికి దాని ఆమ్ల-క్షార స్థాయి 5.8-6.0కు పెరిగిపోయి, మాంసం ముదురు రంగులో, గట్టిగా, పొడిగా మారుతుంది. దీనివల్ల మార్కెట్లో మాంసం నాణ్యత, ధర పడిపోతుంది.

ఇ. నీరు మరియు పశుగ్రాస కొరత:
• ఎల్‌నినో వల్ల వర్షపాతం తగ్గడంతో పచ్చగడ్డి దిగుబడి ఆగిపోయి పశుగ్రాస కొరత ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 4.5 లక్షల టన్నుల పశుగ్రాసం కొరత ఏర్పడింది.
• చెరువులు, కుంటలు ఎండిపోవడం వల్ల పశువులకు త్రాగునీటి కొరత ఏర్పడుతుంది. ఒకవేళ కలుషితమైన నీరు తాగితే వ్యాధులు ప్రబలుతాయి.

  1. నివారణ మరియు యాజమాన్య చర్యలు

ఎ. పశుగ్రాస నిర్వహణ:
• ముందస్తు ప్రణాళిక: రాబోయే కరువు పరిస్థితులను (ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు) దృష్టిలో ఉంచుకొని పశుగ్రాస ప్రణాళిక చేసుకోవాలి.
• సైలేజ్ తయారీ: వర్షాకాలంలో లేదా పచ్చగడ్డి ఎక్కువగా ఉన్నప్పుడు మిగిలిన గడ్డిని వృథా చేయకుండా “సైలేజ్” లేదా ఎండుగడ్డిగా నిల్వ చేసుకోవాలి.
• దాణా మరియు మేత కొలతలు: 400-500 కేజీల బరువుండే పశువుకు రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 5 కేజీల ఎండుగడ్డి (వరి గడ్డి లేదా జొన్న), 3-5 కేజీల దాణా విధిగా అందించాలి. పచ్చగడ్డి అందుబాటులో లేకపోతే ఎండు గడ్డికి పోషకాలు కలిపి ఇవ్వాలి.
• ప్రభుత్వ పథకాల వినియోగం: ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కింద, ప్రకృతి వ్యవసాయం కింద ఖాళీ భూముల్లో పచ్చగడ్డిని పెంచాలి. హరిత గోపాలం పథకం ద్వారా పశుగ్రాస క్షేత్రాలు, నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలి.
• పొలాల గట్లపై పెరిగే సహజమైన గడ్డిని నాశనం చేయకుండా పశువుల కోసం భద్రపరచుకోవాలి.

బి. దాణాలో మార్పులు మరియు సప్లిమెంట్లు:
• పశువులు ఎండ సమయంలో మేత తినలేవు, కాబట్టి వాతావరణం చల్లగా ఉండే ఉదయం (6-7 గంటలకు) మరియు సాయంత్రం (4-6 గంటలకు) సమయాల్లో మేత మేపాలి.
• మేతలో పీచు పదార్థాలతో పాటు శక్తిని ఇచ్చే దాణా పెంచాలి. అజీర్తి సమస్యలు రాకుండా ప్రోబయోటిక్స్ వాడాలి.
• వడదెబ్బను, డీహైడ్రేషన్‌ను తట్టుకోవడానికి తాగునీటిలో ఎలక్ట్రోలైట్లు కలపాలి.
• పశువులకు మినరల్ మిక్చర్ మరియు ఉప్పు ఎక్కువగా ఉండే దాణా అందించాలి. విటమిన్ సి, విటమిన్ బి1, మరియు ఎల్-కార్నిటైన్ కలిగిన పోషకాలు పశువులకు ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తాయి.

సి. నీటి నిర్వహణ:
• ఒక ఆవుకు రోజుకు కనీసం 40-60 లీటర్ల శుభ్రమైన తాగునీరు అవసరం, ఎండాకాలంలో ఈ అవసరం ఇంకా పెరుగుతుంది. పశువులకు ఎల్లప్పుడూ చల్లటి, స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండేలా చూడాలి.
• వ్యవసాయ క్షేత్రాల్లో పల్లపు ప్రాంతాల్లో ఫార్మ్ పాండ్స్ తవ్వి వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి.

డి. వసతి మరియు శీతలీకరణ:
• పశువుల పాకల పైకప్పుకు ఆస్బెస్టాస్ లేదా జింక్ రేకులు వాడకూడదు, ఇవి వేడిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. కప్పులపై గడ్డి లేదా కొబ్బరి ఆకులు వేసి ఉంచాలి.
• గాలి బాగా ఆడేలా చూసుకోవాలి. పాకలలో వేడిని తగ్గించడానికి ఫాగర్లు, మిస్ట్ డ్రాప్స్, లేదా స్ప్రింక్లర్లు తో పాటు ఫ్యాన్లు ఉపయోగించి సూక్ష్మ వాతావరణాన్ని చల్లగా ఉంచాలి. క్లోజ్డ్ హౌస్ పద్ధతిని వాడితే కూలింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేసుకోవాలి.

ఇ. ఆరోగ్య సంరక్షణ మరియు వ్యాక్సినేషన్:
• ఎల్‌నినో ముప్పు తీవ్రంగా ఉంటుంది కాబట్టి వర్షాకాలానికి ముందే పశువులకు గాలికుంటు వ్యాధి, గొంతువాపు, మరియు జబ్బవాపు లకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి.
• పశువులకు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు త్రాగించాలి. పాకల్లోకి పేలు, గోమారలు రాకుండా పాత మట్టిని తీసేసి కొత్త మట్టి వేయాలి, క్రిమిసంహారకాలు పిచికారీ చేయాలి.
• పాకల్లో రద్దీని తగ్గించాలి. రద్దీ వల్ల వేడి పెరగడమే కాకుండా అమ్మోనియా వాయువు ఉత్పత్తి అయి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.
• ఉరుములు, పిడుగులు పడే సమయంలో పశువులను చెట్ల కింద ఉంచకూడదు. అలాగే ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు పశువులను బలవంతంగా లాగడం చేయకూడదు.
పై విధానాలను సూక్ష్మస్థాయిలో ప్రణాళికబద్ధంగా పాటిస్తే, ఎల్‌నినో లాంటి విపత్కర వాతావరణ పరిస్థితుల్లో సైతం పశుగ్రాస కొరతను అధిగమించి, పశువుల ఉత్పాదకత పడిపోకుండా కాపాడుకోవచ్చు. ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణం పశువైద్యాధికారిని సంప్రదించడం అత్యంత కీలకం.

డాక్టర్.జి.రాంబాబు, పశువైధ్యాధికారి, కడప. Ph: 94945 88885

Read More

తేనెపట్టుల ప్రవాసము (Migration of Bee Honeycolonies)

తేనెపట్టుల ప్రవాసము (Migration of Bee Honeycolonies)

సంవత్సరం పొడవునా సాధారణంగా ఏ ప్రాంతంలోకూడా పుష్పించే మొక్కలు ఉండవు, అయినప్పటి తేనెటీగలు వాటి రోజూవారి అవసరములకొరకు పుప్పాడిని, మకరంధమును సేకరించుకొని తేనెను ఉత్పత్తిచేస్తాయి. ఒకవేళ పుప్పొడి మరియు మకరందము లభ్యము కాని పక్షంలో అనుబంధ ఆహారాన్ని అందించవలసి ఉంటుంది. క్యాలెండరును బట్టి తేనెటీగలకు పుష్పజాతులు లభ్యమయ్యే ప్రాంతాలకు తేనెపట్టులను తీసుకుని పోవలసియుంటుంది. దీనినే తేనెపట్టుల ప్రవాసము (Migration) అంటారు. పెద్ద ఎత్తున దీనిని అవలంభించినప్పుడు తేనెటీగల పెంపకంలో తేనెపట్టుల ప్రవాసము (Migratory Bee keeping) అంటారు.

వాణిజ్యపరంగా తేనెటీగల పెంపకమును చేపట్టినపుడు తేనెపట్టుల ప్రవాసము అనునది చాలా ముఖ్యమైనది. దీని ముఖ్యఉద్దేశ్యము

  • తేనె ఉత్పత్తిని పెంచుట కొరకు
  • తేనెపట్టులను బలపరచుకొని, విభజించుకొనడానికి
  • అనుబంధ పోషణ ఖర్చు తగ్గించుకొనడానికి మరియు తేనెటీగల పరాగ సంపర్కము ద్వారా పంటల ఉత్పత్తి పెంచుకొనడానికి
  • అడవి మరియు వ్యవసాయ మొక్కలలో జీవవైవిద్యమును పరపరాగ సంపర్కము ద్వారా కాపాడుకొనుటకు గాను తేనెపట్టుల ప్రవాసము ఉపయోగపడును.

గుర్తించకొనదగిన విషయాలు (Points to consider)
తేనెటీగల పెంపకము యొక్క ముఖ్యవుద్దేశ్యము ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకొని తేనె దిగుబడిని పెంచుకొనడము. అందుకనే తేనెటీగల పెంపకముదారులు తేనెటీగలకు ఆహారమును సరఫరా చేయు మొక్కలను మొదటిగా గుర్తించవలెను. తేనెపట్టులను మార్చుటకు (Migration) లేదా ప్రవాసము కొరకు అగు ఖర్చును తెలుసుకొనాలి మరియు సరైన శాస్త్రీయ పరిజ్ఞానము మరియు నిపుణత, పట్టులను ప్రవాసము చేయుటకు ఉండాలి. తేనెపట్టులను ప్రవాసము కొరకు ప్రణాళిక వేయునపుడు (Migration) ఈ క్రింది సూచనలు పాటించాలి.

ప్రవాసము చేయు స్థలము ఎంపిక

  • తేనెపట్టులు మార్చుకునే ప్రదేశములో లభ్యమయ్యే మొక్కలు, చెట్లు, వృక్షములు ఏరకమునకు చెందినవో, ఏ సీజనులో ఎంతకాలం పుష్పిస్తాయో ఎంత విస్తీర్ణములో ఉన్నవో, ప్రస్తుతం తేనెపట్టులున్న ప్రదేశం కంటే కొత్తగా పట్టులు పెట్టుకొను ప్రాంతములో ఎంత తేనెదిగుబడి వస్తుందో అంచనా వేసుకొనాలి.
  • తేనెపట్టులకు లభ్యమయ్యే పుష్పజాతుల పంటల మీద పురుగుమందులు పిచికారీ చేస్తారేమోనన్న విషయాన్ని స్థానిక వాతావరణ పరిస్థితులను గూర్చిన వివరణను సంపాదించాలి.
  • ప్రకృతి సిద్ధముగా తేనెపట్టులపై దాడిచేయు శత్రువుల విషయమైన సమాచారాన్ని సేకరించి, శత్రువుల దాడి తక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొనాలి.
  • తేనెపట్టులు పెట్టుకున్న ప్రాంతంనుండి ఎంతదూరంలో తేనెటీగలకు పుప్పొడిని, మకరందాన్నిచ్చే పుష్పజాతులు ఉన్నవో అంచనా వేసుకొనాలి.
  • తేనెటీగల పట్టుల ప్రవాసము కొరకు ఎంత లాభము, ఎంత నష్టము ఉంటుందో విశ్లేషణ చేసుకొనాలి.

తేనెపట్టుల ఎంపిక మరియు ప్రవాసము కొరకు తేనెపట్టులను సిద్ధపరచుట

  • బలమైన, ఆరోగ్యకరమైన మరియు తేనెను సేకరించగల పట్టులను మాత్రమే ప్రవాసం (Migration) కొరకు ఎంపిక చేసికొనాలి.
  • తేనెపట్టులను ప్రవాసము తీసుకొని వెళ్ళడానికి ముందు కనీసం రెండు నెలలు నుండి బలవరచుకొనాలి.
    కావలసిన వస్తువులు, పరికరములన్నీ ఉదాహరణకు తేనె అరలు, ఫ్రేములు, కృత్రిమ మైనపు అట్టలు, తేనె యంత్రము మరియు తేనెను సేకరించి నిల్వవుంచుకొనుటకు కావలసిన పాత్రలు సిద్ధపరచుకొనవలెను.

తేనెపట్టుల ప్రవాసము కొరకు తగిన సమయము (Timing of Migration)
తేనెటీగలకు పుప్పొడిని, మకరందమును అందించే ఎక్కువ మొక్కలు పుష్పించేదశలో ఉన్నపుడు తేనెపట్టులను ప్రవాసము తీసుకువెళ్ళవలెను (కనీసం 5 శాతం పుష్పములు ఉన్నపుడు).

తేనెపట్టులను సిద్దపరచుట (Preparation of Bee colonies)
తేనెపట్టులను చాల జాగ్రత్తగా ప్రవాసముకొరకు సిద్ధపరచుకొనవలెను. ఈ సిద్దపరచడం సరిగా చేయకపోయినట్లుయితే కొన్ని ఈగలు వెనుక వదిలి పెట్టబడి లేక ప్రవాసం చేయునపుడు చనిపోతాయి.

తేనేపెట్టెలను క్రింద చెప్పబడిన విధముగా సిద్ధపరచుకొనాలి

  • తేనెపట్టులను శుభ్రపరచాలి.
  • అధికముగా ఉన్న తేనెను, తేనెయంత్రంతో తీసుకొనాలి మరియు తేనెగదిని తీసివేయాలి. తేనెతో నింపబడిన ఫ్రేములతో పాటుగా ప్రవాసము చేసినట్లయితే తేనెటీగలు చనిపోతాయి. ఫ్రేములను పట్టులలో గట్టిగా బిగించుకోనాలి.
  • తేనెపట్టుల ప్రవాసము సుదీర్ఘమైనదైనట్లయితే (Long distance) అనుబంధ ఆహారాన్ని (Supplementary feeding) ఏర్పాటు చేసుకొనాలి.
  • చెక్కలతో (Wooden reapers) పై నుండి క్రిందివరకు అడుగుబల్లను, తేనెగదిని, పిల్లలగదితో బిగించుకొనాలి. ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉన్నసమయంలో పట్టులను ప్రవాసం తీసుకొని వెళ్ళునపుడు వైరుల వలతో ఉన్న లోపలిమూతను వాడుకొనాలి.
  • సుదీర్ఘప్రవాసం అయితే, వేడిగా ఉన్న సమయంలో పైమూతను (Outer cover) తీసివేసుకొనాలి.
  • వైరుతోగాని, పెట్టె బెల్టుతో గాని లేక త్రాడుతోగాని పట్టును బయట కవరును తీయకుండానే కొద్ది దూరపుప్రవాసముల విషయమంలో కట్టుకొనాలి.
  • కూలిఈగలన్నీ సాయంత్రమునకు పట్టుకు చేరుకున్న తరువాత వైరునెట్ తోగాని, గుడ్డముక్కతో గాని పట్టుద్వారమును మూసివేయాలి. ద్వారము వద్ద ఈగలన్నీ గుమికూడి గుంపుగా ఉన్నట్లయితే నీరుచల్లిగాని, లేక పొగబారించుట ద్వారా గాని ఈగలు పట్టులోనికి వెళ్లునట్లుగా ప్రాత్సాహించాలి.

తేనెపట్టుల ప్రవాసము (Bee colonies migration)

  • తేనెపట్టులను, ట్రక్కు లేక ట్రాక్టరు లేక ఆటోరిక్షా, కూలికి మనుష్యులను పెట్టుకొనిగాని ఒకచోట నుండి మరొకచోటికి మార్చుకొనవచ్చును లేక వివిధ పద్దతులను కలిపిగాని, తేనెపట్టులు మొదటిస్థానం నుండి తేనెటీగలకు ఆహారం లభించే స్థలానికి మార్చుకొనవచ్చును.
  • సాధ్యమయినట్లయితే పట్టుల ప్రవాసమును రాత్రిపూట (శీతాకాలం సా||గం.5.00ల నుండి ఉ॥ గం.10.00లు, ఎండాకాలం అయితే సా||గం. 7.00ల నుండి ఉగం. 7.00ల మధ్య) చేపట్టాలి.
  • తేనెపట్టుల మధ్య గాలి ప్రవహించేలా ఉండాలి.
  • తేనెపట్టులను జాగ్రత్తగా ట్రక్కులలో భద్రంగా చేర్చుకొనాలి.
  • వాహనము నెమ్మదిగా సాధ్యమైనంతవరకు ఏవిధమైన ఒడిదుడుకులు లేకుండా నడపాలి.
  • వాహనాన్ని ఎక్కువసేపు ఆపి ఉంచకూడదు. ఒకవేళ రోజంతా లేక ఇంకా ఎక్కువసమయము ఆపివేయాల్సివస్తే పట్టులను వాహనంనుండి దింపి, పట్టుల ద్వారములను తెరచి, ఈగలు ఆహర సేకరణ కొరకు వదలాలి. రాత్రి అయిన తర్వాత తిరిగి ప్యాకింగ్ చేసి తిరిగి వాహనములోనికి లోడు చేసుకొనాలి.
  • గమ్యస్థానము చేరుకున్న తరువాత వాహనమునుండి నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి జాగ్రత్తగా పట్టులను దించుకొనాలి.
  • ఒక గ్రూపుగా పట్టులను పెట్టుకొనాలి. కనీసం పట్టుకు పట్టుకు మధ్య 5 అడుగులు (1.5మీ) వుండునట్లుగా అమర్చుకొనవలెను.
  • పట్టులను ఆ ప్రాంతంలో పెట్టుకున్న తరువాత పట్టులద్వారాలకున్న గుడ్డ లేక వైరుజల్లెడను ఒకదాని తర్వాత ఒకటి ఒకవైపు ప్రారంభించి రెండవవైపుకు వెళుతూ తీసివేయాలి.
  • ద్వారాల్ని తెరచిన 30నిమిషముల తర్వాత లేక ప్రొద్దుపొడవగానే, ఈగలు బయటకు ఎగురు చున్నవో లేదో గమనించుకోవాలి. ఒకవేళ రెండురోజుల వరకు ఒకపట్టులోని ఈగలు బయటకు ఎగరని పక్షంలో (ఒకవేళ ఈగలు తేనెతోతడిసి చనిపోయిన ఈగలు లేక నేలమీద పారాడుతున్న ఈగలు) ఏమైనప్పటికీ వెంటనే పట్టును పరిశీలించుకొని తగిన చర్యలు చేపట్టాలి.
  • పట్టులను కొన్ని రోజులకు ప్రతిసారి పరిశీలించుకొనాలి. పిల్లలగది ఈగలతో నిండిపోయిన వెంటనే తేనె అరను ఏర్పాటుచేసికొనాలి. తేనె అరలో పాతమైనపుఅట్టలు లేక కృత్రిమ మైనపు అట్టలను పెట్టుకొనాలి.

డా. కె. మోహన్ రావు, ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగము) మరియు అధిపతి, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి- 534475, ఏలూరు జిల్లా. Ph: 9493304643

జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి -534475, ఏలూరు జిల్లా.

Read More