విత్తన చట్టం-2025లో రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలి
విత్తన చట్టం- 2025లో రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. నకిలీ లేదా నాణ్యత లేని విత్తనాల వల్ల నష్టపోయే రైతులకు చట్టబద్ధమైన, కాల పరిమితితో కూడిన పరిహారం చెల్లించే నిబంధన ఉండాలని, రైతు పొందగలిగే అత్యధిక దిగుబడి ఆధారంగా పరిహారం లెక్కించాలన్నారు. విత్తన చట్టం ముసాయిదాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేర్చాల్సిన అంశాలు, అభ్యంతరాలపై తుది నివేదిక రూపకల్పనకు బుధవారం ఆయన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలు సూచనలు చేశారు.
విత్తనోత్పత్తి చేసే రైతులను రక్షించడానికి ప్రత్యేక విభాగం ఉండాలి. విత్తనాలను సరసమైన ధరలతో రైతులకు అందించేలా ధరల నియంత్రణను తప్పనిసరి చేయాలి. రాష్ట్ర విత్తన కమిటీకి ప్రత్యేకమైన విత్తన రకాలను ఎంపిక చేసుకునే అధికారం ఇవ్వాలి.
రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు విత్తన ధరలను నియంత్రించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు దాఖలు పరచాలి. విత్తన ధరలపై సమీక్ష, హేతు బద్ధమైన ధరల పరిమితిని సిఫార్సు చేయడానికి రాష్ట్ర విత్తన కమిటీలను అనుమతించాలి.
ఉత్పత్తి సంస్థలు నేరాలకు పాల్పడితే అయిదేళ్లపాటు విత్తన ఉత్పత్తి అమ్మకాలను నిషేధించాలి. విత్తన కంపెనీలకు లైసెన్సు జారీ చేయడానికి ప్రత్యేకమైన మార్గదర్శకాలు రూపొందించాలి’ అని తుమ్మల సూచించారు. ఆయా అంశాలను మూసాయిదా బిల్లులో చేర్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని మంత్రి తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, సంచాలకుడు గోపి తదితరులు పాల్గొన్నారు.
విత్తన చట్టం ముసాయిదాలో సవరణలపై నివేదిక సిద్ధం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు.


