ఉల్లిని మార్క్‌ఫెడ్‌ ద్వారా క్వింటాలు రూ.1200 మద్దతు ధరతో కొనుగోలు చేయిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించడంతో అన్నదాతలు సంతోషించారు. కానీ వారి ఆనందం కాసేపట్లోనే ఆవిరైంది. కర్నూలు మార్కెట్‌ యార్డులో మూడు రోజులు మాత్రమే మార్క్‌ఫెడ్‌ ద్వారా ఉల్లి కొనుగోలు చేశారు. ప్రస్తుతం వ్యాపారులు, మార్క్‌ఫెడ్‌ కలిసి కొనుగోలు చేసేలా కొత్త విధానాన్ని తెరపైకి తేవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం ప్రయోగాత్మకంగా అమలుచేయగా ఈ విధానం తొలిరోజే వికటించింది.

కొత్త విధానంతో ఇబ్బందులు
నూతన విధానంలో రైతుల నుంచి తొలుత వ్యాపారులు నిర్ణీత ధరకు ఉల్లిని కొనుగోలు చేస్తారు. మార్క్‌ ఫెడ్‌ ద్వారా క్వింటాలు రూ.1200కు కొనుగోలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. వ్యాపారులు అంతకంటే తక్కువ ధరకు కొంటే.. మిగతా మొత్తాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుంది.
కానీ వ్యాపారులు సరకును ఎప్పుడు కొనుగోలు చేస్తారు? అసలు కొంటారా లేదా? అన్న విషయంపై స్పష్టత లేక కర్షకులు ఆందోళన చెందుతున్నారు. కొందరి సరకును మాత్రమే కొనుగోలు చేస్తున్నారని మిగతా రైతులు వాపోతున్నారు. మొత్తం సరకును నేరుగా మార్క్‌ ఫెడ్‌ అధికారులే కొనుగోలు చేస్తే ఇబ్బంది ఉండదంటున్నారు. కొత్త విధానంతో తాము వ్యాపారుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • ఉల్లిని కొనుగోలు చేస్తున్న వ్యాపారులు ఆ సరకు మార్కెట్‌ నుంచి బయటకు వెళ్లే వరకు రైతులే కాపలా ఉండాలంటూ షరతు విధిస్తున్నారు. దీంతో దిగుబడులు విక్రయించిన తర్వాత కూడా వారు మార్కెట్‌లోనే ఉండాల్సి వస్తోంది.
  • శనివారం మార్కెట్‌ యార్డుకు సుమారు 1659 టన్నుల సరకు వచ్చింది. ఇందులో 776 టన్నులే కొన్నారు. గత నాలుగు రోజులుగా మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొన్న సరకు, కొనుగోలు చేయనిది మొత్తం 27 వేల క్వింటాళ్లకు పైగా ప్రస్తుతం మార్కెట్‌ యార్డులోనే నిల్వ ఉంది.

నిలిచిన శీతల గిడ్డంగిని పూర్తిచేయాలని నిర్ణయం
కర్నూలు మార్కెట్‌ యార్డుకు వచ్చిన రైతులు నష్టపోకుండా ఉల్లిని శాస్త్రీయ విధానాల్లో నిల్వచేసేందుకు గతంలో ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి నిధులు (ఆర్డీఎఫ్‌) రూ.5 కోట్లతో భారీ శీతల గిడ్డంగి నిర్మాణం చేపట్టింది. సుమారు 50 శాతం పనులు పూర్తయ్యాయి. ఇది అందుబాటులోకి వస్తే 5 లక్షల టన్నుల ఉల్లిని నిల్వచేసుకునే అవకాశం ఉంటుంది. కానీ తర్వాత దాని నిర్మాణం నిలిచిపోయింది. ఆ పథకం సమయం ముగిసిపోవడంతో కేంద్రం నుంచి నిధులు రాని పరిస్థితి. ప్రస్తుత ప్రభుత్వం గిడ్డంగి నిర్మాణాన్ని పూర్తిచేయాలని నిర్ణయించింది.