వ్యవసాయ యోగ్యంగా పోడు భూములు

తెలంగాణలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని రూపొందించింది. పోడు భూముల్లో సేద్యం చేస్తున్న రైతులందరికీ రానున్న ఐదేళ్లలో (2025-26 నుంచి 2029-30 వరకు) సోలార్‌ పంపు సెట్ల ద్వారా నీటివసతి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఒక్కో యూనిట్‌కు రూ. 6 లక్షల చొప్పున ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ. 12,600 కోట్లు ఖర్చు చేయనుంది. తొలి ఏడాది రూ.600 కోట్లు… తర్వాత ఒక్కో ఏడాదికి రూ.3,000 కోట్ల చొప్పున వ్యయం చేస్తుంది. ఈ నెల 18న నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మాచారంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఈనెల 18న ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్‌ ఎ. శరత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

2025-26 కార్యాచరణ
మండలాల వారీగా ఈనెల 25 వరకు అర్హులైన ఎస్టీ రైతులను గుర్తించాలి. జూన్‌ 10 వరకు క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన, భూగర్భ జలాల సర్వే, ఇతర అంచనాలు రూపొందించాలి. జిల్లా స్థాయిలో ఈ నెల 30 నాటికి సర్వే, ఇతర పనులకు టెండర్లు పిలిచి, ఖరారు చేయాలి. జూన్‌ 25 నాటికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇన్‌ఛార్జ్‌ మంత్రి అనుమతితో పనులు అప్పగించాలి. జూన్‌ 26 నుంచి 2026 మార్చి 31 వరకు భూముల అభివృద్ధి, బోరుబావుల తవ్వకం, సోలార్‌ పంపుసెట్ల ఏర్పాటు, ఉద్యాన పంటల అభివృద్ధి పనులు చేసి, యూనిట్ల వినియోగపత్రాలను సమర్పించాలి.

రైతుల అర్హతలు: – అటవీ హక్కుల చట్టం (2006) కింద 6.69 లక్షల ఎకరాలపై 2.30 లక్షల మంది ఎస్టీ రైతులకు పోడుపట్టాలు మంజూరయ్యాయి. 2.10 లక్షల మంది రైతుల అధీనంలోని 6 లక్షల ఎకరాల భూములకు విద్యుత్తు సౌకర్యం లేదు.. వీటికి పూర్తి రాయితీతో సోలార్‌ పంపుసెట్లు ఏర్పాటు చేసి, నీటివసతి కల్పిస్తారు.

  • రైతుకు రెండున్నర ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్‌ యూనిట్‌గా పరిగణిస్తారు. అంతకు తక్కువుంటే పక్కనే ఉండే 2-5 మంది రైతులతో బోర్‌వెల్‌ యూజర్‌ గ్రూపుగా ఏర్పాటు చేస్తారు. ఇది సాధ్యం కాకుంటే ఓపెన్‌ వెల్‌ గ్రూప్‌ ఏర్పాటు చేస్తారు. జిల్లాస్థాయిలో పథకం అమలు, కొనుగోళ్ల కమిటీ కలెక్టర్‌ చైర్మన్‌గా ఉంటారు.
  • అధిక విస్తీర్ణంలో పోడు భూములున్న భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌, ఖమ్మం, ములుగు, నిర్మల్‌, కామారెడ్డి, నల్గొండ, వరంగల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, నాగర్‌కర్నూల్‌ను ప్రత్యేక జిల్లాలుగా గుర్తించారు. తక్కువ విస్తీర్ణంలో భూములున్న జిల్లాలను సమీపంలోని ఇతర జిల్లాలతో కలిపి 5 నోడల్‌ జిల్లాలుగా ప్రకటించారు.
Read More

అన్నదాతకు పెద్దపీట

తొలి ఏడాదిలో రైతుల సంక్షేమానికి రూ. 55 వేల కోట్లు!22.22 లక్షల మంది రైతుల రుణమాఫీకి రూ. 17,870 కోట్లుఉచిత విద్యుత్‌ సబ్సిడకి 10,444 కోట్లుఏడాది పాలనలో వ్యవసాయరంగంపై సీఎంవో ప్రకటన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలి ఏడాదిలో అన్నదాతకు పెద్ద పీట వేసింది. వ్యవసాయరంగంపై ప్రత్యేక దృష్టిసారించిన సర్కారు… రైతుల సంక్షేమానికి సుమారుగా రూ. 55 వేల కోట్లు ఖర్చు చేసింది. కీలకమైన రుణమాఫీతోపాటు రైతుభరోసా, ఉచిత విద్యుత్తు, రైతుబీమా పథకాలకు పెద్దఎత్తున నిధుల కేటాయింపులు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణ రైతులను దేశానికే తలమానికంగా నిలపాలనే ఉద్దేశంతో రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం తొలి ఏడాదిలోనే భారీగా నిధులు ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఏడాదిలో రూ. 54,280 కోట్లతో వివిధ పథకాలను అమలు చేసినట్లు ప్రకటించింది. దేశంలోనే వరి సాగు విస్తీర్ణంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని, 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందని పేర్కొంది. ‘దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల వరకు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. కేవలం 27 రోజుల్లోనే దాదాపు 22.22 లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు రూ. 17,870 కోట్ల రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఇటీవలే వేములవాడ సభలో సీఎం రేవంత్‌ ప్రకటించారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తుకు ఈ ఏడాది రూ. 10,444 కోట్లు సబ్సిడీగా చెల్లించినట్లు’ సీఎంవో వెల్లడించింది. ‘ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారం చేపట్టిన తొలి మూడు నెలల్లోనే రైతు భరోసా నిధులను పంపిణీ చేసింది. యాసంగి సాగుకు పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ. 5వేల చొప్పున రైతు భరోసా నిధులను రైతులందరి ఖాతాలో జమ చేసింది. మొత్తం 1,57,51,000 ఎకరాలకు రూ. 7,625 కోట్లు విడుదల చేసింది. మొత్తం 69,86,519 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ చేసింది. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా రైతు భరోసా నిధులను మే నెల మొదటి వారంలో జమ చేసినట్లు సీఎంవో ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో రైతుల తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లిచేందుకు రూ. 1,300 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. రైతు కుటుంబాలు ధీమాగా ఉండేలా రైతు బీమాను అమలు చేసిందని, ఎవరైనా రైతులు ఏ కారణంతో మరణించినా రూ. 5 లక్షల బీమా పరిహారం బాధిత కుటుంబానికి అందిస్తోందని పేర్కొంది. రైతు బీమా పథకం ప్రీమియంగా రూ. 1,455 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది.

Read More