కిశోర బాలికలు, మహిళల్లో చాలామంది ఇప్పటికీ రక్తహీనతతో బాధపడుతున్నారు. ఐరన్‌ ఎక్కువగా ఉండే మునగ ఆకులను నేరుగా లేదంటే పొడిరూపంలో ఆహారంతో పాటు తీసుకుంటే ఆ సమస్య దరిచేరదు. ఈ నేపథ్యంలో సదరు విటమిన్‌ పుష్కలంగా ఉండే మునగపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దృష్టిసారించింది. మేలైన మునగ జాతి మొక్కల సాగు పెంపునకు చర్యలు చేపట్టింది. అందుకు ప్రకాశం జిల్లా దర్శిలోని ఉద్యాన పరిశోధనా స్థానంలో చేసే పరిశోధనలకు తోడ్పాటు అందించనుంది. డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దర్శి పరిశోధనా స్థానం నడుస్తుంది. మునగ మొక్కల్లో ‘జీవన వైవిధ్యం, పంటల అభివృద్ధి, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ’ అనే అంశంపై 2023లోనే ఇక్కడ పరిశోధనలు మొదలయ్యాయి. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ. 102 కోట్లు కేటాయించింది. దీంతో మునగపై పరిశోధనలు మరింత ఊపందుకున్నాయి.

తమిళనాడులో వాడకం, సాగు అధికం
తమిళనాడులో మునగ ఆకులతోపాటు పొడిని పప్పులు, ఇతర కూరల్లో విరివిగా వాడతారు. బిస్కెట్ల రూపంలోనూ తింటారు. ఆ రాష్ట్రంలోని పెరియాకులం ఉద్యాన కళాశాల వారు 90ల లోనే పరిశోధనలు ప్రారంభించారు. పీకేఎం1, పీకేఎం2 అనే మునగ వంగడాలను ఉత్పత్తి చేయగా.. అక్కడ సాగు విస్తీర్ణం పెరిగింది. ఆ విత్తనాలనే తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటకలోని రైతులూ సాగు చేస్తున్నారు.

ఇప్పటికే 44 జన్యు రకాల పరిశీలన
తమిళనాడు, కర్ణాటకతో పాటు వేర్వేరు ప్రాంతాల నుంచి 44 జన్యురకాల మునగ మొక్కలను తెచ్చి దర్శిలో నాటారు. వాటి ఆకులు, కాయలపై పరిశోధన చేస్తున్నారు. అవసరం మేరకు సంకరణం చేసి నాణ్యమైన, అధిక దిగుబడి వచ్చే ఆకులను ఉత్పత్తి చేసే వంగడాలను సృష్టిస్తారు. వీటిని రైతులకు పంపిణీ చేస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. తొలుత మేలుజాతి మునగ వంగడాల సృష్టి, తర్వాత విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, చివరిథలో ఆయా ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్న గూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయంలో తయారు చేసిన మునగ ఆకు పొడి, మాత్రలను ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అక్కడి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పటికే పంపిణీ చేశారు. ‘మునగ పొడిని ధనియాల్లా రోజూ కూరల్లో వాడినా బాలికలు, మహిళలకు సరిపడా ఐరన్‌ సమకూరుతుంది’ అని దర్శి ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త రవీంద్రబాబు తెలిపారు.