విత్తడం పూర్తయ్యి, తెలంగాణలో ఎక్కువ ప్రాంతాల్లో పత్తి పంట ప్రస్తుతం శాఖీయ పెరుగుదల నుంచి పూత, పిందె దశల్లో ఉంది. వర్షాల మధ్య పొడి వాతావరణం, ఆకస్మిక భారీ వర్షాలు, రాత్రి ఉష్ణోగ్రత మార్పులు చీడపీడల ఉధృతిని వేగంగా మారుస్తున్నాయి. కాబట్టి రైతులు క్యాలెండర్ ప్రకారం మందులు పిచికారీ చేయకుండా, చేనులో ఉన్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తక్షణ నిర్ణయాలు తీసుకోవడం అత్యంత కీలకం.

పొలంలో తప్పనిసరిగా పరిశీలించాల్సిన అంశాలు
ప్రతి 3–4 రోజులకు పత్తి చేనులో గులాబీ రంగు పురుగు (కాయ తొలచే పురుగు) లక్షణాలను తప్పనిసరిగా పరిశీలించాలి; పూత దశలో ముడుచుకున్న గులాబీ పువ్వులు కనిపిస్తున్నాయా, అలాగే 10–15 రోజుల పచ్చికాయలను కోసి చూస్తే లోపల పురుగు లేదా నల్లటి మచ్చలు ఉన్నాయా చూడాలి. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల అడుగుభాగంలో తామర పురుగులు, తెల్లదోమ ఉధృతి పెరుగుతుందనే కారణంగా ఆకులు దోనెల్లా లేదా పసుపు రంగులోకి మారుతున్నాయా గమనించాలి. అలాగే వర్షాల తర్వాత గాలిలో తేమ పెరిగినప్పుడు కాయలపై నల్లటి మచ్చలు ఏర్పడి కుళ్ళిపోతున్నాయా, కాయ కుళ్ళు లేదా బ్యాక్టీరియల్ తెగుళ్ల లక్షణాలను కూడా పరిశీలించాలి.

నాన్-బిటి విత్తనాలు వేయకపోతే ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు
విత్తనాల సమయంలో సరిహద్దు పంటలు (నాన్-బిటి పత్తి లేదా కందులు) వేయకపోవడంతో గులాబీ రంగు పురుగు నేరుగా పత్తిపై దాడి చేసే అవకాశం పెరుగుతుంది. దీనిని తగ్గించేందుకు ఎకరానికి 4–5 లింగాకర్షక బుట్టలు కట్టి, రోజుకు ఒక్కో బుట్టలో 8 కంటే ఎక్కువ రెక్కల పురుగులు పడితే ఉధృతి అధికంగా ఉన్నట్లు భావించాలి. అలాగే ఎకరానికి 10–15 పసుపు, నీలి రంగు జిగురు అట్టలను పైరు ఎత్తుకంటే కొద్దిగా పైన అమర్చడం ద్వారా రసం పీల్చే పురుగులను సుమారు 40% వరకు తగ్గించవచ్చు.

పిచికారీ వ్యూహం (MoA Rotation)
45–90 రోజుల పంటలో రసం పీల్చే పురుగుల నియంత్రణకు వేప నూనె (NSKE 5%) లేదా నింబిసిడిన్ పిచికారీ చేస్తే సాలీళ్ళు, లేడీబర్డ్ బీటిల్స్ వంటి మిత్రపురుగులు రక్షించబడతాయి. గులాబీ రంగు పురుగు ఆర్థిక నష్టపరిమితి (ETL) దాటినప్పుడు శాస్త్రీయంగా సిఫార్సు చేసిన మందులను మాత్రమే వాడాలి. అలాగే ఒకసారి వాడిన మందును తదుపరి పిచికారీలో మళ్లీ వాడకూడదు.

భారీ వర్షాలు కురిసినప్పుడు వెంటనే చేపట్టాల్సిన చర్యలు
పొలంలో నీరు నిల్వ ఉండకుండా వెంటనే మురుగునీటి కాలవలు ఏర్పాటు చేసి నీటిని బయటకు పంపాలి; లేకపోతే వేరు కుళ్ళు తెగులు వ్యాపిస్తుంది. గాలిలో ఆర్ద్రత పెరిగినప్పుడు Bacillus thuringiensis (Bt) లేదా NPV వంటి బయో-పెస్టిసైడ్స్ వాడకం మెరుగైన ఫలితాలు ఇస్తుంది.

లేట్ ఫ్లష్ (చివరి ఏరుత)లో దిగుబడి తగ్గకుండా పురుగు నియంత్రణ వ్యూహం
చాలామంది రైతులు డిసెంబర్–జనవరిలో వచ్చే చివరి ఏరుత ద్వారా అదనపు ఆదాయం ఆశించినా, ఈ దశలో గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మందుల మోతాదు పెంచి అధిక ఖర్చు చేయకుండా, PB-Rope లేదా లింగాకర్షక బుట్టల్లో ల్యూర్‌లు మార్చి మగ పురుగులను ఆకర్షించడం ద్వారా సంతానోత్పత్తిని తగ్గించాలి. కాయ తొలిచే దశలోనే తక్కువ ఖర్చుతో జీవ నివారణ పద్ధతులు లేదా సిఫార్సు చేసిన స్ప్రేలు వాడాలి. చివరి ఏరుత అనంతరం పత్తి కట్టెలను పొలంలో వదలకుండా రొటోవేటర్ లేదా షెడ్డర్‌తో తుంచితే మిగిలిన పురుగులు, కోశస్థ దశలు నశించి తదుపరి పంటకు పొలం పరిశుభ్రంగా ఉంటుంది.

వాతావరణ మార్పుల ప్రభావం పత్తి సాగుపై స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, వాటిని అధిగమించడం రైతు చేతుల్లోనే ఉంది. అధిక రసాయన పిచికారీలు పరిష్కారం కాదు; అవి ఖర్చు పెంచి పురుగుల్లో నిరోధక శక్తిని పెంచుతాయి. శాస్త్రీయ పర్యవేక్షణ (ETL), లింగాకర్షక బుట్టల వినియోగం, సకాలంలో మందుల మార్పిడి, పొలం పరిశుభ్రత ద్వారా వాతావరణ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవచ్చు. సాంప్రదాయ పద్ధతులకంటే క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా శాస్త్రీయ నిర్ణయాలు తీసుకునే రైతు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి, ఎక్కువ లాభాలను సాధించగలడు.

“పరిస్థితులు మారినప్పుడు మన వ్యూహం మారాలి — శాస్త్రీయ పర్యవేక్షణే పత్తి రైతుకు నిజమైన రక్షణ!”.

  • జి. యశస్విని, ఎస్. కార్తీక్. 8463976019, 6301187682