పసుపు పంటకు కేంద్రం మద్దతు ధర ఇవ్వాలి: అన్వేష్‌ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి కోరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో తాను నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించానని.. అక్కడ పసుపులో తేమ శాతం చూసే యంత్రాలు లేవని తెలిపారు.

Read More

నాబార్డ్‌ స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ ఆవిష్కరణలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మార్కెటింగ్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నాబార్డ్‌ స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందించాల్సిన అవసరాన్ని బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లారు. పశుపోషణ, మత్స్యపరిశ్రమ, కృషి ఆధారిత పరిశ్రమలు వంటి రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పోషకాహార భద్రతను మెరుగుపరచడం కోసం చిరుధాన్యాల సాగు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల అన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తి, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, నాబార్డ్‌ తెలంగాణ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ బి. ఉదయ భాస్కర్‌ , ప్రతినిధులు, బ్యాంకింగ్‌ రంగ ప్రముఖులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More

మహబూబ్‌నగర్‌లో రైతు సదస్సు

ఈనెల 28, 29, 30 తేదీల్లో తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్వహించే రైతు పండుగ విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలసి పనిచేయాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, దామోదర్‌ రాజనర్సింహ లు అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈనెల 28,29,30 తేదీలలో నిర్వహించే రైతు సదస్సు ఏర్పాట్లపై నేడు సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహా, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యకక్షులు డాక్టర్‌ చిన్నారెడ్డి, తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ఎం. కోదండ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌, కలెక్టర్లు, ఎస్‌.పి లు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మరే రంగానికి లేని విధంగా వ్యవసాయ రంగానికి అధిక మొత్తం నిధులు కేటాయించిందని, ముఖ్యంగా రైతు రుణమాఫీతో రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గంలో కనీసం 20 వేల మంది నుండి 30 వేల మంది రైతులకు లబ్ది చేకూరిందని గుర్తు చేశారు. రైతులకు పెద్ద ఎత్తున చేకూరిన ఈ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు, వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, ఆదర్శ రైతుల ప్రసంగాలు, ఈ రైతు సదస్సులో ప్రధాన అంశాలుగా ఉంటాయని తెలిపారు. ఈనెల 28 న ఉదయం 10 గంటలకు ఈ రైతు సదస్సు ప్రారంభమవుతుందని, ఈ మొదటి రోజు సదస్సుకు ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన రైతులు హాజరవుతారని, ఈ ప్రారంభ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా తాను ప్రారంభిస్తానని, ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు హాజరవుతారని తుమ్మల చెప్పారు. రెండోరోజైన 29 న మహబూబ్‌ నగర్‌ జిల్లాయేతర ప్రాంతాలనుండి రైతులు హాజరవుతారని, 30న రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుండి కనీసం లక్ష మంది రైతులు ఈ రైతు సదస్సుకు హాజరవుతారని వివరించారు. మొదటి రెండు రోజులు ప్రతీ రోజు 5000 మంది రైతులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 30వ తేదీన సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.
ఈ మూడు రోజులు రైతు సదస్సు వేదికపై ఆదర్శ రైతులచే ప్రసంగాలు, ఆధునిక వ్యవసాయ విధానాలపై వివరణలు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ మత్స్య తదితర రంగాలకు చెందిన ఆదర్శ రైతులచే ప్రసంగాలు, విజయగాధలపై వీడియో ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. ఒక్కొక్క పంటకు సంబంధించి ఒక్కొక్క ఆదర్శ రైతును గుర్తించి వారి అనుభవాలు ఈ సదస్సులో వివరిస్తారని మంత్రి తెలిపారు.
ఆధునిక వ్యవసాయ యంత్ర సామాగ్రి, వివిధ రకాల పంట రీతులు, హైబ్రిడ్‌ వంగడాలు, ప్రభుత్వం అమలుచేస్తున్న పలు పథకాలపై ప్రదర్శన స్టాళ్ళను సంబంధిత శాఖలు ఏర్పాటు చేస్తాయని తెలిపారు. ఈ మూడురోజుల కార్యక్రమాలను రాష్ట్రంలోని 560 రైతు వేదికల ద్వారా లైవ్‌ ప్రసారం చేయాలని వ్యవసాయ శాఖా మంత్రి ఆదేశించారు. ఈ రాష్ట్ర స్థాయి సదస్సుకు వాహనాల పార్కింగ్‌, ట్రాఫిక్‌, స్టాళ్ళ ఏర్పాటు, రైతులకు అవగాహన తదితర కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.
ఈ సమీక్ష సమావేశానికి ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కె.దామోధర్‌ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు డా. శ్రీహరి, మేఘా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీ కృష్ణ, పర్ణీక రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస రాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, జిఏడీ కార్యదర్శి రఘునందన్‌, టిజిఎస్‌పిడిసిఎల్‌ సియండి ముషారఫ్‌ అలీ ఫరూఖీ, సమాచార శాఖ స్పెషల్‌ కమీషనర్‌ హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More

రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ కంపెనీల పురోగతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష

ఆయిల్‌ పామ్‌ సాగులో తెలంగాణా రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచాలని, పురోగతి చూపించని కంపెనీలపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు.
తీరుమార్చుకొని కంపెనీల అనుమతులు రద్దు చేసి, టిజి ఆయిల్‌ ఫెడ్‌కు కేటాయిస్తామని, వచ్చే సంవత్సరం చివరికల్లా ప్రతి కంపెనీ వారికి కేటాయించిన జోన్లలో ప్రాసెసింగ్‌ కంపెనీలు ఏర్పాటు చేయాల్సిందే అని, ఆయిల్‌ పామ్‌ సాగును లాభసాటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని, ఆయిల్‌ పామ్‌ సాగుకు కొత్త రైతులు ముందుకు రావాలని మంత్రి అన్నారు.
పలు జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన తుమ్మల పామాయిల్‌ రైతులకు అధిక ధరలను అందించి, రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగును లాభసాటిగా చేయడమే ఈ ప్రభుత్వం లక్ష్యం అని తెలియజేశారు. 
ఇప్పటికే 64,040 హెక్టార్లలో ఆయిల్‌ పాం ప్లాంటేషన్‌ చేశామని, అలాగే ప్రతి సంవత్సరం 40000 హెక్టార్లలో ఆయిల్‌ పామ్‌ సాగుచేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, దానిని సాధించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసి, ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా ప్రగతిని సమీక్షించాలని అధికారులకు సూచించారు.  
2024-25 సంవత్సరంలో 1,00,000 ఎకరాలకు ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోగా, ఇప్పటివరకు 25,470 ఎకరాలలో ప్లాంటేషన్‌ పూర్తిచేసుకున్నామన్నారు. ఈ సంవత్సరం కేటాయించిన లక్ష్యంలో  వాల్యూ ఆయిల్‌ కంపెనీ 36 %, పతాంజలి 33%, టిజి ఆయిల్‌ ఫెడ్‌ 31%, ఎకోపామ్‌ 28.5%, గోద్రెజ్‌ 26%, ప్రి యునిక్‌ 22%, మాట్రిక్స్‌ 21%, కె.ఎన్‌ బయో 19.72%, తిరుమల 16.4%, సువెన్‌ అగ్రో 16.2%, రాంచరణ్‌ 15.6%, లివ్‌ పామ్‌ 13%, విశ్వతేజ 11.5%, లోహియ 10.40 % ప్రగతిని సాధించాయని, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి కల్లా లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. 
ఆయిల్‌ పామ్‌ కంపెనీలు వారికి కేటాయించిన ఫ్యాక్టరీ జోన్లలో ఆయిల్‌ పామ్‌ గెలల ప్రాసెసింగ్‌ కర్మాగారాల ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి ఆదేశించారు. వచ్చే సంవత్సరం చివరికల్లా ప్రతి కంపెనీ తమ యొక్క ఫ్యాక్టరీ జోన్లలో ఆయిల్‌ పామ్‌ గెలల ప్రాసెసింగ్‌ కర్మాగారాల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఆయిల్‌ పామ్‌ కంపెనీ నర్సరీని కలిగిఉండాలని, లక్ష్యానికి అనుగుణంగా నాణ్యమైన ఆయిల్‌ పామ్‌ మొక్కలు ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని, నర్సరీ స్థాయిలోనే జన్యుపరమైన సమస్యలు ఉన్న మొక్కలను తొలగించి, నాణ్యమైన మొక్కలు మాత్రమే రైతులకు సరఫరా చేయాలని ఆదేశించారు. అత్యధిక గెలల దిగుబడి మరియు నూనె శాతాన్ని ఇచ్చే వంగడాలను, గ్యానో డెర్మలాంటి వ్యాధులను తట్టుకొనే వంగడాలను, తక్కువ ఎత్తు పెరిగే పొట్టి రకాలకు సంబంధించిన నాణ్యమైన మొలకలను  తెప్పించుకొని నర్సరీలలో పెంచి రైతులకు సరఫరా చేయాలన్నారు. 
ఇదివరకే నాటిన తోటలలో మొదటినుంచే కాండంతడి తెగులు (గ్యానో డెర్మ) సోకకుండా, తెగుళ్ళ నివారణకు అవసరమైన సాంకేతికత శిక్షణను రైతులకు ఆయిల్‌ పామ్‌ కంపెనీలు అందించాలని ఆదేశించారు. 
రాష్ట్ర ప్రభుత్వ కృషి వలన ప్రస్తుతం ఆయిల్‌ పామ్‌ గెలల ధర టన్నుకు రూ. 19,144 కు పెరగడం జరిగిందని, ఈ సంవత్సర కాలంలోనే టన్నుకు పామ్‌ ఆయిల్‌ గెలల ధర రూ.6000 కు పైగా పెరిగిందని, త్వరలోనే టన్ను ధర రూ. 20,000 దాటే అవకాశం ఉందని మంత్రి తెలియజేశారు. ఆయిల్‌ పామ్‌ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆయిల్‌ పామ్‌ గెలల ధర కనీసం టన్నుకు 20,000 కు తగ్గకుండా ఉండేలా ధరల స్థరీకరణ కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. 
ఈ సమీక్షాసమావేశంలో ఉద్యానశాఖ డైరెక్టర్‌ శ్రీమతి యాస్మిన్‌ భాషా, ఐ.ఎ.ఎస్‌, మరియు ఆయిల్‌ ఫెడ్‌ అధికారులు పాల్గొన్నారు. 

*వరి కొనుగోలు కేంద్రాల తనిఖీ...*
నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెల్దండ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించి, రైతులను వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పలు జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి, జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలను విధిగా సందర్శించాలన్నారు. రైతులు కూడా నాణ్యతా ప్రమాణాల ప్రకారం తేమ శాతం ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.
Read More

పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ

వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార మరియు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రధాన మంత్రి ప్రకటించిన జాతీయ పసుపు బోర్డును తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేయాలని తేది. 13.11.2024 నాడు కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కోరడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు అనేది పసుపు రైతుల చిరకాల ఆకాంక్ష అని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర పసుపు రైతుల ప్రయోజనాలపై సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పసుపు పండించే జిల్లాలలో నిజామాబాద్‌ ప్రధానమైనది. నిజామాబాద్‌ పసుపు రైతులు గత 10 సంవత్సరాల నుంచి పసుపు మద్ధతు ధర కోసం మరియు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతునే ఉన్నారని మంత్రి చెప్పారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర పసుపు రైతులను బలోపేతం చేయడం కొరకు, పసుపు సాగు విస్తీర్ణం పెంచడానికి మరియు పసుపు అనుబంధ విలువ ఆధారిత ఉత్పత్తులను తయారుచేసి, ఎగుమతి అవకాశాలు పెంచడానికి, పసుపు రైతులు కోరుకుంటున్నట్లుగా రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డును తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేసినట్లయితే పసుపు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో 3,300 ఎకరాలలో కొబ్బరి తోటలు సాగులో ఉన్నాయని, అందులో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (1757 ఎకరాలలో) మరియు ఖమ్మం జిల్లా (696 ఎకరాలలో)ల నుండే 75 శాతం కొబ్బరితోటలు సాగులో ఉన్నాయని మంత్రి తెలిపారు.
ఈ జిల్లాలలోని కొబ్బరి రైతులు కొబ్బరి ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, అక్కడ కొబ్బరితోటల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, అందుకోసం భద్రాద్రి కొత్తగూడెంలో ప్రత్యేకంగా రీజనల్‌ కోకోనట్‌ డెవలప్‌ మెంట్‌ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని లేఖ ద్వారా కోరడం జరిగింది.
కోకోనట్‌ బోర్డు ద్వారా రాష్ట్రంలోని కొబ్బరి రైతులకు అంతరపంటలు, మిశ్రమ పంటల విషయంలో, చీడ పీడల నివారణలో తగిన సాంకేతిక సలహాలు అందించడానికి అవకాశం ఉంటుందని, అదేవిధంగా కొబ్బరి రైతులలో నిర్వహణపరమైన మెళుకువలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని, అదేవిధంగా విలువ ఆధారిత ఉత్పత్తులు, నాణ్యమైన కొబ్బరి మొలకలను మరియు నూతన వంగడాలను రైతులకు అందించడానికి అవకాశం ఏర్పడుతుందని మంత్రి తెలిపారు.
అలాగే తెలంగాణలో ఇప్పటివరకు 91,200 హెక్టార్లలో పామ్‌ ఆయిల్‌ సాగు చేస్తున్నారని, ప్రతి సంవత్సరం 40,000 హెక్టార్లలో సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ప్రణాళికలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. త్వరలోనే పామ్‌ ఆయిల్‌ సాగులో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ పామ్‌ రిసెర్చీ అనేది మాత్రమే దేశంలో ఆయిల్‌ పామ్‌ పై పరిశోధనలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాల పామ్‌ ఆయిల్‌ రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయిల్‌ పామ్‌ తోటల విస్తీర్ణం పెరుగుతున్నందున, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రాంతీయ ఆయిల్‌ పామ్‌ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి, పామ్‌ ఆయిల్‌ రంగంలో రైతులకు అవసరమైన శాస్త్రీయ, సాంకేతిక సలహాలు, సూచనలు అందించాలని వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ ద్వారా కేంద్రాన్ని కోరారు.

Read More