‘పకృతి సేద్యమే మానవాళి ఆరోగ్యానికి శ్రీరామరక్ష.. దీన్ని ఒక ఉద్యమంలా ప్రతి రైతు స్వీకరించాలి’ అని గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్‌ పిలుపునిచ్చారు. వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా, భూసారాన్ని దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. లోక మంథన్‌ మహోత్సవంలో భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ‘లోక్‌జీవన్‌ మియిన్‌ విజన్‌’ అంశంపై ఆచార్య దేవ్‌వ్రత్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్‌లో పది లక్షలమందికి పైగా రైతులు, సుమారు 7.93 లక్షల ఎకరాల్లో పూర్తిగా సేంద్రియ సాగులో వ్యవసాయాన్ని సాగిస్తున్నారని, తద్వారా అధిక దిగుబడిని, రాబడిని పొందుతున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపుతో దేశంలోనే సేంద్రియ గుజరాత్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తామంతా కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. గోఆధారిత ఉత్పత్తుల ద్వారా పంటకు పట్టే చీడపీడలను నివారించవచ్చని, ఆ విషయాల మీద తమ రాష్ట్రంలో విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదే కార్యక్రమంలో వేదకాలం నాటి వైజ్ఞానిక, శాస్త్ర పరిజ్ఞానంపై డా. అనీర్‌బన్‌ బంధోపాధ్యాయ, గుజరాత్‌ యూనివర్సిటీ వీసీ ప్రొ. నీరజ గుప్తా కీలకోపన్యాసం చేశారు.