మన తెలుగు రాష్ట్రాలలో ఖరీఫ్లో పండించే పంటలలో వరి ప్రధాన పంట. వరిని ఖరీఫ్ పంటగా ఆంధ్రప్రదేశ్లో 12.5 లక్షల హెక్టార్లలో మరియు తెలంగాణలో 25.8 లక్షల హెక్టార్లలో పండిస్తున్నారు. రసాయన సేద్యంతో నష్టపోయిన రైతులు అధిక శాతం ప్రకృతి వ్యవసాయంలోకి మళ్లుతున్నారు గోఆధారిత సహజ ఎరువులు వాడుతూ ప్రకృతిలో లభ్యమయ్యే సహజ కషాయాలతో రైతులు భూసారాన్ని కాపాడుకుంటూ, చీడపీడల బెడద నుంచి ఉపశమనం పొందుతున్నారు. రాబోయే ఖరీఫ్లో వరి పంటలో పాటించవలసిన సహజ ఎరువుల వినియోగం మరియు రసాయన రహిత సస్యరక్షణ పద్ధతులను గురించి తెలుసుకుందాం.
1) వరి పంట పండించే ముందర మే నెలలో భూసారాన్ని మరియు కర్బన శాతం పెంచే పచ్చిరొట్ట పేర్లను (అపరాలు, జనుము, జీలుగ, పిల్లిపెసర, గడ్డిజాతి పంటలను) వేసుకుని 40-75 రోజుల వ్యవధిలో కోసుకుని భూమిలో కలియదున్నటం ద్వారా లేదా తినడానికి పశువుల మేతగా వాడుకోవచ్చు.
2) వరిలో తక్కువ కాలపరిమితి, అధిక దిగుబడినిచ్చే రకాలను ఎన్నుకుని ఖరీఫ్ లో వేసుకుంటే, రబీ వరి పంటకు తొందరగానే వెళ్ళవచ్చు. ఆలస్యమైనచో రబీలో అకాలవర్షాలు మరియు వడగండ్ల బెడద ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి రబీలో కూడా తక్కువ కాలపరిమతి రకాలు నవంబర్ లో వేసుకుని, తొందరగా పంట కోత తీయవచ్చు. ఈ పద్ధతిలో ప్రకృతి వైపరీత్యాలు తప్పించుకునే అవకాశం ఉంది.
3) బీజామృతంతో విత్తనశుద్ధి, నారుమడి శుద్ధి 5 లీటర్లు / 25-30 కిలోల విత్తనానికి, నారుమడికి వాడవచ్చు. ఈ పద్ధతి భూమిలో సూక్ష్మ జీవులను పెంచడంతో పాటు, విత్తనాలను, మొక్కలను చీడపీడల నుంచి కాపాడతాయి.
4) నీటిపారుదల క్రింద వరిని వరుసలలో విత్తే పద్ధతి, డ్రం సీడర్ పద్ధతిలో లేదా శ్రీ పద్ధతిలో వేసుకుంటే మంచిది. వర్షాధారంగా వేసే వరిలో నేరుగా వరుసలలో విత్తే పద్ధతిని (డైరెక్ట్ సీడింగ్) అనుసరించాలి. ఈ పద్ధతులలో భూమి అతి తక్కువగా కదుపబడుతుంది.
సహజ ఎరువుల యాజమాన్యం
1000-1500 కిలోల ఘన జీవామృతం కలిపిన పశువుల ఎరువు ఎకరానికి దుక్కిలో లేదా కరిగడిలో వేసుకోవాలి. అచ్చం ఘనజీవామృతాన్ని ఎకరానికి 400 కిలోలు రెండు సార్లుగా నాటిన 20 రోజులకీ, 40 రోజులకి వేసుకోవాలి. తరువాత ద్రవజీవామృతమును ఎకరానికి 800 లీటర్లు నాలుగు సార్లు నాటిన 30, 50,65 మరియు 80 రోజులకు సమభాగంగా చేసి (200 లీటర్లు ప్రతిసారి) భూమికి అందజేయాలి. పైపాటుగా 50 లీటర్ల ద్రవజీవామృతాన్ని 100 లీటర్ల నీటికి కలిపి నాలుగు సార్లు నాటిన 20, 35, 50 మరియు 65 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి.
గోఆధారిత సహజ ఎరువులతో పాటు, అజోల్లా ఎకరానికి 10-15 కిలోలు నాటిన 7 రోజులకు వేసిన ఎడల నత్రజని స్థిరీకరణతో పాటు కలుపు నివారణ కూడా జరుగుతుంది, సేంద్రీయ ఆచ్ఛాదన (మల్చ్) వలె ఉపయోగపడుతుంది, నీటి అవసరాన్ని తగ్గించి భూమిలో కర్భన శాత వృద్ధికి తోడ్పడుతుంది.
పంట ఎదుగుదల మరియు పిలకల అభివృద్ధికి, పంచగవ్య ఎకరానికి నాలుగు లీటర్లు పిలక థలో, సప్తధాన్యాంకుర కషాయం 250 మి.లీ. 100 లీటర్ల నీటికి కలిపి గింజ పాలు పోసుకునే థలో పిచికారీ చేస్తే, గింజ నాణ్యత మరియు దిగుబడి పెరుగుతుంది.
సస్యరక్షణ పద్ధతులు (రసాయన రహిత)
వరి పంట నాటే సమయంలో మొక్కల కొనలు తుంచుకోవాలి. పొలంలో ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ వెడల్పున తూర్పు – పడమర దిశగా కాలిబాటలు (అల్లీస్) ఏర్పాటు చేసుకోవాలి. గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి. బంతి / కంది / మొక్కజొన్న / కూరగాయలతో పాటు. గ్లైరిసీడియా వంటి మొక్కలను గట్ల మీద మరియు కంచే పంటగా వేసుకోవాలి. పసుపు పచ్చ జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు, పక్షి స్థావరాలు, లైట్ ట్రాప్స్ (దీపపు ఎరలు) అమర్చడం వంటి పద్ధతులను అనుసరించాలి. మురుగు నీరు నిలువకుండా చూసుకోవాలి. ఇతర పంటల అవశేషాలు ఉంటే తొలగించాలి.
వరి పంటను ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణకు పాటించవలసిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు
పురుగుల నివారణ:
కాండం తొలుచు పురుగు: నాటేటప్పుడు ఆకుల కొనలు తుంచడం, ట్రైకోగ్రామా గుడ్ల పరాన్నజీవులను ఎకరానికి నాలుగు కార్డుల చొప్పున 25వ రోజునుండి ప్రతి 10 పదిరోజులకు ఒక్కసారి చొప్పున 5సార్లు వదలాలి.
ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను పెట్టాలి. ముందు జాగ్రత్త చర్యగా ఎకరానికి 200 లీటర్ల నీమాస్త్రం పిచికారీ చేయాలి. పురుగు నివారణకు 5% వేప కషాయం (శ్రీఐచజూ) 5 లీటర్లు 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. పిలక థలో మరియు అంకురం థలో 3 లీటర్ల అగ్నాస్త్రంను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఆకుముడుత పురుగు: తాడుతో మొక్కలపై లాగడం ద్వారా ఆకు గూడులు, పురుగులు పడిపోతాయి. ఎకరానికి ఒక లైట్ ట్రాప్ (దీపపు ఎర)ను అమర్చుకోవాలి. 5% వేప కషాయం లేదా నీమాస్త్రం పంట తొలిథలో ఎకరానికి 200 లీటర్లు పిచికారీ చేయాలి.
సుడిదోమ: పొలంలో కాలిబాటలు తప్పనిసరిగా తీయాలి. పసుపు పచ్చ మరియు తెల్లని జిగురు అట్టలు, ఎకరానికి 20-25 చొప్పున అమర్చాలి. తూటికాడ కషాయం 5-6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి మొక్కల పాదుల దగ్గర పిచికారి చేయాలి. పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి.
ఉల్లికోడు: ఎకరానికి ఒక లైట్ ట్రాప్ (దీపపు ఎర)ను అమర్చుకోవాలి. అగ్నాస్త్రం 5 లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
తాటాకు తెగులు (హిస్పా): నాటేటప్పుడు ఆకుల కొనలు తుంచి నాటుకోవాలి. తొలిథలో ఎకరానికి 200 లీటర్ల నీమాస్త్రం పిచికారీ చేయాలి. తరువాత థలో ఎకరానికి 6 లీటర్ల బ్రహ్మాస్త్రం 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.
వరి ఆకు నల్లి: గట్ల మీద బంతి మొక్కలు నాటుకోవాలి. పంట మీద ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన ఐదు లీటర్ల కషాయం వంద లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.
పచ్చదోమ: పసుపు మరియు తెల్లని జిగురు అట్టలు, ఎకరానికి 20-25 చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి ఒక లైట్ ట్రాప్ (దీపపు ఎర) ను పెట్టాలి. ఎకరానికి 5 లీటర్ల వావిలాకు కషాయాన్ని 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.
కంపునల్లి (గంధీ బగ్): ఉదయం పూట ఎకరానికి 5% వేప కషాయం 5 లీటర్లు లేదా అగ్నాస్త్రంను 3 లీటర్లు చొప్పున 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.
తెగుళ్ల నివారణ:
అగ్గి తెగులు: బీజామృతంతో విత్తనశుద్ధి చేయాలి. గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. మారేడు పత్రం మరియు తులసి ఆకుల కషాయాన్ని ఎకరానికి 6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి లేదా ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి. పులిసిన మజ్జిగ 6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.
పొడ తెగులు: పొలంలో నీరు తక్కువగా ఉంచాలి. ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన ఐదు లీటర్ల కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి లేదా పులిసిన మజ్జిగ 6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.
బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు: ఎండిన అల్లం మరియు పాలతో కూడిన కషాయం 6 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి. తరువాత ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.
కాండం కుళ్ళు తెగులు: మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. బీజామృతంతో విత్తనశుద్ధి, నారుశుద్ధి చేయాలి. పైన వివరించిన విధంగా ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువలతో చేసిన కషాయాన్ని వాడి తెగులును నివారించవచ్చు.
టుంగ్రో వైరస్ తెగులు: గట్ల మీద కలుపు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎకరానికి ఒక లైట్ ట్రాప్ (దీపపు ఎర)ను అమర్చుకోవాలి. 5% వేప కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.
ఆకుమచ్చ తెగులు: పులిసిన మజ్జిగ 6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.
మానిపండు తెగులు: వరినాట్లు సకాలంలో వేసుకోవాలి. ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.
పైన వివరించిన కొన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్లో భాగంగా రైతు సాధికార సంస్థ వారు రూపొందించిన ప్రణాళికలోని అంశాల నుంచి వారికి కృతజ్ఞతలతో సేకరించడమైనది. ఈ పద్ధతులు కొన్ని వ్యవసాయ పరిశోధన పరంగా ద్రువీకరించబడాలి. సేంద్రియ రైతులు స్వతహాగా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నారు. రసాయన రహిత పద్ధతులు కావున పంటలకు నష్టం ఉండదు. నాణ్యత గల దిగుబడులు సాధించడానికి దోహదపడతాయి.
డా. ఎస్.ఎమ్. విద్యాశేఖర్, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్, ఫోన్: 98494 42221; డి.ఎల్.ఏ. గాయత్రి, ఎమ్. శ్రీనివాసరావు, వి.కే. సింగ్, కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ, హైదరాబాద్ మరియు రైతు సాధికార సంస్థ, వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో.