భారతదేశం దిగుమతి చేసుకునే వివిధ రకాల నూనెలలో 80% భాగాన్ని పామ్‌ఆయిల్‌ ఆక్రమించింది. థాయ్‌లాండ్‌, ఇండోనేసియా, మలేషియా, కొలంబియా, నైజీరియా దేశాలలో పామాయిల్‌ విరివిగా సాగు చేసి మన దేశంతో సహా ఇతర దేశాలకు పామాయిల్‌ను ఎగుమతి చేస్తున్నాయి. ఈ పరిస్థితిని నిలువరించడానికి జాతీయ ఆహార భద్రతా మిషన్‌ క్రింద పామాయిల్‌ సాగు ప్రోత్సహిస్తుంది. దేశంలో 3.7 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగు చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో 1.85 లక్షల ఎకరాలకు ఈ పంట విస్తరించి పామాయిల్‌ సాగులో మొదటి స్థానంలో ఉంది. విస్తరిస్తున్న సాగుతో పాటు పామాయిల్‌ ఉత్పత్తి సైతం పెరుగుతూ వివిధ రకాల ఉపఉత్పత్తులు వ్యర్థాలు పామాయిల్‌ పరిశ్రమల నుండి లభ్యమవుతున్నాయి.

పామ్‌ గెలల నుండి ఆయిల్‌ను వేరు చేసే ప్రక్రియలో 10-12% నూనె ఉత్పత్తి కాగా మిగిలిన 80-90% ఉపఉత్పత్తులుగా మరియు వ్యర్థాలుగా లభిస్తున్నాయి. ఖాళీ గెలలు 20-25%, పామ్‌ గుజ్జు పీచు 12-15%, విత్తనం – 25-30%, విత్తనంపై పెంకు – 5% గా ఉండి మిగిలిన భాగం నీటిలో కరిగే వ్యర్థాల రూపంలో బయటకు విడుదల అవుతుంది. పామ్‌ గింజల నుండి వచ్చే నూనెను పామ్‌ కెర్నల్‌ నూనెగా మరియు నూనె తీయగా మిగిలిన చెక్కను పామ్‌ కెర్నల్‌ కేకుగా పిలుస్తారు. ఈ పామ్‌ కెర్నల్‌ కేకులో ఎక్కువ ప్రొటీను శాతం (30-35% సిపి) ఉండి పశువులకు మేపడానికి అనుకూలంగా ఉంటుంది. పామాయిల్‌ మడ్డి అనేది పామ్‌ ఆయిల్‌ మిల్లు నుండి వచ్చే వ్యర్థం (Palm Oil Mill Effluent-POEM)లోని నీటిని వేరు చేయగా మిగగిలిన ఘనపదార్థం. ఈ POEMలో పామ్‌ గెలల పీచు, గుజ్జు పీచు, పెంకులు, ఇతర పదార్థాలు, నీరు, నీటిలో కరిగే పదార్థాలు ఉంటాయి. నేరుగా బయటకు వదిలినట్లయితే ఈ ఆంజూఖ నేల పైన పొరలను ఏర్పరిచి భూమి యొక్క సారాన్ని హరిస్తుంది. ప్రాసెస్‌ చేసి నీటిని వేరు చేసి మిగిలిన వ్యర్థాన్ని వివధ రకాలుగా వినియోగిస్తూ ఉంటాయి. ఈ ఆంజూఖ మరియు పామాయిల్‌ మడ్డిని బయోఫర్టిలైజర్‌ (జీవ ఎరువు)గా, వానపాముల ఎరువు తయారీకి, సూక్ష్మశైవలాల ఉత్పత్తికి, బయోడీజిల్‌, బయోగ్యాస్‌ ఉత్పత్తికి అనుకూలం. కానీ కొన్ని ప్రాంతాలలో ఈ మడ్డినే అవగాహన లేని రైతులకు పామ్‌ కెర్నల్‌ కేకుగా విక్రయిస్తూ ఉంటారు.

అనేక రకాల వ్యర్థాలు, ఉపఉత్పత్తులు, రసాయనాలు ఉండటం చేత ఈ మడ్డిని ప్రాసెస్‌ చేసిన తరువాత మాత్రమే పశువులకు ముఖ్యంగా పందులకు, కోళ్ళకు మేపుకోవడానికి అనుకూలం. ఇటీవలి కాలంలో కొందరు పాడి రైతులు అతి తక్కువ రేటుకు ఎక్కువ మొత్తంలో లభ్యం అయ్యే ఈ మడ్డి పదార్థాన్ని పశువుల మేతగా వాడుతూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. విడుదల అయ్యే పదార్థాలను బట్టి ఈ మడ్డిలోని పోషక విలువలు మారుతూ ఉంటాయి. 

థాయ్‌లాండ్‌ మలేషియా దేశాలలో జరిగిన పరిశోధనల ప్రకారం ఈ మడ్డిలోని పోషక విలువలు – ఘన పదార్థాం – 90-92%,  బూడిద – 10-12%, ప్రోటీను – 8-10%, క్రొవ్వులు – 18-20%, పీచు పదార్థం – 17-19%.

ఈ క్రూడ్‌ మడ్డిని వివిధ రకాల బాక్టీరియా, ఫంగస్‌లతో పెర్మెంట్‌ చేయడం వలన దీనిలోని పోషక విలువలు (ప్రోటీను పెరగడం, పీచు పదార్థం తగ్గడం) పెరిగి పందులకు, కోళ్ళకు మేతగా వినియోగించవచ్చు.

ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల ప్రకారం పాడి పశువులకు ఇచ్చే దాణాలో గరిష్టంగా 10% క్రూడ్‌ మడ్డి 20% వరకు ప్రాసెస్‌ (ఫెర్మెంటెడ్‌) మడ్డి వాడటం శ్రేయస్కరం 5 కిలోల దాణా అందించే పశువులకు గరిష్టంగా 1 కిలో మడ్డి వరకు మేపవచ్చు. కానీ కొందరు అతి తక్కువ రేటుకు ఎక్కువ మొత్తంలో లభ్యం అవుతుండటం వలన రోజుకు 5-6 కిలోలు ఒక పశువుకు మేపుతున్నారు. ఈ విధంగా మేపడం వలన ఈ మడ్డిలో ఉండే క్రొవ్వులు పశువు తినే గడ్డిపై పేరుకు పోయి సూక్ష్మజీవుల ద్వారా జరిగే అరుగుదలను ప్రభావితం చేస్తాయి. అంతేకాక ఈ మడ్డిని మేపినపుడు పాలలో వెన్నశాతం తాత్కాలికంగా పెరిగినప్పటికీ పాలనాణ్యత తగ్గుతుంది. మరియు పశువులు తిరగ కట్టడం, ఈసుకు పోవడం, అజీర్తి చేయడం వంటి అనారోగ్య లక్షణాలు గమనించవచ్చు.

  •  పామాయిల్‌ మడ్డిని ప్లాస్టిక్‌ డ్రమ్ములలో గరిష్టంగా 7 రోజులు నిలువ చేసుకొని మేపుకోవచ్చు. దీని నిలువ కాలం మడ్డిలో ఉండే తేమ శాతంపై ఆధారపడి ఉంటుంది.
  •  చెడిపోయిన, బూజు పట్టిన, దుర్వాసన వెదజల్లే మడ్డిని పశువుకు మేపడం ద్వారా వివిధ రకాల విషాలు పశువు కాలేయం పనితీరును దెబ్బతీయడంతో పాటు పాలలో సైతం దుర్వాసన మరియు టాక్సిన్‌ అవశేషాలుగా విడుదల అవుతుంటాయి.
  •  మోతాదుకు మించి మేపడం వలన పశువు గడ్డి, దాణా తగినంతగా తీసుకోలేకపోతుంది. 
  •  పామాయిల్‌ మడ్డి ఎక్కువగా మేపిన గేదెల నుండి వచ్చే పాలను తీసుకున్న వారు కూడా అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.

కావున రైతులు ఈ సమస్యలను పరిగణలోకి తీసుకొని నిపుణుల సలహా మేరకు మాత్రమే ఈ పామాయిల్‌ మడ్డిని పశువులకు మేపుకోవాలి.

ఆర్‌.కె. సౌజన్య లక్ష్మి, (ఫోన్‌: 90306 65100), సైంటిస్ట్‌ కృషి విజ్ఞాన కేంద్రం, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, లాం, గుంటూరు – 522034. డా. యం. యుగంధర్‌ కుమార్‌, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ ఞ హెడ్‌, కె.వి.కె. గుంటూరు.