గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం

     గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తోంది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనాధారంలో పశుపోషణకు ముఖ్యమైన స్థానం ఉంది. వ్యవసాయంతో పాటు పశువులను పెంచడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. గతంలో పశుపోషణ సంప్రదాయ పద్ధతులపై ఆధారపడగా, ప్రస్తుతం డిజిటల్ సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఈ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, డిజిటల్ యాప్‌లు, ఆన్‌లైన్ సేవలు వంటి సాంకేతిక సాధనాలు రైతులకు పశువుల సంరక్షణ, ఆరోగ్య నిర్వహణ, మార్కెటింగ్ మరియు ఆర్థిక లావాదేవీలలో సహాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం రైతుల జీవితాలను సులభతరం చేస్తూ, వారి ఆదాయాన్ని పెంచే దిశగా కీలక పాత్ర పోషిస్తోంది.

పశువులకు డిజిటల్ గుర్తింపు (RFID ట్యాగింగ్):
ప్రతి పశువు చెవికి ప్రత్యేకమైన డిజిటల్ కోడ్ కలిగిన ట్యాగ్‌ను (RFID – Radio Frequency Identification) అమర్చుతున్నారు. దీని ద్వారా పశువు పుట్టిన తేదీ, యజమాని వివరాలు, ఇచ్చిన టీకాలు, మరియు ఆరోగ్య చరిత్రను కేంద్ర ప్రభుత్వ నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ (NDLM) డేటాబేస్ లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇది పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి మరియు నకిలీ పశువులను గుర్తించడానికి సహాయపడుతుంది.

పశువుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ- డిజిటల్ టెక్నాలజీ వల్ల వచ్చిన ముఖ్యమైన మార్పుల్లో పశువుల ఆరోగ్య పర్యవేక్షణ ఒకటి.

  • ప్రస్తుతం పశువులకు స్మార్ట్ కాలర్లు లేదా చెవులకు అమర్చే సెన్సర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి పశువుల శరీర ఉష్ణోగ్రత, కదలికలు, ఆహారం తీసుకునే విధానం వంటి విషయాలను నిరంతరం గమనిస్తాయి.
  • పశువులో ఏదైనా అసాధారణ లక్షణం కనిపిస్తే వెంటనే రైతు మొబైల్‌కు సమాచారం చేరుతుంది. దీంతో వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయవచ్చు. ఫలితంగా పశువుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వైద్య ఖర్చులు కూడా తగ్గుతాయి.
  • మన దేశంలో కొన్ని AI ఆధారిత వ్యవస్థలు మాస్టైటిస్, లంపీ స్కిన్ డిసీజ్ వంటి వ్యాధులను కూడా ముందుగానే గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

పాల ఉత్పత్తి మరియు విక్రయాలలో డిజిటలైజేషన్:
పాల సేకరణ కేంద్రాలలో ‘ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్’ (AMCU) వచ్చాయి. వీటి ద్వారా పాలు ఎన్ని ఉన్నాయి, వాటిలో నాణ్యత (ఫ్యాట్ శాతం) ఎంత ఉందో క్షణాల్లో తెలిసిపోతుంది. రైతు ఖాతాలో నేరుగా డబ్బులు జమ కావడం వల్ల పారదర్శకత పెరుగుతుంది.

  • డిజిటల్ పరికరాలు పశువుల ఉత్పాదకతను కూడా పెంచుతున్నాయి. పశువులు ఎంత మేత తింటున్నాయి, ఎప్పుడు మేత ఇవ్వాలి, సంతానోత్పత్తికి సరైన సమయం ఎప్పుడు అనే విషయాలను ఇవి గుర్తించగలవు. అలాగే పాల ఉత్పత్తికి సంబంధించిన వివరాలను కూడా విశ్లేషించగలవు.
  • దీంతో ప్రతి పశువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం సాధ్యమవుతుంది. ఫలితంగా పాల ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం కూడా మెరుగుపడుతోంది.

కృత్రిమ గర్భధారణ (AI) మరియు సంతానోత్పత్తి యాప్‌లు:
పశువుల ఈత సమయం, ఎదకు వచ్చే సమయం కచ్చితంగా తెలిస్తేనే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. దీని కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌లు వచ్చాయి. ఇవి పశువుల ఆరోగ్య చక్రంను పర్యవేక్షించి, రైతులకు సరైన సమయానికి సూచనలు పంపుతాయి.

రైతుల చేతిలో స్మార్ట్‌ఫోన్ శక్తి- నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ రైతులకు ఒక ముఖ్యమైన సాధనంగా మారింది.
మొబైల్ యాప్‌ల ద్వారా రైతులు పశువైద్యుల సలహాలు పొందవచ్చు. టెలీమెడిసిన్ సేవలను ఉపయోగించవచ్చు. వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. వ్యాధులపై హెచ్చరికలు పొందవచ్చు. మార్కెట్ ధరలు తెలుసుకోవచ్చు. అలాగే పశువులు లేదా పాల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు. టీకాలు వేయాల్సిన తేదీలు, మందులు ఇవ్వాల్సిన సమయాల గురించి కూడా యాప్‌లు గుర్తు చేస్తాయి.

వ్యాధుల నియంత్రణలో డిజిటల్ టెక్నాలజీ పాత్ర
పశువుల ప్రవర్తనలో ఏదైనా అసాధారణ మార్పు కనిపిస్తే డిజిటల్ పరికరాలు వెంటనే హెచ్చరికలు పంపిస్తాయి. దీంతో వ్యాధులు ఎక్కువగా వ్యాపించకముందే అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పశువుల మరణాలు తగ్గడమే కాకుండా రైతులు ఆర్థిక నష్టాల నుంచి కూడా రక్షించబడతారు.

పశువైద్య సేవలు – ఈ-సంజీవని:
దూర ప్రాంతాల్లోని రైతులకు పశువైద్యుల సలహాలు, సూచనలు అందించడానికి టెలి-మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. స్థానిక వైద్యాధికారులు అందుబాటులో లేనప్పుడు, స్మార్ట్ ఫోన్ ద్వారా వీడియో కాల్స్ చేసి వ్యాధులను నిర్ధారించి, చికిత్స అందించవచ్చు.

మార్కెట్ అవకాశాల విస్తరణ- డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల రైతులు తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలుదారులకు విక్రయించే అవకాశం పొందుతున్నారు.
దీంతో మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఉత్పత్తులకు సరైన ధర లభిస్తుంది. మార్కెట్ సమాచారం సులభంగా అందుతుంది. కొత్త వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయి. అలాగే డిజిటల్ చెల్లింపుల వల్ల డబ్బు లావాదేవీలు మరింత సురక్షితంగా, వేగంగా జరుగుతున్నాయి.

పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు
డిజిటల్ టెక్నాలజీ వినియోగం వల్ల యాంటీబయాటిక్స్ అవసరానికి మించి వాడాల్సిన అవసరం తగ్గుతుంది. నీరు, మేత వంటి వనరుల వృథా తగ్గుతుంది. పర్యావరణంపై ప్రభావం కూడా తగ్గుతుంది. దీంతో అందుబాటులో ఉన్న వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు
అయితే ఈ మార్పుల మధ్య కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఇంకా పూర్తిగా అందుబాటులో లేకపోవడం. డిజిటల్ పరిజ్ఞానం కొంతమందికి తక్కువగా ఉండటం. ఆధునిక పరికరాల ధరలు ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల రైతులందరూ ఈ సాంకేతికతను పూర్తిగా వినియోగించలేకపోతున్నారు.
అందుకే రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం చాలా అవసరం. ఈ దిశగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి.

ముగింపు
డిజిటల్ టెక్నాలజీ సంప్రదాయ పశుపోషణ పద్ధతులను తొలగించడం లేదు. వాటిని మరింత మెరుగుపరుస్తోంది. రైతుల అనుభవానికి ఆధునిక సాంకేతికత తోడవడంతో పశుపోషణ మరింత సులభంగా, సమర్థవంతంగా మారుతోంది. ఆరోగ్యకరమైన పశువులు, అధిక ఆదాయం, బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో పశుపోషణలో డిజిటల్ సాధనాలు కూడా భూమి, నీరు, మేతల మాదిరిగానే అవసరమైనవిగా మారనున్నాయి.
ఈ డిజిటల్ విప్లవం కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం వల్ల పాడి రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయి. యువత కూడా ఈ ఆధునిక పశుపోషణ పట్ల ఆసక్తి చూపుతున్నారు.

డా. బద్దం అఖిల (ఎం.వి.ఎస్‌సి.),
డా. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. Ph: 9703121088

Read More

శాస్త్రీయ పద్ధతుల ద్వారా పశువుల ఎంపిక

రైతు సోదరులు, పశుపోషణలో సరైన జంతువులను ఎంపిక చేసుకోవడం అనేది లాభనష్టాలను శాసించే అత్యంత ముఖ్యమైన నిర్ణయం. నాణ్యమైన, ఆరోగ్యకరమైన పశువులను శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఎంపిక చేసుకోవాలి.

  1. పాడి పశువుల ఎంపిక (ఆవులు మరియు గేదెలు)
    పాడి పరిశ్రమలో అధిక పాల దిగుబడి మరియు నిరంతర ఆదాయం కోసం ఆవులు, గేదెలను ఎంచుకునేటప్పుడు ఈ క్రింది శారీరక, ఉత్పాదక లక్షణాలను గమనించాలి:

ఆ. శారీరక నిర్మాణం (Body Conformation)
• త్రిభుజాకార శరీరం (Wedge Shape): మంచి పాడి పశువు వెనుక భాగం వెడల్పుగా, ముందు భాగం (తల మరియు మెడ) సన్నగా ఉండి, పక్క నుండి చూస్తే త్రిభుజాకారంలా కనిపించాలి. ఇది పాలు ఇచ్చే సామర్థ్యానికి ప్రతీక.
• చర్మం మరియు కళ్లు: చర్మం పల్చగా, మెరుస్తూ, పట్టుకుంటే వదిలేసేలా వదులుగా ఉండాలి. కళ్లు చురుగ్గా, స్పష్టంగా ఉండాలి.
• వెన్నెముక మరియు కాళ్లు: వెన్నెముక నిటారుగా ఉండాలి. కాళ్లు బలంగా, నిలబడే పద్ధతి సరిగ్గా ఉండి, గిట్టలు ఎలాంటి పగుళ్లు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి.

బి. పొదుగు మరియు చనుమొనల లక్షణాలు (Udder and Teats)
• పొదుగు పరిమాణం: పొదుగు పెద్దదిగా, వెనుక కాళ్ల మధ్య భాగంలో బాగా అమర్చబడి ఉండాలి. పాలు పితికిన తర్వాత పొదుగు పూర్తిగా ముడుచుకుపోవాలి (ఇది పొదుగులో కొవ్వు తక్కువగా, పాల గ్రంథులు ఎక్కువగా ఉన్నాయని సూచిస్తుంది).
• పాల నరాలు (Milk Veins): పొదుగు ముందరి భాగం నుండి పొట్ట కింది వరకు సాగే పాల నరాలు లావుగా, వంకరలు తిరిగి స్పష్టంగా కనిపించాలి.
• చనుమొనలు: నాలుగు చనుమొనలు సమానమైన పొడవు, లావు కలిగి, ఒకదానికొకటి సమాన దూరంలో చతురస్రాకారంలో అమరి ఉండాలి. పొదుగు గట్టిగా ఉండకూడదు (పొదుగు వాపు వ్యాధి లక్షణాలు లేవని నిర్ధారించుకోవాలి).

సి. వయస్సు మరియు ఈత (Age and Lactation)
• ఈత: మొదటి లేదా రెండవ ఈతలో ఉన్న పశువులను ఎంచుకోవడం ఉత్తమం. ఇవి ఎక్కువ కాలం పాలు ఇస్తాయి.
• వయస్సు నిర్ధారణ: పశువు నోటిలోని పళ్లను చూసి వయస్సును శాస్త్రీయంగా అంచనా వేయవచ్చు. 4 నుండి 6 శాశ్వత పళ్లు (దాదాపు 3 నుండి 5 సంవత్సరాల వయస్సు) ఉన్న పశువులు కొనుగోలుకు అనువైనవి.

డి. ఇతర ముఖ్యాంశాలు
• వీలైతే పశువును కొనేముందు వరుసగా మూడు పూటల పాలు పితికి చూసి, సగటు పాల దిగుబడిని లెక్కించాలి.
• తెలంగాణ వాతావరణానికి గేదెలలో ముర్రా (Murrah) లేదా స్థానిక గ్రేడెడ్ ముర్రా, ఆవులలో జెర్సీ క్రాస్ (Jersey Cross), హెచ్.ఎఫ్ క్రాస్ (HF Cross) లేదా దేశవాళీ జాతులైన గిర్ (Gir), సాహివాల్ (Sahiwal) అనుకూలమైనవి.

  1. గొర్రెలు మరియు మేకల ఎంపిక (Sheep and Goat Selection)
    మాంసం ఉత్పత్తి మరియు పిల్లల ద్వారా లాభాలు పొందడానికి జీవాల ఎంపికలో చాలా జాగ్రత్తలు అవసరం.

ఆ. పోతు జీవాల ఎంపిక (Breeding Rams / Bucks)
మంద అభివృద్ధి అంతా పోతు జీవం పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీని ఎంపిక అత్యంత కీలకం.
• లక్షణాలు: పోతు జీవం చురుగ్గా, పొడవుగా, ఎత్తైన శరీరంతో, వెడల్పాటి ఛాతి కలిగి ఉండాలి.
• ప్రజనన అవయవాలు: రెండు వృషణాలు (Testicles) సమాన పరిమాణంలో, బాగా అభివృద్ధి చెంది, కిందికి వేలాడుతూ ఉండాలి. వృషణాలలో ఎలాంటి వాపులు లేదా గడ్డలు ఉండకూడదు.
• వయస్సు: 1 నుండి 1.5 సంవత్సరాల వయస్సు (రెండు పళ్ల ప్రాయం) ఉన్న పోతులను మాత్రమే ప్రజననం (దాటించడం) కోసం వాడాలి.

బి. ఆడ జీవాల ఎంపిక (Ewes / Does)
• శరీర రూపురేఖలు: ఆడ జీవాల వెనుక భాగం వెడల్పుగా ఉండాలి, ఇది సులభంగా ఈనడానికి తోడ్పడుతుంది. నోరు, దవడలు సరిగ్గా అమరి ఉండి మేతను సులభంగా నమలగలగాలి.
• సంతానోత్పత్తి చరిత్ర: త్వరగా ఎదకు వచ్చేవి, తక్కువ వ్యవధిలో ఈనేవి మరియు ఒకే ఈతలో రెండు పిల్లలను (ముఖ్యంగా మేకలలో) కనే హిస్టరీ ఉన్న తల్లుల నుండి వచ్చిన పిల్లలను ఎంచుకోవాలి.
• పొదుగు ఆరోగ్యం: పొదుగును తాకి చూసినప్పుడు మెత్తగా ఉండాలి. చనుమొనలు మూసుకుపోయి ఉండకూడదు.

సి. వయస్సు మరియు జాతులు
• వయస్సు: 1 నుండి 2 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడ జీవాలు మొదటి ఈతకు సిద్ధంగా ఉంటాయి.
• తెలంగాణకు అనువైన జాతులు:
o గొర్రెలు: నెల్లూరు (జోడిపి, బ్రౌన్), నల్లగొండ స్థానిక జాతులు.
o మేకలు: మహబూబ్‌నగర్ లోకల్, ఉస్మానాబాదీ, తలచ్చేరి/బీటల్ క్రాస్ జాతులు.

  1. పెరటి కోళ్ల ఎంపిక (Backyard Poultry Selection)
    తక్కువ పెట్టుబడితో ఇళ్ల వద్ద, పెరట్లో కోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం మరియు పోషకాహారం పొందవచ్చు.

ఆ. పిల్లల (Chicks) మరియు పెరిగే కోళ్ల ఎంపిక
• చురుకుదనం: కోడిపిల్లలు చురుగ్గా కదులుతూ, శబ్దాలకు త్వరగా స్పందిస్తూ ఉండాలి. కళ్లు ప్రకాశవంతంగా, గుండ్రంగా ఉండాలి.
• శరీర నాణ్యత: పొట్ట భాగం మెత్తగా ఉండాలి (సరిగ్గా కరగని సొన వల్ల పొట్ట గట్టిగా ఉండకూడదు). ఈకలు పొడిగా, శుభ్రంగా ఉండాలి. కాళ్లు బలంగా, నిటారుగా ఉండి ఎలాంటి వైకల్యాలు ఉండకూడదు.
• నాభి (Navel): పిల్లల నాభి భాగం పూర్తిగా ఎండిపోయి, మూసుకుపోయి ఉండాలి. తడి నాభి ఉంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

బి. గుడ్లు పెట్టే కోళ్ల ఎంపిక (Layers)
• కలగిరి (Comb) మరియు గడ్డం (Wattles): గుడ్లు పెట్టే కోడి యొక్క కలగిరి/శిఖ పెద్దదిగా, ఎర్రగా, వెచ్చగా మరియు మెరుస్తూ ఉంటుంది. గుడ్లు పెట్టని కోళ్లలో ఇది చిన్నదిగా, తెల్లగా మారుతుంది.
• శరీర సామర్థ్యం (Pelvic Bones): కోడి వెనుక భాగంలోని తుంటి ఎముకల (Pelvic bones) మధ్య కనీసం 2 నుండి 3 వేళ్ల వెడల్పు స్థలం ఉండాలి. అలాగే తుంటి ఎముకకు, రొమ్ము ఎముక చివరి భాగానికి (Keel bone) మధ్య 3 నుండి 4 వేళ్ల ఖాళీ ఉంటే అది ఎక్కువ గుడ్లు పెట్టే మంచి కోడి అని అర్థం.
• గుభ్రం (Vent): గుడ్లు పెట్టే కోడి యొక్క గుభ్రం (మల విసర్జన ద్వారం) వెడల్పుగా, తేమగా మరియు గుండ్రంగా ఉంటుంది.

సి. మాంసం కోళ్ల ఎంపిక (Broilers/Cockerels)
• తక్కువ కాలంలో ఎక్కువ బరువు పెరిగే సామర్థ్యం, వెడల్పాటి రొమ్ము భాగం మరియు బలమైన తొడలు ఉన్న కోళ్లను మాంసం కోసం ఎంచుకోవాలి.

డి. తెలంగాణకు అనువైన పెరటి కోళ్ల రకాలు
• రాజశ్రీ (Rajasri), వనరాజ (Vanaraja), గ్రామప్రియ (Gramapriya) మరియు స్థానిక నాటు కోళ్లు పెరటి పెంపకానికి, తెలంగాణ వాతావరణానికి ఎంతో అనుకూలమైనవి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండి, తక్కువ మేత ఖర్చుతో ఎక్కువ గుడ్లు మరియు మాంసాన్ని ఇస్తాయి.

రైతులకు సాధారణ ఆరోగ్య సూత్రాలు (Health Check-list)
ఏ జంతువు లేదా పక్షిని కొనుగోలు చేసినా ఈ క్రింది ఉమ్మడి ఆరోగ్య లక్షణాలను తప్పక గమనించాలి:

  1. ఆకలి మరియు నెమరు: జంతువు మేతను బాగా తింటూ, చురుగ్గా నెమరు వేస్తూ ఉండాలి.
  2. మలమూత్ర విసర్జన: పేడ లేదా విసర్జితాలు సాధారణ రంగు, గట్టిదనం కలిగి ఉండాలి (సారగా/డయేరియా ఉండకూడదు).
  3. కళ్ల నుండి నీరు: కళ్లు, ముక్కు మరియు నోటి నుండి ఎలాంటి అసాధారణ జిగట స్రావాలు కారకూడదు.
  4. టీకాల రికార్డు: కొనుగోలు చేసే ముందే సదరు పశువులకు/జీవాలకు సకాలంలో టీకాలు (FMD, PPR, గాలికుంటు, పిడుగు రోగం, కోళ్లలో ఆర్‌.డి.వి వంటివి) వేశారో లేదో కనుక్కోవాలి.
    ఈ రకమైన శాస్త్రీయ పద్ధతులను పాటించి పశుసంపదను ఎంపిక చేసుకుంటే పశుపోషణలో నష్టాలు రాకుండా నివారించవచ్చు.

డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం), ఫోన్: 8121451017
కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్

Read More

గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి నివారణ ఎలా?

ఈ వ్యాధిని మూతివాపు, మూతిపుండ్లు, పూతరోగం మొదలగు పేర్లతో వివిధ ప్రాంతాలలో వ్యవహరిస్తారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న గొర్రెలలో నాలుక నీలిరంగుకు మారుతుంది. కావున ఈ వ్యాధిని నీలిరంగు వ్యాధి అని వ్యవహరిస్తారు.

వ్యాధి ఎలా వస్తుంది?
ఈ వ్యాధి వైరస్ వలన కలుగుతుంది. దోమకాటు వలన ఈ క్రిములు గొర్రె శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. వర్షాకాలంలో వ్యాధి క్రిముల అభివృద్ధికి మరియు అవి విస్తరింపచేసే దోమల వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది.

వ్యాధి లక్షణాలు:

  • వ్యాధి సోకిన గొర్రెలలో జ్వరం ఎక్కువగా ఉంటుంది.
  • క్రమేణా జ్వరం ఉన్న గొర్రెలకు చొంగ కారుతూ, పెదవులు మరియు చిగుళ్ళు వాచి, పెదవుల లోపలి భాగం ఎర్రబడి, చిన్న చిన్న గుల్లలు ఏర్పడతాయి.
  • వ్యాధి తీవ్రంగా ఉన్న గొర్రెలలో ఈ వ్యాధి కాళ్ళకు కూడా పాకుతుంది. గిట్టల మొదటి భాగం వాచి, గిట్టల మధ్య ఎర్రగా ఉంటుంది. కావున గొర్రెలు సరిగా నడవలేక మేత సమయంలో వెనుకపడతాయి.
  • వ్యాధి చివరి దశలో నాలుక నీలిరంగుకు మారుతుంది. మరియు మెడ వంకర పోతుంది.
  • వ్యాధి తీవ్రతను బట్టి 5Ð6 రోజులు మేత మేయక, నీరు త్రాగకపోవుట వలన గొర్రెలు నీరసించి చివరికి చనిపోతాయి.

వ్యాధిని ఎలా నివారించాలి?

  • వ్యాధి నివారణ టీకాల ఉత్పత్తికి ప్రస్తుతము పరిశోధనలు చివరి దశలో ఉన్నాయి.
  • వర్షాకాలంలో కొట్టం, పరిసర ప్రాంతాలలో ఈగలు, దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలి.
  • రోజుకు రెండు పర్యాయాలు వేపాకుతో పొగ వేసిన యెడల దోమలను నివారించవచ్చు.

చికిత్స:

  • వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే పశువైద్యుని సంప్రదించి, యాంటిబయోటిక్ మరియు నొప్పి నివారణ మందులు వాడడం ద్వారా వ్యాధిగ్రస్తమైన గొర్రెలు చనిపోకుండా కాపాడుకోవచ్చు.
  • నోటిలోని పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేటు ద్రావణంలో కడిగి జింక్ పౌడర్ నీటితో రుద్దాలి. గిట్టల మధ్య ఉన్న పుండ్లను కడిగి హిమాక్స్, నీమ్‌లెంట్ వంటి ఆయింట్‌మెంటులు పూయాలి.
  • కస్తూరి దిలీప్, పిహెచ్.డి. స్కాలర్, వి.వి.వి. అమృత్‌కుమార్, ప్రొఫెసర్, పశువైద్య విభాగం, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్: 9391097150
Read More

పశువుల్లో బెబీసియోసిస్ లేదా ఎరుపు మూత్ర వ్యాధి

బెబీసియోసిస్‌ను టిక్ ఫీవర్ లేదా టెక్సాస్ ఫీవర్ లేదా పైరోప్లాస్మోసిస్ లేదా రెడ్ వాటర్ డిసీస్ అని కూడా అంటారు. ఈ వ్యాధి రిపిసెఫాలస్ మైక్రోప్లస్ (పూర్వపు పేరు బూఫైలస్ మైక్రోప్లస్) అనే జాతికి చెందిన గోమార్ల ద్వారా వ్యాప్తి చెందును. ఈ వ్యాధి బెబీసియా బైజెమినా మరియు బెబీసియా బోవిస్ అనే ఏకకణ పరాన్నజీవుల (ప్రోటోజోవా) వలన పశువుల్లో సోకుతుంది. ఈ వ్యాధి గేదెలలో కంటే విదేశీ జాతి పశువులు మరియు సంకరజాతి పశువులలో ఎక్కువగా సోకుతుంది.

వ్యాధి లక్షణాలు:
వ్యాధి సోకిన పశువులలో అధిక జ్వరం (105-107 డిగ్రీల ఫారెన్‌హీట్), మేత తినవు. నీరసంగా ఉంటాయి. కంటి పొరలు రక్తలేమితో ఉంటాయి. రక్తహీనత మరియు కామెర్లు వంటి లక్షణాలుంటాయి. మూత్రం కాఫీరంగులో ఉండడం ఈ వ్యాధి ప్రత్యేక లక్షణం. వ్యాధి సోకిన పాడి పశువులలో పాలుతగ్గడం, దుక్కి దున్నే పశువులలో పని సామర్థ్యం తగ్గడం మరియు చూలు పశువులు ఈసుకుని పోవడం సంభవిస్తుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది.

చికిత్స:
వ్యాధి సోకిన పశువులకు ఇమిడోకార్బ్ అనే మందును 1 మి.గ్రా./కిలో బరువు చొప్పున కండరానికి ఇవ్వాలి. లేదా డైమినజిన్ అసిటురేట్ (బెరినిల్) అనే మందును 3.5 మి.గ్రా. / కిలో బరువు చొప్పున కండరానికి ఇవ్వాలి. వీటితో పాటుగా, టెట్రాసైకిన్స్ అనే యాంటిబయాటిక్‌ను, డెక్స్‌ట్రోస్, సెలైన్స్, బి-కాంప్లెక్స్ మరియు ఐరన్ ఇంజక్షన్స్ కూడా ఇవ్వాలి.

నివారణః
ఈ వ్యాధి ముఖ్యంగా గోమార్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కావునా గోమార్ల నివారణకు డెల్టామెత్రిన్ లేదా సైపర్‌మెత్రిన్ అనే మందును 2 మి.లీ./1లీ. నీటితో పశువులపై పిచికారి చేసి, పశువుల శరీరంపై ఉన్న బాహ్యపరాన్న జీవులను నిర్మూలించాలి. పోరఆన్ (ఫ్లుమెత్రిన్) అనే మందును పశువుల శరీరంపై తలభాగం నుండి తోక వరకు వెన్నెముకపై ఒక గీత లాగా పోసినచో ఈ గోమార్లను నిర్మూలించవచ్చు.

డా॥ పొట్టబత్తుల మల్లేష్, సహాయ ఆచార్యులు, ఫోన్: 9030427110,
డా. యస్. రమేష్ భూమయ్య, సహఆచార్యులు మరియు విభాగాధిపతి, ఫోన్: 8897851699
పశువైద్య పరాన్నజీవ శాస్త్ర విభాగం, పశువైద్య కళాశాల, కోరుట్ల, జగిత్యాల జిల్లా

Read More

ఎల్‌ నినో (El Nino) ప్రభావం మరియు పశువుల సంరక్షణ – సమగ్ర నివేదిక

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఒక తీవ్రమైన వాతావరణ మార్పు. దీని ప్రభావం వల్ల భారతదేశం, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండి, అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు మరియు తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ప్రతికూల వాతావరణం వ్యవసాయంతో పాటు పాడి మరియు మాంసం కోసం పెంచే పశువుల ఆరోగ్యం, మరియు ఉత్పాదకతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

పశువులపై ఎల్‌నినో చూపే ప్రభావాలు, వాటి వల్ల కలిగే నష్టాలు, మరియు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య, నివారణ చర్యల గురించి కింద వివరంగా వివరించబడింది:

  1. పశువులపై ఎల్‌ నినో చూపే తీవ్ర ప్రభావాలు

ఎ. ఉష్ణోగ్రత మరియు హీట్ స్ట్రెస్:
• ఎల్‌నినో సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6°C వరకు పెరిగే అవకాశం ఉంటుంది.
• పశువులకు వాతావరణంలో ఉష్ణోగ్రత-తేమ సూచిక 68 కంటే తక్కువగా ఉంటే సురక్షితం. కానీ ఎల్‌నినో వల్ల ఈ సూచిక 79 కంటే ఎక్కువగా నమోదై, పశువులు భయంకరమైన హీట్ స్ట్రెస్‌కు గురవుతాయి.
• మనుషుల లాగా పశువులకు చెమట పట్టే సామర్థ్యం చాలా తక్కువ. కాబట్టి వేడిని తట్టుకోవడానికి పశువులు వేగంగా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తాయి. దీనివల్ల పశువు శరీరంలోని శక్తి మాంసం, పాలు ఉత్పత్తికి బదులుగా శ్వాస తీసుకోవడానికే వృథా అవుతుంది.

బి. రోగనిరోధక వ్యవస్థ క్షీణత మరియు వ్యాధులు:
• ఎల్‌నినో సమయంలో వాతావరణ ఒత్తిడి వల్ల పశువుల శరీరంలో కార్టిసోల్ మరియు ఏసీటీఎచ్ అనే ఒత్తిడి హార్మోన్లు విపరీతంగా విడులవుతాయి. ఈ హార్మోన్లు పశువుల రోగనిరోధక శక్తిని అణచివేస్తాయి.
• వేడి, తేమతో కూడిన వాతావరణం వల్ల పేలు, గోమారలు, మరియు ఈగలు ఎక్కువగా వృద్ధి చెంది పశువులకు వ్యాధులను వ్యాపింపజేస్తాయి.
• అలాగే రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల గొంతువాపు, జబ్బవాపు, ఆంత్రాక్స్ లాంటి ప్రమాదకరమైన బాక్టీరియా మరియు వైరల్ వ్యాధులు వేగంగా సోకుతాయి.

సి. పాడి ఆవులు, గేదెలపై ప్రభావం:
• ఆవులు తమ శరీరంలో వేడిని తగ్గించుకునే క్రమంలో జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల దాణా తీసుకోవడం తగ్గిపోతుంది.
• తగినంత దాణా తీసుకోకపోవడం వల్ల పాల దిగుబడి 10% నుంచి 30% వరకు పడిపోతుంది. పాలలో కొవ్వు మరియు ప్రోటీన్ శాతం బాగా తగ్గిపోయి పాలు పలచబడతాయి.
• ప్రత్యుత్పత్తి వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుంది. ఈస్ట్రోజెన్, ఎల్‌హెచ్ హార్మోన్ల స్థాయిలు పడిపోయి అండాల నాణ్యత దెబ్బతింటుంది.
• ఆవులు సైలెంట్ హీట్‌కు గురవుతాయి మరియు గర్భస్థ పిండాలు చనిపోయే ప్రమాదం ఉంటుంది.
• ఒక పరిశోధన ప్రకారం, ఎల్‌నినో వల్ల కలిగే హీట్ స్ట్రెస్ సమయంలో ఆవులలో పిండాల ఉత్పత్తి తగ్గిపోతుంది. చల్లటి వాతావరణంలో సజీవ పిండాల శాతం 59.2% ఉండగా, ఎల్‌నినో సమయంలో అది 38.2%కి పడిపోయినట్లు గుర్తించారు.

డి. మాంసం కోసం పెంచే పశువులపై ప్రభావం:
• సరైన పశుగ్రాసం లేకపోవడం వల్ల పశువుల బరువు పెరగడం ఆగిపోతుంది.
• తీవ్రమైన ఎండల వల్ల పశువుల కండరాల్లో నిల్వ ఉండే గ్లైకోజెన్ శక్తి పూర్తిగా హరించుకుపోతుంది.
• దీనివల్ల మాంసం కోసే సమయానికి దాని ఆమ్ల-క్షార స్థాయి 5.8-6.0కు పెరిగిపోయి, మాంసం ముదురు రంగులో, గట్టిగా, పొడిగా మారుతుంది. దీనివల్ల మార్కెట్లో మాంసం నాణ్యత, ధర పడిపోతుంది.

ఇ. నీరు మరియు పశుగ్రాస కొరత:
• ఎల్‌నినో వల్ల వర్షపాతం తగ్గడంతో పచ్చగడ్డి దిగుబడి ఆగిపోయి పశుగ్రాస కొరత ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 4.5 లక్షల టన్నుల పశుగ్రాసం కొరత ఏర్పడింది.
• చెరువులు, కుంటలు ఎండిపోవడం వల్ల పశువులకు త్రాగునీటి కొరత ఏర్పడుతుంది. ఒకవేళ కలుషితమైన నీరు తాగితే వ్యాధులు ప్రబలుతాయి.

  1. నివారణ మరియు యాజమాన్య చర్యలు

ఎ. పశుగ్రాస నిర్వహణ:
• ముందస్తు ప్రణాళిక: రాబోయే కరువు పరిస్థితులను (ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు) దృష్టిలో ఉంచుకొని పశుగ్రాస ప్రణాళిక చేసుకోవాలి.
• సైలేజ్ తయారీ: వర్షాకాలంలో లేదా పచ్చగడ్డి ఎక్కువగా ఉన్నప్పుడు మిగిలిన గడ్డిని వృథా చేయకుండా “సైలేజ్” లేదా ఎండుగడ్డిగా నిల్వ చేసుకోవాలి.
• దాణా మరియు మేత కొలతలు: 400-500 కేజీల బరువుండే పశువుకు రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 5 కేజీల ఎండుగడ్డి (వరి గడ్డి లేదా జొన్న), 3-5 కేజీల దాణా విధిగా అందించాలి. పచ్చగడ్డి అందుబాటులో లేకపోతే ఎండు గడ్డికి పోషకాలు కలిపి ఇవ్వాలి.
• ప్రభుత్వ పథకాల వినియోగం: ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కింద, ప్రకృతి వ్యవసాయం కింద ఖాళీ భూముల్లో పచ్చగడ్డిని పెంచాలి. హరిత గోపాలం పథకం ద్వారా పశుగ్రాస క్షేత్రాలు, నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలి.
• పొలాల గట్లపై పెరిగే సహజమైన గడ్డిని నాశనం చేయకుండా పశువుల కోసం భద్రపరచుకోవాలి.

బి. దాణాలో మార్పులు మరియు సప్లిమెంట్లు:
• పశువులు ఎండ సమయంలో మేత తినలేవు, కాబట్టి వాతావరణం చల్లగా ఉండే ఉదయం (6-7 గంటలకు) మరియు సాయంత్రం (4-6 గంటలకు) సమయాల్లో మేత మేపాలి.
• మేతలో పీచు పదార్థాలతో పాటు శక్తిని ఇచ్చే దాణా పెంచాలి. అజీర్తి సమస్యలు రాకుండా ప్రోబయోటిక్స్ వాడాలి.
• వడదెబ్బను, డీహైడ్రేషన్‌ను తట్టుకోవడానికి తాగునీటిలో ఎలక్ట్రోలైట్లు కలపాలి.
• పశువులకు మినరల్ మిక్చర్ మరియు ఉప్పు ఎక్కువగా ఉండే దాణా అందించాలి. విటమిన్ సి, విటమిన్ బి1, మరియు ఎల్-కార్నిటైన్ కలిగిన పోషకాలు పశువులకు ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తాయి.

సి. నీటి నిర్వహణ:
• ఒక ఆవుకు రోజుకు కనీసం 40-60 లీటర్ల శుభ్రమైన తాగునీరు అవసరం, ఎండాకాలంలో ఈ అవసరం ఇంకా పెరుగుతుంది. పశువులకు ఎల్లప్పుడూ చల్లటి, స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండేలా చూడాలి.
• వ్యవసాయ క్షేత్రాల్లో పల్లపు ప్రాంతాల్లో ఫార్మ్ పాండ్స్ తవ్వి వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి.

డి. వసతి మరియు శీతలీకరణ:
• పశువుల పాకల పైకప్పుకు ఆస్బెస్టాస్ లేదా జింక్ రేకులు వాడకూడదు, ఇవి వేడిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. కప్పులపై గడ్డి లేదా కొబ్బరి ఆకులు వేసి ఉంచాలి.
• గాలి బాగా ఆడేలా చూసుకోవాలి. పాకలలో వేడిని తగ్గించడానికి ఫాగర్లు, మిస్ట్ డ్రాప్స్, లేదా స్ప్రింక్లర్లు తో పాటు ఫ్యాన్లు ఉపయోగించి సూక్ష్మ వాతావరణాన్ని చల్లగా ఉంచాలి. క్లోజ్డ్ హౌస్ పద్ధతిని వాడితే కూలింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేసుకోవాలి.

ఇ. ఆరోగ్య సంరక్షణ మరియు వ్యాక్సినేషన్:
• ఎల్‌నినో ముప్పు తీవ్రంగా ఉంటుంది కాబట్టి వర్షాకాలానికి ముందే పశువులకు గాలికుంటు వ్యాధి, గొంతువాపు, మరియు జబ్బవాపు లకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి.
• పశువులకు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు త్రాగించాలి. పాకల్లోకి పేలు, గోమారలు రాకుండా పాత మట్టిని తీసేసి కొత్త మట్టి వేయాలి, క్రిమిసంహారకాలు పిచికారీ చేయాలి.
• పాకల్లో రద్దీని తగ్గించాలి. రద్దీ వల్ల వేడి పెరగడమే కాకుండా అమ్మోనియా వాయువు ఉత్పత్తి అయి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.
• ఉరుములు, పిడుగులు పడే సమయంలో పశువులను చెట్ల కింద ఉంచకూడదు. అలాగే ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు పశువులను బలవంతంగా లాగడం చేయకూడదు.
పై విధానాలను సూక్ష్మస్థాయిలో ప్రణాళికబద్ధంగా పాటిస్తే, ఎల్‌నినో లాంటి విపత్కర వాతావరణ పరిస్థితుల్లో సైతం పశుగ్రాస కొరతను అధిగమించి, పశువుల ఉత్పాదకత పడిపోకుండా కాపాడుకోవచ్చు. ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణం పశువైద్యాధికారిని సంప్రదించడం అత్యంత కీలకం.

డాక్టర్.జి.రాంబాబు, పశువైధ్యాధికారి, కడప. Ph: 94945 88885

Read More

ఆవులు మరియు గేదెల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే మార్గాలు – నూతన సాంకేతికతలు

పాడి పరిశ్రమలో లాభాలు ఆర్జించాలంటే పశువుల పాల దిగుబడి ఎంత ముఖ్యమో, వాటి సంతానోత్పత్తి సామర్థ్యం (Breeding Efficiency) కూడా అంతకంటే ముఖ్యం. “ఏడాదికి ఒక దూడ” (One Calf Per Year) అనే లక్ష్యాన్ని సాధించినప్పుడే పాడి రైతు ఆర్థికంగా స్థిరపడగలడు. అయితే, ప్రస్తుత కాలంలో పోషకాహార లోపం, సకాలంలో ఎదను గుర్తించకపోవడం, మరియు వాతావరణ మార్పుల వల్ల పశువులలో పునరుత్పత్తి సమస్యలు (Reproductive problems) పెరుగుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి సాంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక సాంకేతికతలను (Latest Technologies) ఉపయోగించడం ఎంతో అవసరం.

సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ప్రాథమికాంశాలు
పశువులలో సంతానోత్పత్తిని పెంచడానికి సాంకేతికతలను వాడే ముందు, కొన్ని ప్రాథమిక యాజమాన్య పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలి.

  1. పౌష్టికాహార యాజమాన్యం (Nutritional Management)
    పశువుల పునరుత్పత్తి వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి శక్తి, ప్రోటీన్లు మరియు ఖనిజ లవణాలు (Minerals) ఎంతో అవసరం.
    •ఖనిజ లవణాల మిశ్రమం (Mineral Mixture): ఆవులు, గేదెలకు రోజుకు 50-60 గ్రాముల నాణ్యమైన మినరల్ మిశ్రమాన్ని మేతలో కలపాలి. విటమిన్ ఎ, ఇ, మరియు కాపర్, కోబాల్ట్, జింక్, సెలీనియం వంటి సూక్ష్మ పోషకాలు పశువులు సకాలంలో ఎదకు రావడానికి, గర్భం నిలవడానికి సహాయపడతాయి.
    •గ్రీన్ ఫోడర్ (పచ్చిమేత): పచ్చిమేతలో ఉండే ‘కెరోటిన్’ (Carotene) హార్మోన్ల ఉత్పత్తిని పెంచి, గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  2. ఎదను సకాలంలో గుర్తించడం (Heat Detection)
    ఎదను సరిగ్గా గుర్తించకపోవడం అనేది సంతానోత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణం. ముఖ్యంగా గేదెల్లో మూగ ఎద (Silent Heat) ఎక్కువగా ఉంటుంది. ఇవి రాత్రి వేళల్లో ఎద లక్షణాలను చూపిస్తాయి.
    •సాంప్రదాయ పద్ధతి: రోజుకు కనీసం 3-4 సార్లు (ముఖ్యంగా తెల్లవారుజామున మరియు రాత్రి వేళల్లో) పశువులను నిశితంగా గమనించాలి. యోని నుండి తీగలు వేయడం, తరచుగా అరుస్తూ ఉండటం, ఇతర పశువులపై ఎక్కడం వంటి లక్షణాల ద్వారా ఎదను గుర్తించవచ్చు.

సంతానోత్పత్తిలో విప్లవాత్మక నూతన సాంకేతికతలు (Latest Technologies)
ప్రస్తుతం పశుగ్రాస రంగాన్ని మరియు పశువైద్యాన్ని ఆధునిక సాంకేతికత పూర్తిగా మార్చేస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలను ఇచ్చే కొన్ని ముఖ్యమైన టెక్నాలజీలు ఇక్కడ ఉన్నాయి:

  1. ఐఓటి ఆధారిత సెన్సార్లు మరియు స్మార్ట్ కాలర్స్ (IoT Sensors & Smart Collars)
    రైతు ప్రతి నిమిషం పశువును గమనించడం సాధ్యం కాదు. దీనికోసం ఇప్పుడు స్మార్ట్ నెక్ కాలర్స్ (Smart Neck Collars) లేదా కాలి పట్టీలు (Pedometer) అందుబాటులోకి వచ్చాయి.
    •ఈ పరికరాలు పశువుల కదలికలను, శరీర ఉష్ణోగ్రతను మరియు అవి నెమరు వేసే సమయాన్ని నిరంతరం పర్యవేక్షిస్తాయి.
    •పశువు ఎదకు వచ్చినప్పుడు దాని శరీరంలో వచ్చే మార్పులను బట్టి, ఇది రైతు మొబైల్ ఫోన్‌కు “ఎద అలర్ట్” (Heat Alert) మెసేజ్ పంపుతుంది. దీనివల్ల మూగ ఎదను కూడా 100% ఖచ్చితత్వంతో గుర్తించవచ్చు.
  2. సెక్స్డ్ సార్టెడ్ వీర్యం (Sexed Sorted Semen Technology)
    ఈ సాంకేతికత పాడి పరిశ్రమలో ఒక పెద్ద విప్లవం. సాధారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ (AI) చేస్తే పెయ్య దూడ లేదా మగ దూడ పుట్టే అవకాశం 50:50 ఉంటుంది.
    •కానీ ‘సెక్స్డ్ సెమెన్’ సాంకేతికత ద్వారా కేవలం ఆడ దూడలను పుట్టించే X-క్రోమోజోమ్ కలిగిన కణాలను మాత్రమే వేరు చేస్తారు.
    •దీనిని ఉపయోగించడం వల్ల 90% పైగా కేవలం పెయ్య దూడలు (Female Calves) మాత్రమే పుడతాయి. దీనివల్ల మగ దూడల సంఖ్య తగ్గి, పాడి రైతుకు మేలు జరుగుతుంది.
  3. ఐవిఎఫ్ మరియు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ (IVF & Embryo Transfer Technology – ETT)
    ఉత్తమ జాతి ఆవు లేదా గేదె నుండి ఎక్కువ దూడలను పెంపొందించడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.
    •ఒక అత్యధిక పాల దిగుబడి ఇచ్చే ఆవు నుండి అండాలను సేకరించి, ప్రయోగశాలలో ఫలదీకరణం (IVF) జరిపి పిండాలను (Embryos) తయారు చేస్తారు.
    •ఈ పిండాలను తక్కువ పాల దిగుబడి ఇచ్చే సాధారణ ఆవుల (Surrogate mothers) గర్భాశయంలో ప్రవేశపెడతారు. దీనివల్ల ఒకే ఉత్తమ జాతి పశువు నుండి ఏడాదికి 10-15 గరిష్ట నాణ్యత గల దూడలను పొందవచ్చు.

4.హార్మోన్ల వినియోగం మరియు ముగింపు, స్థిర సమయ కృత్రిమ గర్భధారణ (Fixed Time AI – FTAI)
చాలా కాలం పాటు ఎదకు రాని పశువుల కోసం హార్మోన్ల చికిత్స (Synchronization Protocols) ఉపయోగపడుతుంది.
•ప్రొజెస్టెరాన్, జిఎన్ఆర్ హెచ్ (GnRH), పిజిఎఫ్2ఆల్ఫా (PGF2α) వంటి హార్మోన్లను నిర్ణీత రోజుల్లో పశువుకు ఇంజెక్ట్ చేయడం ద్వారా, అవి ఒకే సమయంలో ఎదకు వచ్చేలా చేస్తారు.
•దీనివల్ల ఎద లక్షణాలు స్పష్టంగా కనిపించకపోయినా, నిర్ణీత సమయానికి (Fixed Time) కృత్రిమ గర్భధారణ చేసి పశువు గర్భం దాల్చేలా చేయవచ్చు.

  1. గర్భ నిర్ధారణ పరీక్షల్లో ఆధునికత (Early Pregnancy Diagnosis)
    సాధారణంగా పశువు గర్భం దాల్చిందో లేదో తెలియడానికి 3 నెలలు పడుతుంది. కానీ ఇప్పుడు:
    •అల్ట్రాసౌండ్ స్కాన్ (Ultrasonography): కృత్రిమ గర్భధారణ చేసిన 28 నుండి 30 రోజుల్లోనే గర్భాన్ని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు.
    •రక్త/పాల పరీక్షలు (PAG Testing): పశువుల రక్తం లేదా పాలలో ఉండే ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ గ్లైకోప్రోటీన్స్ (PAG) ఆధారంగా 28 రోజుల్లోనే గర్భాన్ని గుర్తించే కిట్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకవేళ పశువు కట్టకపోతే, వెంటనే దానికి మళ్లీ చికిత్స చేసి త్వరగా ఎదకు తీసుకురావచ్చు.

ముగింపు (Conclusion)
ఆవులు మరియు గేదెల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం అనేది కేవలం ఒక పద్ధతిపై ఆధారపడి ఉండదు. సరైన సమతుల్య ఆహారం, మెరుగైన కొట్టాల యాజమాన్యంతో పాటు స్మార్ట్ కాలర్స్, సెక్స్డ్ సెమెన్, ఐవిఎఫ్ వంటి ఆధునిక సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవడం ద్వారా పశువుల పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి, పొదుగు రోగాలు మరియు గర్భకోశ వ్యాధులు తగ్గి, పాడి పరిశ్రమ లాభసాటిగా మారుతుంది.

రచయిత: డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం), Ph: 8121451017కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్

Read More

గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం

     గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తోంది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనాధారంలో పశుపోషణకు ముఖ్యమైన స్థానం ఉంది. వ్యవసాయంతో పాటు పశువులను పెంచడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. గతంలో పశుపోషణ సంప్రదాయ పద్ధతులపై ఆధారపడగా, ప్రస్తుతం డిజిటల్ సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఈ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, డిజిటల్ యాప్‌లు, ఆన్‌లైన్ సేవలు వంటి సాంకేతిక సాధనాలు రైతులకు పశువుల సంరక్షణ, ఆరోగ్య నిర్వహణ, మార్కెటింగ్ మరియు ఆర్థిక లావాదేవీలలో సహాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం రైతుల జీవితాలను సులభతరం చేస్తూ, వారి ఆదాయాన్ని పెంచే దిశగా కీలక పాత్ర పోషిస్తోంది.

పశువులకు డిజిటల్ గుర్తింపు (RFID ట్యాగింగ్):
ప్రతి పశువు చెవికి ప్రత్యేకమైన డిజిటల్ కోడ్ కలిగిన ట్యాగ్‌ను (RFID – Radio Frequency Identification) అమర్చుతున్నారు. దీని ద్వారా పశువు పుట్టిన తేదీ, యజమాని వివరాలు, ఇచ్చిన టీకాలు, మరియు ఆరోగ్య చరిత్రను కేంద్ర ప్రభుత్వ నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ (NDLM) డేటాబేస్ లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇది పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి మరియు నకిలీ పశువులను గుర్తించడానికి సహాయపడుతుంది.

పశువుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ- డిజిటల్ టెక్నాలజీ వల్ల వచ్చిన ముఖ్యమైన మార్పుల్లో పశువుల ఆరోగ్య పర్యవేక్షణ ఒకటి.

  • ప్రస్తుతం పశువులకు స్మార్ట్ కాలర్లు లేదా చెవులకు అమర్చే సెన్సర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి పశువుల శరీర ఉష్ణోగ్రత, కదలికలు, ఆహారం తీసుకునే విధానం వంటి విషయాలను నిరంతరం గమనిస్తాయి.
  • పశువులో ఏదైనా అసాధారణ లక్షణం కనిపిస్తే వెంటనే రైతు మొబైల్‌కు సమాచారం చేరుతుంది. దీంతో వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయవచ్చు. ఫలితంగా పశువుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వైద్య ఖర్చులు కూడా తగ్గుతాయి.
  • మన దేశంలో కొన్ని AI ఆధారిత వ్యవస్థలు మాస్టైటిస్, లంపీ స్కిన్ డిసీజ్ వంటి వ్యాధులను కూడా ముందుగానే గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

పాల ఉత్పత్తి మరియు విక్రయాలలో డిజిటలైజేషన్:
పాల సేకరణ కేంద్రాలలో ‘ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్’ (AMCU) వచ్చాయి. వీటి ద్వారా పాలు ఎన్ని ఉన్నాయి, వాటిలో నాణ్యత (ఫ్యాట్ శాతం) ఎంత ఉందో క్షణాల్లో తెలిసిపోతుంది. రైతు ఖాతాలో నేరుగా డబ్బులు జమ కావడం వల్ల పారదర్శకత పెరుగుతుంది.

  • డిజిటల్ పరికరాలు పశువుల ఉత్పాదకతను కూడా పెంచుతున్నాయి. పశువులు ఎంత మేత తింటున్నాయి, ఎప్పుడు మేత ఇవ్వాలి, సంతానోత్పత్తికి సరైన సమయం ఎప్పుడు అనే విషయాలను ఇవి గుర్తించగలవు. అలాగే పాల ఉత్పత్తికి సంబంధించిన వివరాలను కూడా విశ్లేషించగలవు.
  • దీంతో ప్రతి పశువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం సాధ్యమవుతుంది. ఫలితంగా పాల ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం కూడా మెరుగుపడుతోంది.

కృత్రిమ గర్భధారణ (AI) మరియు సంతానోత్పత్తి యాప్‌లు:
పశువుల ఈత సమయం, ఎదకు వచ్చే సమయం కచ్చితంగా తెలిస్తేనే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. దీని కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌లు వచ్చాయి. ఇవి పశువుల ఆరోగ్య చక్రంను పర్యవేక్షించి, రైతులకు సరైన సమయానికి సూచనలు పంపుతాయి.

రైతుల చేతిలో స్మార్ట్‌ఫోన్ శక్తి- నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ రైతులకు ఒక ముఖ్యమైన సాధనంగా మారింది.
మొబైల్ యాప్‌ల ద్వారా రైతులు పశువైద్యుల సలహాలు పొందవచ్చు. టెలీమెడిసిన్ సేవలను ఉపయోగించవచ్చు. వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. వ్యాధులపై హెచ్చరికలు పొందవచ్చు. మార్కెట్ ధరలు తెలుసుకోవచ్చు. అలాగే పశువులు లేదా పాల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు. టీకాలు వేయాల్సిన తేదీలు, మందులు ఇవ్వాల్సిన సమయాల గురించి కూడా యాప్‌లు గుర్తు చేస్తాయి.

వ్యాధుల నియంత్రణలో డిజిటల్ టెక్నాలజీ పాత్ర
పశువుల ప్రవర్తనలో ఏదైనా అసాధారణ మార్పు కనిపిస్తే డిజిటల్ పరికరాలు వెంటనే హెచ్చరికలు పంపిస్తాయి. దీంతో వ్యాధులు ఎక్కువగా వ్యాపించకముందే అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పశువుల మరణాలు తగ్గడమే కాకుండా రైతులు ఆర్థిక నష్టాల నుంచి కూడా రక్షించబడతారు.

పశువైద్య సేవలు – ఈ-సంజీవని:
దూర ప్రాంతాల్లోని రైతులకు పశువైద్యుల సలహాలు, సూచనలు అందించడానికి టెలి-మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. స్థానిక వైద్యాధికారులు అందుబాటులో లేనప్పుడు, స్మార్ట్ ఫోన్ ద్వారా వీడియో కాల్స్ చేసి వ్యాధులను నిర్ధారించి, చికిత్స అందించవచ్చు.

మార్కెట్ అవకాశాల విస్తరణ- డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల రైతులు తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలుదారులకు విక్రయించే అవకాశం పొందుతున్నారు.
దీంతో మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఉత్పత్తులకు సరైన ధర లభిస్తుంది. మార్కెట్ సమాచారం సులభంగా అందుతుంది. కొత్త వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయి. అలాగే డిజిటల్ చెల్లింపుల వల్ల డబ్బు లావాదేవీలు మరింత సురక్షితంగా, వేగంగా జరుగుతున్నాయి.

పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు
డిజిటల్ టెక్నాలజీ వినియోగం వల్ల యాంటీబయాటిక్స్ అవసరానికి మించి వాడాల్సిన అవసరం తగ్గుతుంది. నీరు, మేత వంటి వనరుల వృథా తగ్గుతుంది. పర్యావరణంపై ప్రభావం కూడా తగ్గుతుంది. దీంతో అందుబాటులో ఉన్న వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు
అయితే ఈ మార్పుల మధ్య కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఇంకా పూర్తిగా అందుబాటులో లేకపోవడం. డిజిటల్ పరిజ్ఞానం కొంతమందికి తక్కువగా ఉండటం. ఆధునిక పరికరాల ధరలు ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల రైతులందరూ ఈ సాంకేతికతను పూర్తిగా వినియోగించలేకపోతున్నారు.
అందుకే రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం చాలా అవసరం. ఈ దిశగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి.

ముగింపు
డిజిటల్ టెక్నాలజీ సంప్రదాయ పశుపోషణ పద్ధతులను తొలగించడం లేదు. వాటిని మరింత మెరుగుపరుస్తోంది. రైతుల అనుభవానికి ఆధునిక సాంకేతికత తోడవడంతో పశుపోషణ మరింత సులభంగా, సమర్థవంతంగా మారుతోంది. ఆరోగ్యకరమైన పశువులు, అధిక ఆదాయం, బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో పశుపోషణలో డిజిటల్ సాధనాలు కూడా భూమి, నీరు, మేతల మాదిరిగానే అవసరమైనవిగా మారనున్నాయి.
ఈ డిజిటల్ విప్లవం కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం వల్ల పాడి రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయి. యువత కూడా ఈ ఆధునిక పశుపోషణ పట్ల ఆసక్తి చూపుతున్నారు.

డా. బద్దం అఖిల (ఎం.వి.ఎస్‌సి.),
డా. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. Ph: 9703121088

Read More

పాలవెల్లువ 2.0

గ్రామీణ స్థాయిలో పాలఉత్పత్తిదారుల సహకార సంఘాల స్థాపన, తద్వారా పాలఉత్పత్తి పెంపుదల లక్ష్యంగా 19.9.2024న కేంద్ర సహకార మరియు పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ పాలవెల్లువ 2.0కు శ్రీకారం చుట్టింది. మహిళల భాగస్వామ్యంతో 5 సంవత్సరాల్లో సహకార సంఘాల ద్వారా 50% పాలఉత్పత్తి పెంపుదల లక్ష్యంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. కొత్తగా 75000 బహుళార్థ సాధక పాలఉత్పత్తిదారుల సహకార సంఘాల స్థాపన, 46000 పాలఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం, ఐదు సంవత్సరాల చివరికి రోజుకు 1000 లక్షల లీటర్ల పాలఉత్పత్తి లక్ష్య సాధన దిశగా కేంద్ర సహకార మరియు పశుసంవర్థక పాడి పరిశ్రమ శాఖలు ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో సమావేశాలు జరిపి నిరంతరం ప్రగతిని సమీక్షిస్తున్నాయి.

1998 నుండి ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో అగ్రస్థానం పదిలపరుచుకుంటున్న భారత్, స్థూల ఉత్పత్తికి 25% వాటా సమకూరుస్తుంది. డిసెంబర్ 2014 నుండి అమలవుతోన్న రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా గేదెల్లో పాలఉత్పాదకత 36.63% పెరిగిందని తెలుస్తోంది. అంతేకాక ఆధునిక పాలపరీక్షా పరికరా…తో పాల నాణ్యత పరిశీలన పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది.

రాష్ట్రాలవారీగా 2024 నుండి 2029 వరకు పాలఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు లక్ష్యం ఇలా ఉంది.

తెలంగాణాపరంగా చూస్తే –
2024-2026కు గాను కొత్త సంఘాల ఏర్పాటు 8%, బలోపేతం 42% గా నమోదయింది.
ప్రస్తుత సంవత్సరంకి 306 కొత్త సంఘాల ఏర్పాటు లక్ష్యంగా ఉంది.
పాడి సుస్థిర అభివృద్ధికి 3 అంచెల సహకార వ్యవస్థ రామరక్షగా నాడే క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ చెప్పారు. కాగా తెలంగాణలో బలహీనంగా ఉన్న గ్రామస్థాయి సహకార సంఘాల పాల సేకరణకు సవాల్‌గా మారింది.
ఉన్న సంఘాల్లో ఆడిట్ జరగక పోవడం, సభ్యుల నిర్లిప్త భావన, సంఘ స్ఫూర్తికి విఘాతంగా నిలిచింది.
తెలంగాణ సహకార యూనియన్ మరింతగా సభ్యుల అవగాహనా కార్యక్రమాలు విస్తృతపరచాల్సిన అవసరం ఉంది.
గ్రామస్థాయిలో పాలఉత్పత్తిదారుల సహకార సంఘాలు, జిల్లా స్థాయిలో యూనియన్లు రాష్ట్ర స్థాయిలో సమాఖ్య వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది.
పాడి రైతులు సంఘటితంగా ఉంటే, పక్క రాష్ట్రం, కర్నాటకలో రోజుకు కోటి లీటర్లు పాలసేకరణ సాధ్యపడుతుండగా, విస్తృత విపణి అవకాశాలున్నా, తెలంగాణలో వివిధ సహకార వ్యవస్థలు, ప్రైవేటు ఆధిపత్యానికి దారితీస్తోంది.
తెలంగాణలో కరీంనగర్ పాడి రైతుల కంపెనీ, ముల్కనూర్ మహిళా డెయిరీ, నల్లగొండ రంగారెడ్డి యూనియన్, విజయడెయిరీ ఇలా 4 రకాల వ్యవస్థలు నడుస్తున్నాయి.
1964 చట్టంలో ఉన్న విజయ డెయిరీ వ్యవస్థాగత అసమానతలతో ఆశించినంతగా పాలసేకరణ, మార్కెటింగ్ లక్ష్యాలకు చేరువ కావాలంటే, పాడిరైతుల సంఘటిత ముందడుగు ఎంతో అవసరం.
సహకారశాఖ ద్వారా త్వరితగతిన సంఘాల ఏర్పాటు, పశుసంవర్థక శాఖ ద్వారా పాడిరైతులకు సేవలు సమ్మిళితంగా లభిస్తే, పాడి రైతు బతుకులో భరోసా వస్తుంది. అలాగే, సబ్సిడీతో పాడిపశువులకు రుణాలు దొరకకపోవడం, పాడిపరిశ్రమపై బడ్జెట్ లో తగు కేటాయింపులు జరగకపోవడం పాడిపరిశ్రమపై నీలినీడలు ప్రసరించడానికి కారణం అవుతోంది. కర్నాటకలో ఏటా 2000 కోట్లు ప్రోత్సాహకం ఇస్తుంది కాబట్టే, పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. తద్వారా నిర్వహణ ఖర్చులు అదుపులో ఉన్నాయి.
అదేవిధంగా తెలంగాణలో కూడా –
1) పాడి పశువులను సబ్సిడిపై ఇచ్చే పథకం అమలు
2) పాల ప్రోత్సాహకం విడుదల
3) సాంకేతిక వనరుల సరఫరా
4) పశు ఆరోగ్యంకై నిరంతర సేవలు
5) సంఘాల ఏర్పాటు అనివార్యం చేయడం
అనే పంచ సూత్రాలు అమలయితే పాల ఉత్పత్తి పెరిగి, జీవనోపాధులు మెరుగు కాగలవు.

మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ తెలంగాణ, హైదరాబాద్. ఫోన్: 9121160553

Read More

పశుపోషణలో మునగ ప్రాముఖ్యత

మన దేశంలో ప్రాచీనకాలం నుండి ప్రకృతిలో సహజంగా లభించే అనేక రకాలయిన చెట్లకు, వాటి ఆకులు, కాయలు, వేర్లు మరియు ఇతర భాగాలకు వైద్యపరంగా చాలా ప్రాముఖ్యతను ఇస్తున్నాము. కొన్ని రకాల మొక్కలకు ప్రత్యేక ఔషధ గుణాలు ఉండట, మరికొన్ని రకాల మొక్కల్లో మాంసకృత్తులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు అధిక మోతాదులో ఉండటం వలన వీటి వినియోగం ఇటు మానవ మనుగడలోనే గాక, అటు పశువైద్యంలో కూడా గణనీయంగా పెరిగింది. నేటి కాలంలో పూల మొక్కల నుండి అటవీ వృక్షాల వరకు, వాటిలో ఉండే ఔషధ విలువలు మరియు ఆరోగ్యానికి అవి చేసే మేలు, వాటి ఇతర భాగాల్లో ఇమిడి ఉండే పోషక పదార్థాల గురించి అన్ని కోణాల్లో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.

ప్రకృతి మనకు అందించిన అత్యంత పోషక విలువలు ఉన్న మొక్క ‘మునగ’. ‘పోషకాల గని’గా పేరొందిన మునగ అటు మానవ మనుగడలోనేగాక, పశుపోషణలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మునగ చెట్టు యొక్క ఆకులు, కాయలు, విత్తనాలు మరియు ఇతర భాగాల్లో మాంసకృత్తులు, పిండిపదార్థాలు మరియు విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి.

మునగ సాగు – వివరాలు:
మునగ సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. నేలల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. జులై మొదటి వారం నుండి అక్టోబర్, చివరి వారం వరకు మునగను విత్తుకోవచ్చు. పి.కే.యం-1, పి.కే.యం.2 వంటి రకాలను పెంచుకున్నట్లయితే అధిక దిగుబడి వస్తుంది. కావున పశువుల మేతకు ఈ రకాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఉష్ణోగ్రత 20-25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు మునగ ఏపుగా పెరుగుతుంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎక్కువగా పెరగకపోవచ్చు. కావున దిగుబడి అధికంగా ఉన్నప్పుడు మునగ ఆకులను సేకరించి, నీడలో ఆరబెట్టుకొని నిల్వ చేసుకొని ఎండాకాలంలో ఇతర ప్రశుగ్రాసాలతో కలిపి ఇవ్వవచ్చు.
ప్రత్యేకంగా పశుగ్రాసం కోసం మాత్రమే మునగను సాగు చేసుకోవాలనుకున్నప్పుడు మునగ విత్తనాలను సాళ్ళల్లో 3-5 సెం.మీ. లోతులో నాటుకోవాలి. రెండు సాళ్ల మధ్య దూరం 30 సెం.మీ. మరియు రెండు మొక్కల మధ్య దూరం 20 సెం.మీ. ఉండేవిధంగా చూసుకోవాలి. ఈ విధానంలో ఎకరాకు 25-35 కిలోల విత్తనం సరిపోతుంది. నాటిన రెండు వారాల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తనాలు ఎక్కువగా లేనప్పుడు మునగ కొమ్మలను కత్తిరించి కూడా నాటుకోవచ్చు. నాటిన తరువాత 3 నెలలకు మొదటి కోతను తీసుకోవచ్చు.

పోషక విలువలు:
పచ్చి మునగ ఆకుల్లో 16% మాంసకృత్తులు, 18% పీచుపదార్థాలు ఉంటాయి. ఎండిన ఆకులు లేదా పొడిలో 28% వరకు మాంసకృత్తులు, 15% పీచు పదార్థాలు, 3.65% కాల్షియం, 0.3% ఫాస్ఫరస్, 0.5% మెగ్నీషియం, 1.5% పొటాషియం, 8.25% కాపర్ ఉంటాయి. అంతేగాక జింక్, మాంగనీస్, ఐరన్ వంటి మూలకాలు అధిక మోతాదులో ఉంటాయి. పచ్చి మునగ ఆకుల్లో కొద్ది మొత్తంలో ‘సపోనిన’ అనే పదార్థాలు ఉండటం వల్ల కొద్దిగా చేదుగా ఉంటాయి. పచ్చి మునగ ఆకులను పాడి పశువులకు ప్రతీరోజు 5-10 కిలోల వరకు, దూడలకు 1-2 కిలోల వరకు ఇవ్వవచ్చు. ఎండిన మునగ ఆకులను లేదా మునగ పొడిని పాడి పశువులకు రోజుకు 200 గ్రాముల వరకు మరియు దూడలకు 50 గ్రాముల వరకు ఇవ్వవచ్చు.

ప్రయోజనాలు:

  • పశులు జీర్ణవ్యవస్థలో మీథేన్ అనే గ్యాస్ వెలువడుతుంది. పశువుల కడుపులో ఉండే మిథనోజెనిర్ బ్యాక్టీరియా ఈ గ్యాస్‌ని విడుదల చేస్తాయి. ఈ మీథేన్ గ్యాస్ పరిమాణం అనేది పశువులు తీసుకునే ఆహారాన్ని బట్టి విడుదలవుతుంది. పశువుల మేతలో మునగ ఆకును లేదా పొడిని ఇచ్చినట్లయితే ఈ బ్యాక్టీరియా సంఖ్య తగ్గి మీథేన్ గ్యాస్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దీనివల్ల వాతావరణంలో కొంతమేర మీథేన్ గ్యాస్ విడుదల తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది.
  • పాడి పశువుల్లో పాల దిగుబడి పెరగడమే కాకుండా, పాలల్లో వెన్నశాతం పెరుగుతుంది.
  • పశువులు, దూడల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • పాడిపశువులు ఈనిని తరువాత మళ్ళీ త్వరగా ఎదకు రావడం మరియు చూడికట్టడం వంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • కాల్షియం అధికంగా ఉండటం వలన ఎదిగే దూడల్లో ఎముకలు పటిష్టంగా తయారవుతాయి.
  • అనేక పోషకాలు ఉండటం వల్ల పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు రాకుండా ఉంటాయి.

డా.డి. వెంకటేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పశుగణ సముదాయం, పశువైద్య కళాశాల, కోరుట్ల, ఫోన్: 9951534076

Read More

తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు, మేకల్లో స్థానిక విషపూరిత మొక్కలు, వాటి యొక్క ప్రబావం

తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు, మేకల పెంపకం కొంతమంది రైతులకు ముఖ్యమైన ఉపాధి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఇచ్చే పశుపాలనగా ఇది గుర్తింపు పొందింది. అయితే, మారుతున్న వాతావరణ పరిస్థితులు, అడవుల తగ్గుదల, పచ్చిక కొరత, పశుపోషణ లోపాల వల్ల గొర్రెలు, మేకలు తినరాని కొన్ని స్థానిక మొక్కలను తిని విషబాధకు గురవడం మన రాష్ట్రంలో తరచూ కనిపిస్తోంది. ఈ సమస్య వల్ల జంతువులు అనారోగ్యానికి గురై, కొన్నిసార్లు మరణించడమూ జరుగుతుంది. అందుకే రైతులు ఈ విషయంలో అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.

విషపూరిత మొక్కలు అంటే ఏమిటి?
గొర్రెలు, మేకలు సాధారణంగా పచ్చిక, ఆకులు, కొమ్మలు తింటాయి. కానీ కొన్ని మొక్కల్లో సహజంగానే విషపదార్థాలు ఉంటాయి. అలాంటి మొక్కలను జంతువులు తిన్నప్పుడు ఆ విషపదార్థాలు శరీరంలోకి వెళ్లి జీర్ణక్రియ, నరాలు, కాలేయం, మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. దీనినే మొక్కల వల్ల వచ్చే విషబాధ అంటారు.

ఈ విషబాధ ఎక్కువగా:
• వేసవిలో పచ్చిక కొరత ఉన్నప్పుడు
• కరవు పరిస్థితుల్లో
• అడవుల్లో మేపేటప్పుడు
• పొలాల అంచుల్లో నిర్లక్ష్యంగా మేపినప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది.

తెలంగాణలో సాధారణంగా కనిపించే విషమొక్కలు

లంతెన (గండ్ల పూల చెట్టు)

ఈ మొక్క తెలంగాణ అంతటా విస్తృతంగా కనిపిస్తుంది. దీని ఆకులు, పువ్వులు తిన్న గొర్రెలు, మేకల్లో:
• ఆకలి తగ్గిపోవడం
• నోరు పచ్చగా మారడం
• కడుపు ఉబ్బడం
• బలహీనత
• క్రమంగా చనిపోవడం కనిపిస్తాయి.

తుమ్మ చెట్టు

తుమ్మ ఆకులు ఎక్కువగా తింటే:
• నోటిలో గాయాలు
• మేత తినకపోవడం
• జీర్ణక్రియ లోపించడం వంటివి వస్తాయి

కందగడ్డి / అడవి కంద

ఇవి తిన్నప్పుడు:
• వాంతులు
• విరేచనాలు
• నడవలేకపోవడం
• అకస్మాత్తుగా పడిపోవడం కనిపిస్తాయి.

నల్ల ఉసిరి / అడవి ఉసిరి

ఇది తినడం వల్ల:
• కాలేయానికి నష్టం
• కళ్లు పసుపు రంగులో మారడం
• మూత్రం ముదురు రంగులో రావడం వంటివి కనిపిస్తాయి.

అడవి పొగాకు

ఈ మొక్క తిన్న మేకల్లో:
• నరాల బలహీనత
• వణుకు
• శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
• చనిపోవడం కూడా జరుగుతుంది.

విషబాధకు కారణాలు

  1. పచ్చిక కొరత వేసవిలో పచ్చిక దొరకకపోవడంతో జంతువులు దొరికిన మొక్కలన్నీ తింటాయి.
  2. ఖనిజాల లోపం ఉప్పు, ఖనిజాల లోపం ఉన్నప్పుడు జంతువులు అసాధారణంగా ఇతర మొక్కలను తింటాయి.
  3. అడవుల్లో నిర్లక్ష్య మేపకం అడవుల్లో ఎటువంటి నియంత్రణ లేకుండా మేపితే విషమొక్కలు తినే ప్రమాదం ఎక్కువ.
  4. పొలాల్లో రసాయనాల ప్రభావం మందులు పిచికారీ చేసిన తర్వాత మేపడం వల్ల విషబాధ వస్తుంది.

లక్షణాలు (గుర్తించే విధానం)
విషమొక్కలు తిన్న గొర్రెలు, మేకల్లో సాధారణంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి:
• మేత తినకపోవడం
• ఎక్కువగా నోరు నుంచి నురుగు రావడం
• కడుపు నొప్పి, ఉబ్బరం
• విరేచనాలు లేదా మలబద్ధకం
• నడవలేక కూలిపోవడం
• శ్వాస వేగంగా తీసుకోవడం
• అకస్మాత్తుగా మరణం

లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలి.
చికిత్స (ప్రాథమిక చర్యలు)

  1. వెంటనే వెటర్నరీ డాక్టర్‌కు సమాచారం ఇవ్వాలి
  2. అనుమానాస్పద మొక్కలు తినకుండా జంతువులను వేరుచేయాలి
  3. శుద్ధమైన నీరు ఇవ్వాలి
  4. డాక్టర్ సూచన మేరకు:
    o యాంటీడోట్ మందులు
    o గ్లూకోజ్ డ్రిప్
    o కాలేయ రక్షక మందులు ఇవ్వాలి

గమనిక: ఇంటి చిట్కాలు వాడకూడదు, తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకోవాలి.

నివారణ చర్యలు (అత్యంత ముఖ్యమైనవి)
• పశువులకు సరిపడా పచ్చిక, ఎండుగడ్డి అందించాలి
• ఉప్పు, ఖనిజ మిశ్రమం తప్పనిసరిగా ఇవ్వాలి
• పొలాల అంచుల్లో, అడవుల్లో విషమొక్కలను తొలగించాలి
• మందులు పిచికారీ చేసిన పొలాల్లో మేపకూడదు
• రైతులకు విషమొక్కలపై శిక్షణ ఇవ్వాలి

సారాంశం
తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు, మేకల్లో స్థానిక మొక్కల వల్ల వచ్చే విషబాధలు రైతులకు పెద్ద నష్టాన్ని కలిగిస్తున్నాయి. కానీ సరైన అవగాహన, జాగ్రత్తలు, సమయానికి చికిత్స ద్వారా ఈ నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. పశువుల ఆరోగ్యం కాపాడితేనే రైతు ఆర్థికంగా ముందుకు సాగగలడు. అందుకే ప్రతి పశుపోషకుడు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం), Ph: 8121451017, కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్

Read More
  • 1
  • 2