ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన కౌలు ధరలు

ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఏడాది రబీ ఇంకా పూర్తిగా ముగియక ముందే పొలాలు కౌలుకు తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. సాగునీటి వసతి ఉన్న పొలాలైతే ఎకరాకు రూ.40 వేలు చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. మిరప సాగు అనుకూలించడమే దీనికి కారణం. ఈ ఏడాది వాతావరణంలో మార్పు కారణంగా జనవరి నుంచి మిరపలో నల్లతామర ప్రభావం తగ్గింది. తోటలు ఏపుగా పెరిగాయి. సగటున ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి లభిస్తోంది. అక్కడక్కడా ఎకరాకు 40-50 క్వింటాళ్లు వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. మిరప ధరలు క్రమంగా పెరుగుతూ సగటున క్వింటాలు రూ.20 వేలకు చేరాయి. పెట్టుబడులు పోగా కొంతైనా మిగులుతుందని, అప్పుల నుంచి ఎంతోకొంత బయటపడతామనే ఆశ రైతుల్లో ఉంది. విత్తన మొక్కజొన్న రైతులకూ అధిక దిగుబడులే వచ్చాయి. అందుకే వచ్చే ఖరీఫ్, రబీల్లో ఈ రెండు పంటల సాగుకు రైతులు మొగ్గు చూపిస్తున్నారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా పల్నాడు జిల్లాలో ఈ ఏడాది 1.10 లక్షల ఎకరాల్లో మిరప వేశారు. వచ్చే ఏడాది కూడా మిరప సాగు పెరుగుతుందని అంచనా. గురజాల, పెదకూరపాడు, మాచర్ల, చిలకలూరిపేటతో పాటు గుంటూరు జిల్లా తాడికొండ తదితర నియోజకవర్గాల్లో సాగు అధికం. గురజాల నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు ముందే చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం ప్రాంతంలో బోర్ల కింద ఉన్న భూములకు ఎకరా రూ.25 వేల నుంచి రూ. 30 వేల వరకు పలుకుతోంది.
“ఉమ్మడి అనంతపురం జిల్లాలో మిరప సాగు కొన్నేళ్లుగా పెరిగింది. హంద్రీ-నీవా, తుంగభద్ర హైలెవల్ కెనాల్ పరిధిలో మిరప విస్తృతంగా పండిస్తున్నారు. వచ్చే ఏడాది మళ్లీ మిరప వేసేందుకు పొలాలను కౌలుకు తీసుకుంటున్నారు. ఎకరాకు రూ. 40వేల నుంచి రూ.45వేల మధ్య చెల్లించేలా కౌలుకు తీసుకుంటున్నారు.

Read More

నల్లబర్లీ సాగును అరికట్టాలి

వ్యవసాయశాఖ ఎక్స్‌అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌

నల్లబర్లీ పొగాకు సాగును అరికట్టాలని, తెల్లబర్లీ పొగాకును సాగు చేసే రైతులు సంబంధిత కంపెనీలతో 100% కొనుగోలు ఒప్పందాలు చేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు వ్యవసాయశాఖ ఎక్స్‌ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ సూచించారు. బర్లీ పొగాకు సాగుపై గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ… తెల్లబర్లీ పొగాకు కొనుగోలుకు ఇకపై ప్రభుత్వం ఎలాంటి బాధ్యతా వహించదని, అనధికార నల్లబర్లీ పొగాకు సాగు కట్టడి చేయడంలో టాస్క్‌ఫోర్స్‌ బృందాల్ని చైతన్యం చేయాలని సూచించారు. గత ఏడాది మార్క్‌ఫెడ్‌ ద్వారా రాష్ట్రంలోనే మొదటిసారి 11,990 మంది రైతుల నుంచి 19.79 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోలు చేశామని, రూ.146 కోట్లు విడుదల చేశామని వివరించారు. తెల్లబర్లీ పొగాకు సాగుదారుల జాబితాతోపాటు కొనుగోలు ఒప్పందాల వివరాల్ని జత చేసి ఇవ్వాలని డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీని ఆదేశించారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగ పనితీరులో పశ్చిమగోదావరి జిల్లా అగ్రస్థానం

పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ రంగ పని తీరు సూచికల్లో 89 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఎన్టీఆర్‌ 82, కృష్ణా 80, శ్రీసత్యసాయి 80, నంద్యాల 78 స్కోర్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ‘ఏ’ గ్రేడ్‌లో 7 జిల్లాలు, ‘బి’ గ్రేడ్‌ 19 జిల్లాలు ఉన్నాయి. అన్నమయ్య 53, చిత్తూరు 59, శ్రీకాకుళం 61 స్కోర్లకు పరిమితమై అట్టడుగున నిలిచాయి.

ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తి పెరిగింది. గతేడాదితో పోలిస్తే సగటున 23.59% అధిక ఉత్పత్తి లభిస్తుందని అంచనా. దూది (పత్తి) ఉత్పత్తి కూడా గతేడాది కంటే 30.97% పెరుగుతుందని పేర్కొ న్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో అధిక ఉత్పత్తి లభించనుంది. మొక్కజొన్న ఉత్పత్తిలో ప్రకాశం, పల్నాడు జిల్లాలు తొలి స్థానాల్లో నిలిచాయి.

Read More