ఏరువాకలో ముందస్తు సందడి

  • రాష్ట్రంలో మొదలైన వానాకాలం సీజన్‌
  • నారు పోస్తూ.. దుక్కులు దున్నుతూ పొలాల్లో రైతులు
  • 1.34 కోట్ల ఎకరాల సాగు లక్ష్యం
  • ప్రభుత్వపరంగా సన్నద్ధత

తెలంగాణా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించడంతో వానాకాలం సీజన్‌ మొదలైంది. రోజూ వర్షాలు కురుస్తుండటంతో రైతులు సైతం ముందస్తు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే వరి నారు పెంపకం ప్రారంభించగా, ఇతర పంటలకు దుక్కులు దున్ని విత్తనాలు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం కార్యాచరణ ప్రణాళిక అమలుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ సీజన్‌లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గత వానాకాలం సీజన్‌లో 1.29 కోట్ల ఎకరాల్లో సాగు కాగా.. ఈసారి అదనంగా 5 లక్షల ఎకరాలు ప్రతిపాదించింది. సాధారణంగా జూన్‌ నెలలో రైతులు పొలాలను దున్ని సాగుకు సిద్ధం చేసుకుంటారు. ఈసారి మార్చి నుంచే అడపాదడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. గత పది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు పంటల సాగుపై దృష్టి సారించారు.

రాష్ట్రంలో పదేళ్లుగా సాగు, ఉత్పత్తులు ఏటేటా పెరుగుతున్నాయి. ఆ మేరకు విత్తనాల సరఫరాకు వ్యవసాయశాఖ సిద్ధమవుతోంది. సన్న ధాన్యానికి బోనస్‌ దృష్ట్యా 40 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందుకోసం 16.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. వీటి కంటే అధిక అంచనాలతో 60.11 లక్షల ఎకరాల్లో సన్నాలు, 38.21 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు కలిపి 98.32 లక్షల ఎకరాలకు సరిపడా విత్తనాలను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. పత్తికి సైతం 1.08 కోట్ల ఎకరాలకు అవసరమైన విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. 

రాష్ట్రవ్యాప్తంగా విత్తనోత్పత్తి కోసం వచ్చే నెల 2న వ్యవసాయ విశ్వవిద్యాలయం సిద్ధం చేసిన విత్తనాలను గ్రామానికి ముగ్గురు చొప్పున ఆదర్శ రైతులకు పంపిణీ చేయనున్నారు. వ్యవసాయవర్సిటీ.. 3వ తేదీ నుంచి సాగు విత్తనాలను రైతులకు అందించనుంది. 

వానాకాలం సీజన్‌కు రాష్ట్రానికి 9.80 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో ఏప్రిల్‌, మే నెలల్లో 1.72 లక్షల టన్నులు వచ్చింది. వచ్చే నెల మొదటి వారం నుంచి పంపిణీ చేసే అవకాశం ఉంది.

పంటల బీమా అమలు:
ఈ సీజన్‌లో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రీమియంలో సగం కేంద్రం, మరో సగం రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నాయి. రైతులందరికీ పంటల బీమా వర్తింపజేయడంతో స్థూల పంట విస్తీర్ణంలో 98 శాతానికి ఈ పథకం వర్తిస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

నకిలీల నివారణపై దృష్టి:
రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, ఎరువుల బెడద లేకుండా పోలీసు, వ్యవసాయశాఖలు సంయుక్తంగా టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వరంగల్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌ జిల్లాల్లో ఈ బృందాలు దాడులు నిర్వహించి నకిలీ విత్తనాల ముఠాలను పట్టుకున్నాయి. ఎరువుల నివారణకు వ్యవసాయశాఖ ద్వారా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఈ నెల 5 నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం జరుగుతోంది.

Read More

రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి అనూహ్య స్పందన – PJTAU ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య

600 గ్రామాల్లో 37,000 రైతులతో అవగాహన కార్యక్రమం

  • రైతుల్లో అసంతృప్తి లేదు.. కానీ చేయాల్సింది చాలా ఉంది

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ సహకారంతో నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ రాష్ట్రవ్యాప్తంగా నిరాటంకంగా, విజయవంతంగా సాగుతోంది. మే 5వ తేదీన వికారాబాద్ జిల్లా ధరూర్ లో ఈ కార్యక్రమాన్ని శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ శ్రీ M. కోదండ రెడ్డి, PJTAU ఉపకులపతి డాక్టర్ అల్దాస్ జానయ్య లాంచనంగా ప్రారంభించారు. ఆరోజు నుండి ఈ కార్యక్రమం నేటి వరకు 600 గ్రామాల్లో నిర్వహించగా సుమారు 31,000 మంది పురుషులు, 6,000 మంది మహిళలు పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 37,000 మంది రైతులతో శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ విద్యార్థులు ముఖాముఖిగా మాట్లాడారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ MP డాక్టర్ మల్లురవి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ G. చిన్నారెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, ఎమ్మెల్సీలు, సుమారు 25 మంది శాసనసభ్యులు, వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ విద్యార్థులతో పాటు వారంలో ఒకరోజు ఉపకులపతి, ఇతర విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. PJTAU శాస్త్రవేత్తలు, విద్యార్థులు, వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు, అభ్యుదయ రైతులు, రైతు గ్రూపులు, సంఘాల ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఆరు అంశాలైన తక్కువ యూరియా వాడి సాగు ఖర్చును తగ్గించడం, అవసరం మేరకే రసాయనాలను వాడి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడడం, వివిధ ఇన్ పుట్స్ కొనుగోలుకు సంబంధించిన రశీదులని భద్రపరచుకోవడం, సాగునీటిని ఆదా చేయడం, పంట మార్పిడులను పాటించి సుస్థిరాదాయాన్ని పొందడం, చెట్లను నాటి పర్యావరణాన్ని రక్షించడం వంటి వాటిపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్ధులు రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే రైతులు అడుగుతున్న అనేక సందేహాలను శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో నివృత్తి చేస్తున్నారు.

ఉపకులపతి సమీక్ష :-

   మూడు వారాలుగా సాగుతున్న 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం పై ఉపకులపతి అల్దాస్ జానయ్య ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ కార్యక్రమానికి రైతాంగం నుంచి మంచి స్పందన వస్తుందని వివరించారు. ప్రభుత్వం రైతాంగానికి అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రస్తుత వ్యవసాయ పరిస్థితుల పై రైతాంగంలో ఎటువంటి అసంతృప్తి లేదని జానయ్య స్పష్టం చేశారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాల కారణంగా రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుందని తెలిపారు. అలాగే ఇంకా కొన్ని వ్యవసాయ అంశాలకి ప్రభుత్వపరంగా ప్రోత్సాహం ఇవ్వవలసిందిగా రైతులు కోరుతున్నారని జానయ్య అన్నారు.  ముఖ్యంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురయ్యే నష్టాల్ని అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం పంటల బీమా సదుపాయం ప్రవేశపెట్టాలని రైతులు కోరుకుంటున్నారని, అలాగే చిన్న, సన్నకారు రైతులకి ఆధునిక వ్యవసాయ పనిముట్లని మరియు పచ్చి రొట్ట విత్తనాలను రాయితీపై  అందించాలని, విస్తృతంగా భూసార పరీక్షలు నిర్వహించాలని రైతాంగం కోరుకుంటున్నారని అల్దాస్ జానయ్య వివరించారు. ఇదే స్ఫూర్తితో రైతు సోదరులు, మహిళలు, అభ్యుదయ రైతులు, రైతు గ్రూపులు, సంఘాల ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని  దీన్ని ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఉపకులపతి కోరారు.
Read More