మొక్క జీవితకాలం పెంపుకు ఐ.యం.ఓ. ద్రావణం

మొదట కడిగిన బియ్యాన్ని ఉడకబెట్టి ఒక చెక్క పెట్టెలో వుంచి దాన్ని చెట్టు కింద నీడలో గుంత తీసి పూడ్చి పెట్టాలి. నాలుగు రోజుల తరువాత దానిని వెలికితీయాలి. దీనిని చో మెధడ్‌లో ఐయంఓ (ఇండీజినిస్ మైక్రో ఆర్గానిజమ్)గా వ్యవహరిస్తారు. ఇందులో బెల్లాన్ని కలిపితే ఐయంఓ తయారవుతుంది. దీన్ని నిలువ వుంచుకుని మొక్కలకు స్ప్రే చేయాలి. దీనివల్ల మొక్కకు అన్ని రకాలైన పోషకాలు అంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొక్క జీవితకాలం కూడా పెరుగుతుంది.

గమనికః మొదటగా లీటర్ నీరు నిలువ వుంచడానికి లీటరున్నర పాత్రను తీసుకోవాలి. అపుడే బాక్టీరియా పాత్రలో ప్రవేశించడానికి అవకాశముంటుంది.

Read More

పంటకాలం పెరుగుదలకు ‘వండర్ ఆయిల్స్’

ప్రతి మొక్క దాని తరువాత తరం కోసం కావలసిన అన్ని పోషక పదార్థాలను గింజలలో దాచుకుంటుంది. ఆ గింజలో శక్తిని నూనెగా మార్చి అదే మొక్కకు అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో మెదక్ జిల్లా రైతు పొన్ను స్వామి చాలా ప్రయోగాలు చేశారు. తక్కువ ఖర్చుతో లభించే నూనెలను నీటిలో కరిగించి మొక్కలకు డ్రిప్ ద్వారా, పిచికారి ద్వారా అందించి ప్రత్తి, చెరకు, బొప్పాయి, అరటి, కూరగాయల పంటలలో అద్భుతమైన దిగుబడులు సాధించారు. ఉదాహరణకు ప్రత్తి పంటకు అర లీటరు ప్రత్తి నూనెలో 50 మి.లీ. ఎమల్షన్ కలిపి ఆ ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి డ్రిప్ ద్వారా లేదా పిచికారి చేసి అందించారు. అపుడు నూనె నీటిలో కలిసిపోయి పాలలా తెల్లగా మారింది. దీనితోపాటు కానుగ నూనె, వేరుశనగ నూనె, ప్రొద్దు తిరుగుడు నూనె, వేప నూనె వంటి రకరకాల నూనెలను మార్చి మార్చి అందించడం వలన మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు అందుతాయి. ఇలా వారానికి ఒకసారి నూనెలను అందించడం వలన మొక్కలలో రోగ నిరోధకశక్తి పెరిగి చీడపీడలను తట్టుకుంటాయి. పంటకాలం పెరిగి రైతు అధిక దిగుబడులను పొందే అవకాశం కలుగుతుంది. అంటే 4 నెలలు దిగుబడి వచ్చే పంట 6 నెలల వరకు కూడా దిగుబడులనిస్తుంది. 

ఈ పద్ధతిని ఖమ్మం జిల్లా కోయచలకకు చెందిన రైతు రామారావు అనుసరించి తన కూరగాయల తోటలో రెట్టింపు దిగుబడులు పొందారు. రామారావు స్ఫూర్తితో సక్రూనాయక్, పెదవడ్లపూడి గ్రామానికి చెందిన ధర్మేందర్, చింతలలంక గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు వంటి రైతులు పుచ్చ, బంతి, బీర, బొప్పాయి పంటలలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తున్నారు.

నూనెల మిశ్రమం : నూనెల మిశ్రమం తయారీకి ఎమల్సిఫయర్‌కు బదులు లీటరు నూనెను రెండు కోడిగుడ్ల సొన కలిపి మిక్సీలో వేసి 5 నుంచి 10 నిమిషాలు తిప్పాలి. దీంతో నూనె నీటిలో కరిగేవిధంగా తయారవుతుంది.

Read More

మొక్క పెరుగుదలకు దోహదపడే ‘చేప కునప జలం’

కావలసిన పదార్థాలు:
తాజా చేప ముక్కలు : కిలో
దేశీ ఆవు మూత్రం : 5 లీటర్లు, నల్లబెల్లం – కిలో
దేశీ ఆవు నెయ్యి : 50 గ్రా, తేనె – 50 గ్రా

చేప కునప జలం ఇంచుమించు ‘మీనామృతం’ మాదిరిగానే పంటలపై పనిచేస్తుంది.

తయారుచేసే పద్ధతి: ఒక కిలో తాజా చేపలను ముక్కలుగా కోయాలి. వాటికి ఒక కిలో నల్లబెల్లం పొడిని కలపాలి. 50 గ్రాముల ఆవు నెయ్యి, 50 గ్రాముల తేనె కూడా కలిపి 30 నిమిషాలు ఉంచాలి. తరువాత ఒక మట్టికుండలో గాని, ప్లాస్టిక్ పాత్రలో గాని 5 లీటర్ల ఆవు మూత్రం పోసి అందులో ఈ మిశ్రమాన్ని కలపాలి. పాత్ర మీద మూత ఉంచి శుభ్రమైన గుడ్డతో బిగించి కట్టాలి. రోజుకొకసారి ఈ మిశ్రమాన్ని కలుపుతూ 20 రోజుల పాటు చల్లని గదిలో ఉంచి మురగబెట్టాలి. తయారైన చేప కునప జలాన్ని వడకట్టి వాడుకోవచ్చు. 100 లీటర్ల నీటికి 3 లీటర్ల చొప్పున దీన్ని కలిపి మె°క్కలపై పిచికారీ చేయాలి. ఇది 2 నెలల వరకు నిల్వ ఉంటుంది.

వాడే విధానం : 3 నుండి 5 శాతం ద్రావణాన్ని ఏ పంటపైనయినా ఉదయం, సాయంత్రం వేళల్లో పిచికారి చేయవచ్చు.

ఫలితాలు :

  • భూమికి అద్భుతమైన పోషకాలనందిస్తుంది.
  • మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది.
  • దీనిని సులభంగా తయారు చేయవచ్చు.
  • మొక్కలకు అద్భుతమైన టానిక్‌లా పనిచేస్తుంది.
Read More

నేల సారవంతానికి ‘గార్బేజ్ ఎంజైమ్‌’

గార్బేజ్ ఎంజైమ్‌ను థాయ్‌లాండ్‌కి చెందిన డా. రోసుకాన్ ఆవిష్కరించారు.

తయారీవిధానం : కూరగాయలు, పండ్ల తొక్కలు, ముక్కలు, మార్కెట్లో చెత్త కుప్పలో వేసిన మిగలపండిన పండ్లు, కూరగాయల వ్యర్థాలకు కొంచెం నల్లబెల్లం లేదా మొలాసెస్ లేదా సేంద్రియ పంచదార కలిపి 90 రోజులు మురగబెడితే గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది.

కావలసిన పదార్థాలు :

  • మూత బిగుతుగా పెట్టడానికి వీలుపడే గాజు లేదా ప్లాస్టిక్/ఫైబర్ డ్రమ్ము
  • కూరగాయలు, పండ్ల వ్యర్థాలు (తొక్కలు, మొక్కలు కుళ్ళినవి 3 పాళ్ళు)
  • నల్లబెల్లం లేదా మొలాసెస్ లేదా సేంద్రియ (బ్రౌన్) సుగర్ – 1 పాలు
  • నీరు Ð 10 పాళ్ళు

పైవాటినిన్నంటినీ బాగా కలపాలి. దుకాణాల్లో మిగిలిపోయిన, కుళ్ళిపోయిన కూరగాయలు, పండ్లను ముక్కలు చేసి కలపవచ్చు. మిగిలిపోయిన అన్నం, కూరలు కూడా కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి గాలిచొరబడకుండా గట్టిగా మూత బిగించాలి. ఎండ తగులకుండా సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాలి. మొదటి 30 రోజుల పాటు, రోజుకోసారి మూత తీసి వాయువులు బయటికి వెళ్ళాక, మరలా గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత 60 రోజుల పాటు మూత తీయనక్కర్లేదు. 90 రోజులకు గార్బేజ్ ఎంజైమ్ సిద్ధమవుతుంది. ద్రావణం పులియటం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది. మొత్తం 90 రోజులు గడిచాక ద్రావణాన్ని వడపోసి నిల్వ చేసుకుని 60 రోజుల వరకు వాడుకోవచ్చు. వడపోతలో వచ్చిన వ్యర్థాలను ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. లేదా మళ్ళీ గార్బేజ్ ఎంజైమ్ తయారీకి వాడవచ్చు.

ప్రయోజనాలు : దీనిలో ఉన్న సూక్ష్మ జీవరాశులు, ఔషధ గుణాలు నేలను సారవంతం చేస్తాయి. ఇది సహజ ఎరువుగా, కీటకనాశినిగా, శిలీంద్ర, బాక్టీరియా, వైరస్ తెగుళ్ళ నివారణిగా పనిచేస్తుంది. దీనిని వాడితే పంటల్లో నత్రజనిని గ్రహించే శక్తి పెరుగుతుంది. దీనిని నీటిలో తగినపాళ్ళలో కలిపి వాడుకోవాలి.

  • ఎరువుగా : 1:1000 పాళ్ళలో కలిపి నేలలో పోయవచ్చు. లేదా పంటలపై పిచికారి చేయవచ్చు.
  • పురుగులు / తెగుళ్ళ నివారణకు : 1:100 పాళ్ళలో కలిపి పిచికారి చేయవచ్చు.
  • దిగుబడి పెంచడానికి : 1:500 పాళ్ళలో కలిపి పిచికారి చేయాలి.
  • పశుపోషణకు, కోళ్ళ పెంపకానికి ఉపయోగించవచ్చు.
  • ఇల్లు, మరుగుదొడ్డి పరిశుభ్రతకు వాడవచ్చు.
Read More