భారత మామిడి పండ్లలో పురుగుమందులు అధికంగా ఉన్నాయని, సరిహద్దు ప్రాంతాల్లో క్వారంటైన్ సౌకర్యాలు సరిగ్గా లేవని మామిడి పండ్ల దిగుమతిపై నేపాల్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. భారత మామిడిపండ్లపై నిషేధం స్థానిక మామిడి రైతులకు ఉపకరించనుందని మధేష్ ప్రావిన్సు భూ నిర్వహణ, వ్యవసాయ సహకార మంత్రిత్వశాఖ సమాచార అధికారి అజయ్ గ్యావాలి చెప్పారు. భారత్ నుంచి అరటి దిగుమతులు నిలిచిపోయిన కారణంగా.. ఇక్కడ అరటిపళ్ల ధర రెట్టింపయింది. ఇప్పుడు మామిడిపై ఆంక్షలతో రానున్న రోజుల్లో స్థానికంగా వాటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. భారత మామిడిపై పూర్తి ఆంక్షలను విధించేందుకు బదులుగా సరిహద్దు క్వారంటైన్ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి వారు సూచిస్తున్నారు.