అధిక రసాయన ఎరువుల వాడకంతో భూమి సారం కోల్పోయి రసాయనమయంగా మారుతోందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్‌స్వామి అన్నారు. రైతుల శ్రేయస్సు, సహజ సాగు విధానాలపై అవగాహన కోసం ఆయన మంగళవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ప్రధాన కూడలి వరకూ రైతు సుఫలా యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక బౌద్ధ మహా స్తూపం వద్దనున్న సిద్ధార్థ యోగా విద్యాలయంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని చినజీయర్ మాట్లాడారు. భూమికి సైతం విరామం అవసరమని, పంటల మార్పిడి, వ్యవధి పాటించడం వంటి పద్ధతులతో ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. సేంద్రియ ఎరువుల వాడకంతో సగానికి పైగా సమస్య పరిష్కార మవుతుందన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు చినజీయర్‌కు నాగలి బహూకరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వైద్యులు డా. పద్మారామచంద్రారావు, పర్యావరణవేత్త విజయ్‌రాం, సీపీఐ నాయకుడు నారాయణ, రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీనివాస్, ఏర్నేని రామారావు, రైతునేస్తం వెంకటేశ్వరరావు, గున్నా రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.