వ్యవసాయ యోగ్యంగా పోడు భూములు

తెలంగాణలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని రూపొందించింది. పోడు భూముల్లో సేద్యం చేస్తున్న రైతులందరికీ రానున్న ఐదేళ్లలో (2025-26 నుంచి 2029-30 వరకు) సోలార్‌ పంపు సెట్ల ద్వారా నీటివసతి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఒక్కో యూనిట్‌కు రూ. 6 లక్షల చొప్పున ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ. 12,600 కోట్లు ఖర్చు చేయనుంది. తొలి ఏడాది రూ.600 కోట్లు… తర్వాత ఒక్కో ఏడాదికి రూ.3,000 కోట్ల చొప్పున వ్యయం చేస్తుంది. ఈ నెల 18న నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మాచారంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఈనెల 18న ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్‌ ఎ. శరత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

2025-26 కార్యాచరణ
మండలాల వారీగా ఈనెల 25 వరకు అర్హులైన ఎస్టీ రైతులను గుర్తించాలి. జూన్‌ 10 వరకు క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన, భూగర్భ జలాల సర్వే, ఇతర అంచనాలు రూపొందించాలి. జిల్లా స్థాయిలో ఈ నెల 30 నాటికి సర్వే, ఇతర పనులకు టెండర్లు పిలిచి, ఖరారు చేయాలి. జూన్‌ 25 నాటికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇన్‌ఛార్జ్‌ మంత్రి అనుమతితో పనులు అప్పగించాలి. జూన్‌ 26 నుంచి 2026 మార్చి 31 వరకు భూముల అభివృద్ధి, బోరుబావుల తవ్వకం, సోలార్‌ పంపుసెట్ల ఏర్పాటు, ఉద్యాన పంటల అభివృద్ధి పనులు చేసి, యూనిట్ల వినియోగపత్రాలను సమర్పించాలి.

రైతుల అర్హతలు: – అటవీ హక్కుల చట్టం (2006) కింద 6.69 లక్షల ఎకరాలపై 2.30 లక్షల మంది ఎస్టీ రైతులకు పోడుపట్టాలు మంజూరయ్యాయి. 2.10 లక్షల మంది రైతుల అధీనంలోని 6 లక్షల ఎకరాల భూములకు విద్యుత్తు సౌకర్యం లేదు.. వీటికి పూర్తి రాయితీతో సోలార్‌ పంపుసెట్లు ఏర్పాటు చేసి, నీటివసతి కల్పిస్తారు.

  • రైతుకు రెండున్నర ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్‌ యూనిట్‌గా పరిగణిస్తారు. అంతకు తక్కువుంటే పక్కనే ఉండే 2-5 మంది రైతులతో బోర్‌వెల్‌ యూజర్‌ గ్రూపుగా ఏర్పాటు చేస్తారు. ఇది సాధ్యం కాకుంటే ఓపెన్‌ వెల్‌ గ్రూప్‌ ఏర్పాటు చేస్తారు. జిల్లాస్థాయిలో పథకం అమలు, కొనుగోళ్ల కమిటీ కలెక్టర్‌ చైర్మన్‌గా ఉంటారు.
  • అధిక విస్తీర్ణంలో పోడు భూములున్న భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌, ఖమ్మం, ములుగు, నిర్మల్‌, కామారెడ్డి, నల్గొండ, వరంగల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, నాగర్‌కర్నూల్‌ను ప్రత్యేక జిల్లాలుగా గుర్తించారు. తక్కువ విస్తీర్ణంలో భూములున్న జిల్లాలను సమీపంలోని ఇతర జిల్లాలతో కలిపి 5 నోడల్‌ జిల్లాలుగా ప్రకటించారు.
Read More

వ్యవసాయ పంపుసెట్లకు… రూ.508 కోట్లతో విద్యుదీకరణ పథకం

తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్తు సంస్థ కొత్తగా వ్యవసాయ పంపు సెట్ల విద్యుదీకరణ పథకాన్ని రూపొందించింది. రూ. 508.95 కోట్ల విలువైన ఈ పథకానికి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట, సరూర్‌నగర్‌, మెదక్‌, వికారాబాద్‌, యాదాద్రి, నారాయణపేట్‌, రాజేంద్రనగర్‌, గద్వాల్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఆపరేషన్‌ సర్కిళ్లకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ప్రస్తుత విద్యుత్తు లైన్లకు దూరంగా ఉన్న పొలాలకు ఈ పథకంలో ప్రాధాన్యమివ్వనున్నారు. ఈ పథకం కింద 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి నాలుగైదు హెచ్‌పీ పంపు సెట్లకు కనెక్షన్‌ ఇవ్వనున్నారు. 25కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌, దానికి అవసరమైన 11 కేవీ కండక్టర్‌, ఎల్‌టీ కేబుల్‌, పోల్స్‌ వంటివి ఏర్పాటు చేయాలంటే దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంది. ఒక్కో కనెక్షన్‌కు రూ. 75 వేల వ్యయం కానుంది. ఒక వ్యవసాయ కనెక్షన్‌కు రైతు చెల్లించేది రూ. 5 వేలు మాత్రమే. మిగిలిన రూ. 70 వేలను ప్రభుత్వం రాయితీ కింద భరించనుంది. దీనికి సంబంధించిన పనులన్నీ సంస్థ పరిధిలోనే జరుగుతాయి.

Read More