90 లక్షల టన్నుల ధాన్యం ఈ యాసంగిలో ఉత్పత్తి అవుతుంది

“తెలంగాణలో యాసంగి పంటలో వచ్చే ధాన్యం ఉప్పుడు బియ్యం మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ నుంచి 30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డితో కేంద్ర మంత్రిని దిల్లీలో కలిసి ఈ అంశంపై చర్చించారు. దేశవ్యాప్తంగా ఈ బియ్యానికి డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ విభాగం అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఇందులో మొత్తం 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (5% నూకతో), 5 లక్షల మెట్రిక్ టన్నుల ముడి బియ్యం (10% నూకతో) సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం” అని రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రికి వినతిపత్రమిచ్చారు. 2014-15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించి రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఎం కోరారు. రాష్ట్రంలో ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నామని, దీని కారణంగా పౌర సరఫరాలశాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే బకాయిలు విడుదల చేయించాలని విన్నవించారు. ఉప్పుడు బియ్యం సరఫరాకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి చేసిన ప్రతిపాదనలకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Read More

ధాన్యం సేకరణపై పౌరసరఫరాల సంస్థ కార్యాచరణ

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లాలవారీగా ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు కార్యాచరణ సిద్ధం చేసింది. కొనుగోలు కేంద్రాల సంఖ్యనూ ఖరారు చేసింది. 5 లక్షల టన్నులకు పైగా ధాన్యం సేకరణ లక్ష్యంలో నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలు ఉన్నాయి. ఆ తర్వాత నల్గొండ, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలున్నాయి. హైదరాబాద్‌ మినహా మిగతా 32 జిల్లాల్లో 39.08 లక్షల టన్నుల సన్నాలు, 35.91 లక్షల టన్నుల దొడ్డు రకాలు సేకరించాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
సన్నాలు, దొడ్డు రకాలు కలిపి- ఖమ్మం జిల్లాలో 2,78,892 టన్నులు కొనాలని అంచనా. 326 కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. సిరిసిల్లలో 2,44,522 టన్నులు, 244 కేంద్రాలు, నారాయణపేట 2,35,917 -117, మహబూబ్‌గర్‌ 2,26,418 – 190, భువనగిరి 2,26,410- 325, కొత్తగూడెం 2,23,272-193, మహబూబాబాద్‌ 2,18,373 – 237 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనున్నారు.

Read More