2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో తెలంగాణలో ఉత్పత్తి అయిన మినుము పంటలో 100%, పెసర, సోయాబీన్‌ పంటలో 25% చొప్పున కనీస మద్దతు ధరతో ప్రధానమంత్రి అన్నదాత ఆదాయ సంరక్షణ పథకం కింద సేకరించడానికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆమోద ముద్ర వేశారు. తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో పప్పు దినుసులు, నూనెగింజల పంటల సేకరణపై ఆయా రాష్ట్రాల మంత్రులు, సీనియర్‌ అధికారులతో సోమవారం కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించి ఈ మేరకు హామీ ఇచ్చారు. నాలుగు రాష్ట్రాల్లో ఆయా పంటల సేకరణకుగానూ రూ. 15,095 కోట్లు ఖర్చుచేయనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో ఉత్పత్తి అయిన పెసర పంటలో 25% (దాదాపు 4,430 టన్నులు) ధరల మద్దతు పథకం కింద కొనుగోలు చేస్తారు. నాఫెడ్‌ ద్వారా కంది, మినుము, మసూర్‌ పప్పు 100% కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.